ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 9

 1-2. సొలోమోను దేవాలయమును, ప్రాసాదమును, మిగిలిన భవనములను కట్టి ముగించిన పిదప, గిబియోనున ప్రత్యక్షమైనట్లు యావే మరల రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యెను.

3. ప్రభువు అతనితో “నేను నీ ప్రార్థన, విన్నపములను ఆలకించితిని. నన్ను సదా ఆరాధించుటకై నీవు నిర్మించిన ఈ దేవాలయమును పవిత్రము చేసితిని. నేను దీనిని నిత్యము ఆదరముతో చూచి సంరక్షించుచుందును.

4. నీ తండ్రి దావీదువలె నీవును పూర్ణహృదయముతో, చిత్తశుద్ధితో నన్ను కొలుచుచు నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని.

5. 'నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసనముపై కూర్చుండి యిస్రాయేలీయులను పరిపాలించును' అని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.

6. కాని నీవుగాని, నీ అనుయాయులుగాని నన్ను విడనాడి నా ఆజ్ఞలను మీరి అన్యదైవములను ఆరాధింతురేని,

7. యిస్రాయేలును నేనిచ్చిన ఈ నేల మీదనుండి తొలగింతును. నా ఆరాధనకుగాను నేను పవిత్రముచేసిన ఈ దేవాలయమును కూడ విడనాడు దును. అపుడు జనులెల్లరు యిస్రాయేలును చూచి నవ్విపోదురు. వారిని గడ్డిపోచతో సమానముగా చూతురు.

8. ఇక ఈ మహాదేవాలయమును చూచి, ఇటువైపు వచ్చు వారందరు ముక్కుపై వ్రేలిడుకొని ప్రభువు ఈ నేలకు, ఈ దేవళమునకు ఏమిగతి పట్టించెనో చూడుడని ఢీ కొట్టుదురు.

9. అప్పుడు చుట్టుపట్లనున్న వారు “ఈ ప్రజలు తమ పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చిన ప్రభువును విడనాడి అన్యదైవములను ఆశ్రయించి వారిని కొలిచిరి. కనుక ప్రభువు వీరిని ఈ రీతిగా శిక్షించెను' అని పలుకుదురు” అనెను.

10. సొలోమోను దేవాలయమును, ప్రాసాదమును కట్టి ముగించుటకు ఇరువదియేండ్లు పట్టెను.

11. తూరు దేశపు రాజగు హీరాము సొలోమోనునకు కావలసిన దేవదారు కలప, సరళవృక్షముల కలప, బంగారము సమకూర్చి పెట్టెను. సొలోమోను అతనికి గలిలీసీమలోని ఇరువది పట్టణములిచ్చెను.

12. హీరాము తూరు దేశమునుండి వచ్చి ఆ పట్టణములను పరిశీలింపగా అవి అతనికి నచ్చవయ్యెను.

13. అతడు సొలోమోనుతో “తమ్ముడా! నాకెటువంటి పట్టణములు ఇచ్చితివోయి!” అనెను. కావుననే ఆ ప్రాంతమును నేటివరకు కాబూలు' అని పిలుచుచున్నారు.

14. హీరాము సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము పంపెను.

15. సొలోమోను దేవాలయమును, రాజగృహమును కట్టుటకు, పురప్రాకారమును నిర్మించుటకు, పట్టణమునకు తూర్పువైపుననున్న పల్లము పూడ్చుటకు అనగా మిల్లో నిర్మాణమునకు ప్రజలచేత వెట్టిచాకిరి చేయించెను. ఆ రీతిగానే హాసోరు, మెగిద్ధో, గేసేరు పట్టణములను పునర్నిర్మాణము చేయుటకు జనులతో వెట్టిచాకిరి చేయించుకొనెను.

16. ఐగుప్తు రాజు ఫరో గేసేరును ముట్టడించి వశముచేసికొనెను. ఆ నగరమందు నివసించు కనానీయులను చంపి పట్టణమును తగులబెట్టించెను. అతడు తన కుమార్తెను సొలోమోనుకిచ్చి పెండ్లి చేసినపుడు ఆ పట్టణమును ఆమెకు కానుకగా ఇచ్చెను.

17. సొలోమోను దానిని పునర్నిర్మాణము చేసెను

18. ఈ వెట్టిచాకిరితోనే అతడు దిగువనున్న బేత్-హోరోనును, బాలాతును, యూదా ఎడారిలోని తడ్మోరు పట్టణమును కట్టించెను.

19. అతడు భోజనపదార్దములకై ఏర్పాటుచేసిన శాలలు, సైన్యములను నిలిపిన పట్టణములు, రథములను గుఱ్ఱములనుంచిన పట్టణములు, యెరూషలేముననేమి, లెబానోనుననేమి, సామ్రాజ్యమందలి ఇతర ప్రాంతాలలోనేమి కట్టించిన భవనములు వెట్టి చాకిరితోనే నిర్మింపబడెను.

20-21. అతడు కనాను మండలమందలి నానా జాతులవారిని ఈ వెట్టిచాకిరికి ఉపయోగించుకొనెను. యిస్రాయేలీయులు ఈ మండలములను ఆక్రమించుకొనినప్పుడు అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన ఈ జాతులను పూర్తిగా నాశనము చేయలేకపోయిరి. వీరినే సొలోమోను వెట్టిచాకిరికి వాడుకొనెను. వీరి సంతతివారు నేటికిని బానిసలుగనే బ్రతుకుచున్నారు.

22. సొలోమోను యిస్రాయేలీయుల చేత వెట్టిచాకిరి చేయించుకోలేదు. వారతనికి సైనికులు, అంగరక్షకులు, సైన్యాధిపతులు, రథాధిపతులు, ఆశ్వికులుగా పనిచేసిరి.

23. సొలోమోనునకు వెట్టిచాకిరి చేయువారిమీద అయిదువందల యేబదిమంది పర్యవేక్షకులుండిరి.

24. ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె దావీదు నగరమును వీడి సొలోమోను క్రొత్తగా నిర్మించిన భవనమున నివసించుట మొదలిడిన తరువాత అతడు నగరమునకు తూర్పువైపుననున్న పల్లమునుపూడ్చి మెరకగా జేసెను.

25. సొలోమోను తానునిర్మించిన బలిపీఠముపై ఏడాదికి మూడుసారులు దహనబలులు, సమాధాన బలులు సమర్పించెడివాడు. ప్రభువెదుట సాంబ్రాణి పొగ వేసెడివాడు. అతడు దేవాలయమును చక్కగా మరమ్మతు చేయించెడివాడు.

26. ఎదోముమండలమునందలి రెల్లు సముద్రము తీరముననున్న ఎలతు పట్టణము వద్దగల ఏసోసోన్గెబరు రేవు నందు సొలోమోను నావలను నిర్మించెను.

27. సొలోమోను నావికులతో పనిచేయుటకై, హీరాము తన నావికులలో నేర్పరులను కొందరినిపంపెను.

28. ఈ నావికులు ఓఫీరు రేవువరకు సముద్ర యానము చేసి సొలోమోనునకు నలుబది రెండు బారువుల బంగారము తెచ్చియిచ్చిరి.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services