ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 3

1. అది అహష్వేరోషు రాజు పరిపాలనాకాలము. అతని రాజ్యము నూట యిరువది యేడు రాష్ట్రములతో హిందూదేశమునుండి కూషు వరకు వ్యాపించియుండెను.

2. ఆ రాజు ఘాషను నగరమును తన రాజధానిగా సింహాసనాసీనుడై రాజ్యము చేయు చుండెను.

3. అతడు తన యేలుబడి మూడవయేట గొప్పవిందుచేసి మంత్రులను ఉద్యోగులను ఆహ్వా నించెను. పర్షియా, మాదియా రాజ్యముల సైన్యాధిపతులను రాష్ట్రపాలకులను, ప్రముఖులను విందునకు పిలిపించెను.

4. ఆ విందు ఆరునెలలపాటు కొనసాగెను. ఆ ఉత్సవము నందు రాజు తన సిరిసంపదలను, తన మహావైభవమును ఎల్లరియెదుట ప్రదర్శించెను.

5. అటు తరువాత రాజు తన రాజధాని షూషను నగరమునందలి పౌరులకు, ధనికులకు, పేదలకు మరియొక విందు చేయించెను. ఈ విందు రాజు ఉద్యానవనమున ఏడుదినములపాటు నడచెను.

6. ప్రాసాద ప్రాంగణమును సుందరముగా అలంకరించిరి. నీలపుతెరలు, తెల్లనితెరలు, మేలిమి పట్టుదారములకు కూర్చి వానిని పాలరాతి కంబముల మీది వెండి కడియములనుండి వ్రేలాడగట్టిరి. చలువరాళ్ళను రకరకముల రంగులతో కూడిన విలువగల రాళ్ళను పరచిన నేలమీద వెండిబంగారములు పొదిగిన ఆసన ములు అమర్చిరి.

7. పానీయములు సేవించుటకు పలువిధములైన పానపాత్రములు కొనివచ్చిరి. రాజు హోదాకు తగినట్లుగా ద్రాక్షసారాయమును సమృద్ధిగా సరఫరా చేసిరి.

8. మధువునకు పరిమితియేలేదు. ఎవరికి వలసినంత వారు సేవింపవచ్చునని రాజు ముందుగనే పరిచారకులతో చెప్పెను.

9. అప్పుడు వష్టిరాణి ప్రాసాదము లోపల స్త్రీలకు మరియొక విందు ఏర్పాటు చేసెను.

10. ఏడవనాడు రాజు ద్రాక్ష సారాయము సేవించి సంతుష్టిచెంది తన సేవకులైన ఏడుగురు నపుంసకులను పిలిపించెను. వారి పేర్లు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, సేతారు, కర్కసు.

11. వారందరు వెళ్ళి కిరీటధారిణియైన వష్టిరాణిని తన ఎదుటికి తోడ్కొనిరావలెనని రాజు ఆజ్ఞాపించెను. ఆ రాణి మిగుల సౌందర్యవతి. అతిథులుగా వచ్చిన అధికారులకు, ప్రజలకు, ఆమె సౌందర్యమును చూపింపవలెనని రాజు వేడుకపడెను.

12. కాని సేవకులు వెళ్ళి రాజు ఆనతి ఎరిగింపగా వష్టిరాణి ప్రజలెదుటికి రానొల్లదయ్యెను. కనుక రాజు ఉగ్రుడైపోయెను.

13. అతడు నీతికోవిదులను, సలహా అడిగెను. న్యాయాన్యాయములను విచారించునపుడు న్యాయవేత్తలను సంప్రదించుట అతని ఆచారము.

14. రాజు పిలిపించిన న్యాయవేత్తల పేర్లు: కర్షేనా, షెతారు, అద్మాతా, తార్షీషు, మెరెసు, మర్సేనా, మెమూకాను. రాజు వీరిని తరచుగా సంప్రదించెడివాడు. ఈ ఏడుగురు మాదీయ, పర్షియాలకు అధికారులు, ఆ సామ్రాజ్యమున ఉన్నతపదవులు అలంకరించినవారు.

15. అతడు వారిని చూచి "అహష్వేరోషు ప్రభువు సేవకుల నంపగా వష్టిరాణి అతని ఆజ్ఞను త్రోసిపుచ్చెను. న్యాయశాస్త్రము ప్రకారము ఆమెకెట్టి శిక్ష విధింపవలెను?” అని ప్రశ్నించెను.

16. అప్పుడు రాజు, రాజోద్యోగులు వినుచుండగా మెమూకాను “వష్టిరాణి ప్రభువుల వారికి మాత్రమేగాక రాజకీయోద్యోగులకును, ఈ సామ్రాజ్యమునందలి మగవారికెల్లరకును కూడ తలవంపులు తెచ్చెను.

17. రాణి చరితము విని ఇక ఈ సామ్రాజ్య మునందలి స్త్రీలెల్లరు, తమ భర్తలను నిర్లక్ష్యము చేయుట తథ్యము. అహష్వేరోషు ప్రభువు ఆజ్ఞాపించినను వష్టిరాణి అతని సమ్ముఖమునకు రాలేదట అని ఆడువారెల్లరు గుసగుసలాడుకొందురు.

18. మాదీయ పారశీకరాజ్యముల అధికారుల భార్యలుకూడ తెల్లవారక మునుపే రాణి ధిక్కార వార్తలను విందురు. రేపటినుండి వారును తమ భర్తల ఆజ్ఞలను తిరస్కరింతురు. ఎల్లెడల భార్యలు తమ భర్తలను చులకనచేయగా ఆ భర్తలు తమ భార్యలమీద మండిపడుదురు.

19. కనుక ప్రభువుల వారికి సమ్మతమగునేని వష్టిరాణి మరల ఏలినవారి సమ్ముఖమునకు రాగూడదని శాసనము చేయింపుడు. దీనిని మాదీయ పారశీక శాసనములలో చేర్చి తిరుగులేని దానినిగా చేయింపుడు. దేవరవారు ఆమెకంటె యోగ్యురాలైన వనిత నెన్నుకొని రాణిగా నియమింపుడు.

20. ఈ రాజశాసనమును సువిశాలమైన మన సామ్రాజ్యము అంతట ప్రకటన చేయింపుడు. అప్పుడు స్త్రీలెల్లరు, తమ భర్తలు ధనికులైనను, దరిద్రులైనను వారి చెప్పు చేతలలో ఉందురు” అని పలికెను.

21. రాజునకు, అతని అధికారులకు ఈ ఉపదేశము నచ్చెను. కనుక రాజు మెమూకాను చెప్పినట్లే చేయించెను.

22. అతడు తన రాష్ట్రములకెల్ల లేఖలు పంపించెను. ప్రతి రాష్ట్రమునకు, అచటి భాషలో, లిపిలో జాబులు వ్రాయించెను. ప్రతి భర్త తన యింట సర్వాధికారము నెరపునని తెలియజేయించెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services