ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 7వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ఆ వార్త విని కిర్యత్యారీము పౌరులు దిగివచ్చి, ప్రభుమందసమును కొనిపోయి కొండ పైనున్న అబీనాదాబు ఇంటజేర్చిరి. అతని కుమారుడు ఎలియెజెరును శుద్ధిచేసి దైవమందసమును కాపాడు టకు నియమించిరి.

2. మందసము కిర్యత్యారీమున నెలకొనిన పిమ్మట ఇరువదియేండ్లు గడచిపోయెను. అప్పుడు యిస్రాయేలు ప్రజలకు మరల యావేమీద భక్తి కుదిరెను.

3. సమూవేలు ప్రజలతో “మీరు హృదయపూర్వకముగా యావే వద్దకు మరలి రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములనెల్ల వదలివేయుడు. అష్టోరోతును గూడ మీ చెంతనుండి గెంటివేయుడు. యావేపై మనసునిల్పి ఆ ప్రభుని మాత్రమే సేవింపుడు, అప్పుడతడు ఫిలిస్తీయుల బెడదనుండి మిమ్ము కాపాడును” అనెను.

4. ఆ ప్రకారముగా యిస్రాయేలీయులు బాలుదేవతను, అష్టోరోతును వదలివేసి ప్రభుని మాత్రమే సేవించిరి.

5. అంతట సమూవేలు “యిస్రాయేలు జనులు అందరు మిస్ఫావద్ద గుమికూడవలయును. అచ్చట మీ తరపున ప్రభువునకు విన్నపము చేసెదను” అని చెప్పెను.

6. కావున ప్రజలందరు మిస్పావద్ద ప్రోగై, నీళ్ళుతోడి యావే ముందట కుమ్మరించిరి. ఆ దినము ఉపవాసముండి 'యావే ఆజ్ఞమీరి అపరాధము చేసితిమి' అని ఒప్పుకొనిరి. మిస్పాయొద్దనే సమూవేలు యిస్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చెను.

7. యిస్రాయేలు జనులు మిస్ఫావద్ద గుమిగూడి యున్నారని ఫిలిస్తీయులు వినిరి. వెంటనే వారి నాయకులు యిస్రాయేలుపై దాడికి వెడలిరి. ఈ వార్త చెవినిబడగనే యిస్రాయేలీయులకు గుండెచెదరెను.

8. వారు సమూవేలును చేరి, ఫిలిస్తీయుల బారినుండి మనలను కాపాడవలసినదిగా దేవునికి మొరపెట్టుమని వేడుకొనిరి.

9. అప్పుడు సమూవేలు పాలుగుడుచు గొఱ్ఱె పిల్లను ప్రభువునకు దహనబలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలు వినెను.

10. సమూవేలు దహనబలి సమర్పించినపుడే ఫిలిస్తీయులు కూడ యిస్రాయేలీయులను తాకి పోరాటము మొదలిడిరి. కాని ప్రభువు ఉరుమువలె పెద్ద స్వరముతో గర్జించి ఫిలిస్తీయులను చిందరవందర చేసెను. వారు చీకాకుపడి యిస్రాయేలీయుల ముందు నిలువలేక పారిపోయిరి.

11. కాని యిస్రాయేలు సైన్యములు మిస్పానుండి ఫిలిస్తీయులను వెన్నాడెను. బెత్కారుపల్లము వరకు శత్రువులను తరుముకొని పోయి చిక్కినవారినిచిక్కినట్లు చీల్చిచెండాడెను.

12. సమూవేలు మిస్పాకు, షేనుకు మధ్య ఒక రాతినిపాతి, యావే ఇంతవరకు మనకు సహాయము చేసెనను అర్థముగా దానికి 'ఎబెనెసెర్'' అని పేరు పెట్టెను.

13. ఈ విధముగా ఫిలిస్తీయులు అణచబడిన వారై మరల యిస్రాయేలు పొలిమేరలపై అడుగు మోపలేదు. సమూవేలు జీవించియున్నంత కాలము ప్రభువు వారిని అణచివేసెను. కనుక క్రుక్కిన పేనువలె పడియుండిరి.

14. ఎక్రోను నుండి గాతు వరకు ఫిలిస్తీయులు తాము వశముచేసికొనిన పట్టణములన్నిటిని యిస్రాయేలీయులకు తిరిగి యిచ్చివేసిరి. యిస్రాయేలు ఫిలిస్తీయుల బారినుండి తన సరిహద్దులను గూడ సంరక్షించుకొనెను. అమోరీయులకు, యిస్రాయేలీయులకు మధ్యగూడ శాంతి నెలకొనెను.

15. సమూవేలు బ్రతికియున్నంతకాలము యిస్రాయేలీయులకు తీర్పు తీర్చుచునే యుండెను.

16. ఏటేట అతడు బేతేలు, గిల్గాలు, మిస్పా పట్టణములను వరుసగా చుట్టివచ్చి అచ్చటి జనులకు తీర్పు తీర్చెడి వాడు.

17. అటుపిమ్మట రామాలోని తన ఇంటికి తిరిగివచ్చి అక్కడ కూడ తీర్పుచెప్పెడివాడు. అతడు రామావద్ద ప్రభువునకు ఒక బలిపీఠము కూడ నిర్మించెను.