ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 9

 1. షేబ దేశపు రాణి సొలోమోను కీర్తిని గూర్చి వినెను. ఆమె అతనిని పరీక్షింపగోరి గడ్డు ప్రశ్నలు సిద్ధముచేసికొని యెరూషలేమునకు పయనమై వచ్చెను.

2. ఆ రాణి సుగంధ ద్రవ్యములు, పెద్దమొత్తము బంగారము, రత్నములు ఒంటెల మీదికెక్కించుకొని గొప్ప పరివారముతో వచ్చెను. ఆమె సొలోమోనును కలిసికొని తాను అడుగదలచిన ప్రశ్నలన్నియు అడిగెను. రాజు ఆ ప్రశ్నలన్నిటికిని జవాబు చెప్పెను. అతనికి తెలియని అంశమేదియులేదు.

3-4. సొలోమోను విజ్ఞానమును, అతడు నిర్మించిన దేవాలయమును, అతడు భుజించు భోజనమును, అతని సేవకులు వనించు గృహములను, ప్రాసాదమునందలి అతని ఉద్యోగులు పనిచేయు తీరును, వారు తాల్చిన దుస్తులను, అతని పానీయవాహకులను, వారి ఉడుపులను, అతడు దేవాలయమున అర్పించు బలులను చూచి ఆ రాణి దిగ్బ్రాంతి చెందెను.

5. ఆమె రాజుతో “నేను నిన్ను గూర్చియు నీ విజ్ఞానమును గూర్చియు మా దేశమున వినినదెల్ల నిజమే.

6. నేను స్వయముగా వచ్చి చూచువరకును ఇతరులు నిన్నుగూర్చి పలికిన పలుకులు నమ్మనైతిని. కాని వారు నాకు విన్పించినది నీ విజ్ఞానములో అర్ధభాగము కంటెను తక్కువ. నీవు జనులు చెప్పుకొను దానికంటెను అధికవిజ్ఞానవంతుడవు.

7. ఎల్లప్పుడు నీ చేరువలోనుండి నీ విజ్ఞానవాక్యములను ఆలించు ఈ నీ సేవకులెంత ధన్యులు!

8. నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను తన పేరు మీదుగా రాజును చేసిన ప్రభుదేవునకు స్తోత్రములు కలుగునుగాక, ఆయన యిస్రాయేలును ప్రేమించి వారిని కలకాలము సంరక్షింపగోరెను. కనుకనే నిన్ను వారికి రాజునుగా నియమించెను. నీవు వారికి న్యాయము, ధర్మము జరిగించునట్లు చేసెను” అనెను.

9. రాజునకు ఆ రాణి ఐదుబారువుల బంగారము, పెద్ద మొత్తము సుగంధ ద్రవ్యములు, రత్నములు బహూకరించెను. ఆమె బహూకరించిన సుగంధ ద్రవ్యములకు సాటియైనవి మరి యెచ్చట లేవు.

10. ఓఫీరు నుండి బంగారము కొనివచ్చిన హురాము నావికులు, సొలోమోను నావికులు ఆ రాజునకు చందనపుకొయ్యను, రత్నములను గూడ తీసికొనివచ్చిరి.

11. సొలోమోను ఆ కొయ్యతో దేవాలయమునకును, తన ప్రాసాదమునకును మెట్ల వరుసలు కట్టించెను. గాయకులకు తంబురలను, సితారాలను తయారుచేయించెను. యూదా దేశమున ఇట్టి కార్యమెన్నడును జరిగియుండలేదు.

12. సొలోమోను తన తరపున తాను షేబరాణి కోరుకొనినదెల్ల బహూకరించెను. ఆ రాణి తెచ్చిన బహుమతులకు ప్రతి బహుమతులనిచ్చెను. అటు తరువాత ఆ రాణి తన పరివారముతో షేబ దేశమునకు వెడలిపోయెను.

13. సొలోమోనునకు ప్రతి యేడు ఆరు వందల తలాంతుల బంగారము లభించెడిది.

14. వర్తకుల నుండి వసూలుచేసిన పన్నులు అతనికి ముట్టెడివి. అరేబియా రాజులు, వివిధ దేశాధిపతులు అతనికి వెండి బంగారములు తెచ్చి యిచ్చెడివారు.

15. ఆ రాజు రెండువందల పెద్దడాలులను చేయించెను. ఒక్కొక్కడాలును ఆరువందల తులముల మేలిమి బంగారముతో పొదిగించెను.

16. మరియు అతడు మూడు వందల చిన్నడాలులనుగూడ చేయించి ఒక్కొక్క దానిని మూడువందలతులముల మేలిమి బంగారముతో పొదిగించెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల గృహమునందు పదిలపరచెను.

17. అతడు దంతముతో పెద్ద సింహాసనమును చేయించి దానిని మేలిమిబంగార ముతో పొదిగించెను.

18. సింహాసనమునతో కలిసియున్న ఆరుమెట్లు, బంగారపు పాదపీఠము కలవు. సింహాసనమునకు ఇరువైపుల చేతులు ఆనించుటకు గాను అమర్చిన హస్తములు కలవు. వాని పైని సింహముల బొమ్మలు చెక్కిరి,

19. ఆరు మెట్లకు కలిసి ప్రతిదాని కిటువైపు నొకటి అటువైపునొకటి చొప్పున మొత్తము పండ్రెండు సింగముల బొమ్మలు కలవు. ఏ రాజ్యముననైన ఏ కాలముననైన నరులు ఇట్టి సింహాసనమును కావించి యెరుగరు.

20. సొలోమోను పాన పాత్రలన్నిటిని బంగారము తోనే చేసిరి. “లెబానోను అరణ్యము” అను గృహము నందు వాడెడు పాత్రలన్నిటిని బంగారముతోనే చేసిరి. అతని కాలమున వెండికి విలువలేదు.

21. రాజునకు ఓడలును గలవు. వానిని హురాము నావికులే నడిపించిరి. అవి తర్షీసునకు వెళ్ళెడివి. ప్రతి మూడవ యేట వెండి బంగారములతో, దంతములతో, కోతులు, నెమళ్ళతో తిరిగివచ్చెడివి.

22. ప్రపంచములోని రాజులందరికంటెను సొలోమోను అధిక ధనవంతుడు, అధిక విజ్ఞాని.

23. ప్రభువు అతనికి దయచేసిన విజ్ఞానవాక్యములు వినుటకు రాజులెల్లరును అతనితో సంభాషింపగోరిరి.

24. వారు ఆ రాజును సందర్శింపవచ్చినపుడు వెండి బంగారు వస్తువులును, దుస్తులును, ఆయుధములును, సుగంధ ద్రవ్యములును, గుఱ్ఱములును, కంచర గాడిదలును మొదలుగాగల బహుమతులు కొని వచ్చిరి. ప్రతి యేడును రాజులిట్టి బహుమతులతో వచ్చెడివారు.

25. ఆ రాజు తన గుఱ్ఱములను, రథములను ఉంచుటకు నాలుగువేల అశ్వశాలలు కట్టించెను. అతనికి పండ్రెండువేల గుఱ్ఱములు ఉండెడివి. వానిలో కొన్ని యెరూషలేమున, మిగిలినవి వివిధ రథ నగరములందున ఉండెడివి.

26. యూఫ్రటీసునది నుండి ఫిలిస్తీయావరకు, ఐగుప్తు సరిహద్దు వరకుగల రాజులు అందరిమీద అతడు అధికారము నెరపెను.

27. అతనికాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె దొరికెడిది. దేవదారు కొయ్య షెఫేలా ప్రదేశములోని సాదా మేడికఱ్ఱవలె లభ్యమయ్యెడిది.

28. ఐగుప్తు దేశము నుండియు మరియు ఇతర దేశముల నుండియు అతడు గుఱ్ఱములను తెప్పించెడివాడు.

29. సొలోమోనును గూర్చిన ఇతర అంశములు మొదటినుండి తుదివరకు నాతాను ప్రవక్త రచించిన గ్రంథమునందును, షిలో నివాసియైన అహీయా ప్రవచన గ్రంథమునందును, దీర్ఘదర్శి ఇద్ధో దర్శనములు అను గ్రంథమునందు లిఖింపబడియేయున్నవి. ఈ చివరి గ్రంథమున నెబాతు కుమారుడును, యిస్రాయేలు రాజైన యరోబాము కథకూడా కలదు.

30. సొలోమోను యెరూషలేము నుండి యిస్రాయేలీయులెల్లరిని నలువదియేండ్ల కాలము పరిపాలించెను.

31. సొలోమోను తన పితరులతో నిద్రించగా, తన తండ్రియైన దావీదు నగరమందు పాతిపెట్టబడెను. అటుతరువాత అతని కుమారుడు రెహబాము రాజయ్యెను.