ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 33 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 33వ అధ్యాయము

 1. యాకోబు కన్నులెత్తి చూడగా ఏసావు నాలుగువందల మందిని వెంటబెట్టుకొని వచ్చు చుండెను. అప్పుడతడు తన పిల్లలను వేరుచేసి లేయాకును, రాహేలునకును అప్పగించెను.

2. దాసీ స్త్రీలను వారి పిల్లలను అతడు ముందుంచెను. వారి వెనుక లేయాను, ఆమె పిల్లలనుంచెను. అందరికి వెనుక రాహేలు, యోసేపులుండిరి.

3. యాకోబు అందరికంటే ముందుగా వెళ్ళెను. సోదరుని సమీపించుచు అతడు ఏడుమారులు నేలమీద సాగిల బడెను.

4. ఏసావు పరుగెత్తుకొని వచ్చి యాకోబును కౌగలించుకొనెను. అతడు యాకోబు మెడపై వ్రాలి ముద్దు పెట్టుకొనెను. వారిరువురు కన్నీరు కార్చిరి.

5. ఏసావు ఆ స్త్రీలను పిల్లలను పారజూచి “నీతో పాటున్న వీరందరెవరు?” అని యాకోబును ప్రశ్నించెను. అతడు “వీరందరు దేవుడు మీ ఈ దాసునకనుగ్రహించి ఇచ్చిన పిల్లలు” అని చెప్పెను.

6. అప్పుడు దాసీ స్త్రీలు, వారి పిల్లలు దగ్గరకు వచ్చి ఏసావు ముందు సాగిల పడిరి.

7. తరువాత లేయా తనపిల్లలతో వచ్చి సాగిల పడెను. పిదప యోసేపు, రాహేలులు కూడ వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి.

8. అంతట ఏసావు 'ఆ గుంపంత నాకు ఎదురుగా వచ్చినదేల?' అని యాకోబును ప్రశ్నించెను. దానికి యాకోబు “ప్రభూ! అదంతయు మీ అనుగ్రహము సంపాదించుకొనుటకే” అని చెప్పెను.

9. “తమ్ముడా! నాకు కావలసినంత ఉన్నది. నీ సొమ్ము నీవే అట్టిపెట్టు కొనుము” అని ఏసావు అనెను.

10. యాకోబు “అటుల గాదు. నీకు నామీద దయ ఉన్న నా ఈ కానుకలు స్వీకరింపుము. ఒకమాట చెప్పెదను చూడుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీవు దయతో నన్ను చేరదీసితివి.

11. నేను తెచ్చిన ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను. నాకు కావలసినంత సమకూర్చెను” అనుచు బలవంతము చేసెను. ఏసావు అతని బహుమానములు పుచ్చుకొనెను.

12. “ఇక మనము బయలుదేరుదము. నేను ముందునడచుచు నీకు దారిచూపెదను" అని ఏసావు అనెను.

13. దానికి యాకోబు జవాబు చెప్పుచు “ప్రభూ! నీకు తెలియనిది ఏమున్నది? పిల్లలందరు పసివారు. గొఱ్ఱెలు, మేకలు, పశువులు, పిల్లలకు పాలుగుడుపుచున్నవి. వానిని చూచిన జాలికలుగును. ఒక్కనాడే తరిమితరిమి తోలుకొనిపోయిన మంద అంతయు చచ్చును.

14. కావున ప్రభూ! మీరు నాకంటె ముందు వెళ్ళవలయునని వేడుకొనుచున్నాను. నాతో ఉన్న ఈ పిల్లలను మందలను నడువగలిగినంత మెల్లగా నడిపించుకొనుచు, అంచలంచెలుగా ప్రయాణము చేసి సేయీరు నందున్న యేలినవారిని కలిసికొందును” అనెను.

15. “అట్లయిన నిన్ను అనుసరించి వచ్చుటకు నా మనుష్యులలో కొందరిని దిగవిడిచి పోయెదను” అని ఏసావు అనెను. దానికి యాకోబు “ఏలినవారికి నామీద దయగలిగిన అదియే పదివేలు. ఇక ఈ బలగముతో పనియేమి?" అనెను.

16. ఆనాడే ఏసావు సేయీరునకు తిరిగి వెళ్ళెను.

17. కాని యాకోబు సుక్కోతునకు బయలుదేరెను. అతడక్కడ తనకు ఒక ఇల్లు కట్టుకొనెను. పశువులకు పాకలు వేయించెను. కావుననే ఆ చోటికి సుక్కోతు' అను పేరువచ్చెను.

18. పద్దనారాము నుండి ప్రయాణమై యాకోబు సురక్షితముగా కనాను దేశమునందలి షెకెము నగరము చేరెను. దానికెదురుగా గుడారములు వేసికొనెను.

19. అతడు తాను గుడారములువేసిన చోటును షెకెము తండ్రియైన హామోరు కుమారుల వద్ద నూరు వెండినాణెములకు కొనెను.

20. అతడు అక్కడ ఒక బలిపీఠము కట్టి, దానికి “ఏల్ ఎలోహి యిస్రాయేల్” అనగా “యిస్రాయేలు దేవుడయిన దేవునికి” అను అర్థము వచ్చు పేరు పెట్టెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services