ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 9

 1. అదే నెల ఇరువది నాలుగవదినమున యిస్రాయేలీయులు గోనెపట్ట తాల్చి తలమీద ధూళి చల్లుకొని ఉపవాసము చేయుటకు సమావేశమైరి.

2. వారెల్లరు అన్యజాతి ప్రజలనుండి వైదొలగిరి. తాము తమ పూర్వులు చేసిన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడిరి.

3. ఆ ప్రజలు నిలుచుండి ఉండగా మూడుగంటల పాటు ధర్మశాస్త్రమును చదివి విన్పించిరి. మూడు గంటలపాటు ప్రజలు తమ పాపముల నొప్పు కొని యావే దేవుని నమస్కరించుచు ఉండిరి.

4. లేవీయులు వేదిక పైకెక్కి పెద్దగా మొరపెట్టుచు ప్రార్ధనలు చేసిరి. వారు యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్ని, షేరెబ్యా,బానీ, కెనానీ.

5. మరియు యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరెబ్యా, హోదీయా, షెన్యా, పెతహాయా అను లేవీయులు ప్రభువును స్తుతింపుడని ప్రజలను పోత్సహించుచు ఇట్లు పలికిరి: “మీరెల్లరు నిలుచుండి ప్రభువును స్తుతింపుడు. కలకాలము మన ప్రభువును కొనియాడుడు. ప్రభూ! కీర్తిగల నీ నామమునకు సన్నుతులు నీ దివ్యనామమును మేము ఉచితరీతిన స్తుతింపజాలము.

6. నీవే అద్వితీయుడవైన దేవుడవు. నీవు ఆకాశమును, అందలి నక్షత్రములను, భూమిని దానిమీది ప్రాణులను, సముద్రములను, వానిలోని జలచరములను సృజించితివి. సమస్త ప్రాణులకు జీవమిచ్చినవాడవు నీవే, ఆకాశజ్యోతులు నిన్నారాధించును.

7. నీవు అబ్రామునెన్నుకొంటివి. కల్దీయుల ఊరునుండి అతనిని కొనివచ్చి అబ్రహాము అని పేరు పెట్టితివి.

8. అబ్రహాము విశ్వాసపాత్రుడగుటచే, అతనితో నిబంధనము చేసికొంటివి. కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, వసించు నేలనతనికి, అతని సంతతికి వారసత్వముగా ఇచ్చెదనంటివి. నీవు నమ్మదగినవాడవు గనుక నీవు చేసిన ప్రమాణములు నిలబెట్టుకొంటివి.

9. ఐగుప్తునందలి మా పితరుల గోడు వింటివి. రెల్లు సముద్రమువద్ద వారి మొరనాలించితివి.

10. ఫరోను అణగదొక్కుటకును, అతని అధికారులను ప్రజలను అణచివేయుటకును, నీవు అద్భుతకార్యములు చేసితివి. గర్వముతో నీ ప్రజలను పీడించిరి గనుక వారిని అణగదొక్కినేటిదనుక ఖ్యాతి గడించితివి.

11. నీవు సముద్రమును చీల్చి దారిచేయగా, నీ ప్రజలు నీళ్ళనడుమ పొడినేలపై నడిచిపోయిరి వారిని వెన్నాడిన శత్రువులు మాత్రము పొంగిపొరలు నీళ్ళలో వేసిన రాయివలె వారిని అగాధజలములలో నీవు పడవేసితివి

12. పగలు మేఘస్తంభముతో, రేయి అగ్నిస్థంభముతో నీ ప్రజను నడిపించితివి.

13. నీవు ఆకసమునుండి దిగివచ్చి సీనాయి కొండమీద నీ జనముతో మాట్లాడితివి. నీతియుక్తమైన చట్టములు, సత్యమైన ఆజ్ఞలను వారికొసగితివి.

14. పరిశుద్ధమైన విశ్రాంతిదినమును వారి కెరిగించితివి. నీ సేవకుడు మోషే ద్వారా ఆజ్ఞలు, కట్టడలు, శాసనములిచ్చితివి.

15. ప్రజలు ఆకలిదప్పులతో అలమటించుచుండగా, ఆకాశమునుండి ఆహారమును, రాతినుండి నీళ్ళను ఒసగితివి. పితరులకు వాగ్దానముచేసిన భూమిని స్వాధీనము చేసికొండని సెలవిచ్చితివి.

16. కాని మా పెద్దలకు తలబిరుసెక్కి నీ ఆజ్ఞలు లెక్కచేయరైరి.

17. వారు నీ మాట జవదాటిరి. నీ అద్భుతకార్యములు విస్మరించిరి. నీపై తిరుగుబాటు చేసి మరల ఐగుప్తునకు తిరిగి వెళ్ళి బానిసలగుటకు ఒక నాయకుని గూడ ఎన్నుకొనిరి. కాని నీవు క్షమాపరుడవు, కరుణాళుడవు, కృపామయుడవు, దయాపూర్ణుడవు, నీవు శీఘ్రముగా కోపించువాడవు కాదు కనుక వారిని విడనాడవైతివి.

18. ప్రజలు పోతదూడను చేసి తమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన దేవుడు ఇతడే'యని పలుకుచు నీ కోపమును రెచ్చగొట్టిరి.

19. అయినను నీ అనంతమైన కృపవలన వారిని ఆ ఎడారిలోనే చావనీయవైతివి. రేయింబవళ్లు ప్రజలను నడిపించుచున్న అగ్గికంబము, మబ్బుకంబము వారిని విడనాడవయ్యెను.

20. నీవు మంచివాడవు గనుక ఆ ప్రజకు ధర్మమార్గము బోధించితివి. మన్నాను, జలమును ఒసగి వారిని పోషించితివి.

21. ఎడారిలో నలువదియేండ్లు వారి అక్కరలు తీర్చితివి. వారి బట్టలు చినిగిపోలేదు. వారి పాదములు వాపెక్కలేదు.

22. నీవు శత్రురాజ్యములను నీ ప్రజలవశము చేయగా అవి వారి సరిహద్దులలోని మండలములాయెను. వారు సీహోను రాజు దేశము హెష్బోనును, ఓగురాజు దేశము బానును జయించిరి.

23. చుక్కలవలె లెక్కలకందని మగబిడ్డలను నీ జనమున కొసగితివి. పితరులకు వాగ్దానము చేసిన భూమికి వారిని కొనిపోయితివి.

24. నీ ప్రజలు కనాను దేశమును ఆక్రమించుకొనిరి. అచటి జనులు వారికి లొంగిపోవునట్లు చేసితివి. కనాను రాజులను, జనులను, నీ ప్రజలు తమ ఇష్టము వచ్చినట్లుగా చేయనిచ్చితివి.

25. నీ ప్రజలు సురక్షిత పట్టణములను, సారవంతమైన భూములను, ధనవంతమైన యిండ్లను, త్రవ్విన బావులను, పెక్కు ద్రాక్షతోటలను, ఓలివుతోటలను, పండ్లతోటలను స్వాధీనము చేసికొనిరి. వారు మస్తుగా భుజించి బలసిపోయిరి. నీవిచ్చిన మేలివస్తువులెల్ల హాయిగా అనుభవించిరి.

26. కాని ఆ ప్రజలు నీ మీద తిరుగబడి నీ ధర్మశాస్త్రమును త్రోసివేసిరి. ప్రభువును సేవింపుడని తమను మందలించిన ప్రవక్తలను పట్టి చంపివేసిరి, మాటిమాటికి నిన్ను నిందించిరి.

27. కావున నీవా ప్రజను శత్రువుల వశము చేయగా ఆ శత్రువులు వారిని పీడించి పిప్పిచేసిరి. వారు మరల నీకు మొరపెట్టగా, ఆకాశమునుండి నీవు ఆ వేడికోలు వింటివి. నీవు నెనరుతో పంపిన నాయకులు శత్రుబాధనుండి వారిని కాపాడిరి.

28. కాని బాధలు తీరిపోయిన వెంటనే మరల వారు దుష్కార్యములు చేసిరి. కనుక నీవు వారిని శత్రువులకు వదలివేయగా ఆ విరోధులు వారిని నేలబెట్టి కాలరాచిరి. వారు పశ్చాత్తాపపడి నీకు మొరయిడగా నీవు ఆకాశమునుండి వారిగోడు వింటివి. అనంతకృపతో తేపతేపకు వారిని కాపాడితివి.

29. నీ యాజ్ఞలను పాటింపవలెనని, మాటిమాటికి నీ ప్రజలను హెచ్చరించితివి. అయినను వారు గర్వముతో నీ మాట లెక్కచేయరైరి. నీ విధులను పాటించినచో జీవము కలుగును. కాని వారు మూర్ఖులై నీ శాసనములను ఆచరించరైరి.

30. ఏటేట ఓర్మితో నీవు వారిని మందలించితివి. నీ ప్రవక్తలద్వార వారికి బోధ చేయించితివి. నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివి కాని ఆ బోధలు వారి తలకెక్కలేదు. కనుక వారిని అన్యజాతుల వశము చేసితివి.

31. అయినను అనంత కరుణగలవాడవు కనుక నీవు వారిని సర్వనాశనము చేయలేదు. వారిని విడనాడనులేదు. నీవు కృపానిధివి, దయామయుడవు.

32. ప్రభూ! నీవెంత మహానుభావుడవు! ఎంత భయంకరుడవు! ఎంత శక్తిమంతుడవు! నీవు చేసిన నిబంధనను మీరనివాడవు. అస్సిరియా రాజులు మమ్ము జయించిన నాటినుండి నేటిదనుక మాకు కలిగిన యిక్కట్టులన్ని యిన్ని కావు. మా రాజులు, నాయకులు, యాజకులు, ప్రవక్తలు, పితరులు, ప్రజలు నానా బాధలనుభవించిరి.

33. నీవు మాకు ఇట్టి శిక్షలు విధించుట న్యాయమే. నీవు న్యాయవంతుడవేగాని మేము మాత్రము దోషులము.

34. మా పితరులు, రాజులు, నాయకులు, యాజకులు నీ ఆజ్ఞలను పాటింపలేదు. నీ హెచ్చరికలను లక్ష్యము చేయలేదు.

35. నీ ప్రజలకు విశాలము సారవంతమునైన ఈ దేశము నిచ్చితివి. కాని అచట ఉన్నంతకాలము వారు దుష్టులై నిన్ను సేవింపరైరి.

36. నీవు మా పితరులకిచ్చిన ఫలప్రదమైన నేలపై నేడు మేము బానిసలుగా ఉన్నాము.

37. ఈ నేలలో పండిన పంట అంతయు పరరాజుల పాలగుచున్నది. . మా పాపములకుగాను వారు మాకు పాలకులైరి. ఆ ఏలికలు మమ్ము, మా పశువులను , తమ యిష్టము వచ్చినట్లు చేయుచున్నారు. మా అగచాట్లు ఇంత ఘోరముగా నున్నవి.”

38. ప్రభూ! మాకిన్ని బాధలు సంభవించినవి గనుక మేమెల్లరముగూడి నిబంధనపత్రము ఒకటి సిద్ధము చేసితిమి. మా పెద్దలు, యాజకులు, లేవీయులు దానిమీద సంతకము చేసిరి.