ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎజ్రా 8

 1. అర్తహషస్త కాలమున బబులోనియా ప్రవాస మునుండి ఎజ్రాతోపాటు యెరూషలేమునకు తిరిగి వచ్చిన వంశనాయకుల పేర్లివి:

2-14. ఫీనెహాసు వంశీకుడు గెర్షోము; ఈతామారు వంశీకుడు దానియేలు; దావీదు వంశీకుడు హత్తూషు, షెకన్యా; ఫరోషు వంశీకుడు జెకర్యా, అతని కుటుంబపురుషులు నూటఏబదిమంది; పహత్మోవబు వంశీకుడు సెరహ్యా కుమారుడు ఎల్యోయేనయి, అతని కుటుంబ పురుషులు రెండువందలమంది; సట్టు వంశీకుడు యహానీయేలు కుమారుడు షెకన్యా, అతని కుటుంబపురుషులు మూడువందలమంది; ఆదీను వంశీకుడు యోనాతాను కుమారుడు ఎబెదు, అతని కుటుంబ పురుషులు ఏబది మంది; ఏలాము వంశీకుడు అతల్యా కుమారుడు యెషయా, అతని కుటుంబ పురుషులు డెబ్బది మంది; షెఫట్యా వంశీకుడు మికాయేలు కుమారుడు సెబద్యా, అతని కుటుంబపురుషులు ఎనుబది మంది; యోవాబు వంశీకుడు యెహీయేలు కుమారుడు ఓబద్యా, అతని కుటుంబపురుషులు రెండువందల పదునెనిమిది మంది; బాని వంశీకుడు షెలోమీతు కుమారుడు యెసిపియా, అతని కుటుంబ పురుషులు నూట అరువది మంది;- బేబై వంశీకుడు బేబై కుమారుడు జెకర్యా, అతని కుటుంబపురుషులు ఇరువది ఎనిమిది మంది; అస్గాదు వంశీకుడు హక్కాటాను కుమారుడు యోహానాను, - అతని కుటుంబపురుషులు నూట పదిమంది మంది; అదోనీకాము వంశీకులు ఎలీఫేలెటు, యెయూయేలు, షేమయా, వారి కుటుంబపురుషులు అరువది మంది; బిగ్వయి వంశీకులు ఉతాయి, సక్కూరు, వారి కుటుంబపురుషులు డెబ్బది మంది.

15. నేను అహవావైపు పారు ఏటి ఒడ్డున ప్రజలను ప్రోగుచేసితిని. అచట మేము మూడునాళ్ళు మకాముచేసితిమి. నేను ప్రజలను పరిశీలించి చూడగా వారిలో యాజకులు ఉన్నారుగాని లేవీయులులేరైరి.

16. వెంటనే వివేకవంతులైన నాయకులను కొందరిని పిలిపించితిని. వారు ఎలియెజెరు, అరియేలు, షేమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము.

17. వీరందరిని కాసిఫ్యయందలి యిస్రాయేలీయులకు అధికారియగు ఇద్ధో పంపితిని. అతనిని అతని అనుచరులను దేవాలయమున ఊడిగము చేయుటకు పనివారిని (నెతినీయులు) పంపుడని అడిగించితిని.

18. దైవకృపవలన వారు లేవీ కుమారుడైన మాహ్లి వంశీకుడు, సమర్ధుడు అయిన లేవీయుడు శరబ్యాను మావద్దకు పంపిరి అతని బంధువులు, కుమారులు కలిసి మరి పదునెనిమిది మంది వచ్చిరి.

19. వారు మెరారీ వంశీ కులు హషాబ్యాను యెషాయాను కూడ పంపిరి. వారి బంధువులు మరి ఇరువది మందివచ్చిరి.

20. ఇంకను రెండువందల ఇరువది మంది దేవాలయ సేవకులు గూడ ప్రోగైరి. వారి పూర్వులను దావీదురాజు అతని ఉద్యోగులు లేవీయులకు సహాయకులుగా నియమించి యుండిరి. ఈ ప్రజలందరిని వారివారి పేర్లతో నమోదు చేయించితిమి.

21. అహవా యేటి ఒడ్డున మా జనులెల్లరు ఉపవాసము చేయవలెనని దేవుని యెదుట వినయము చూపవలెనని ఆజ్ఞాపించి తిని. మేమును మాబిడ్డలును, మా వస్తుసామాగ్రితో సురక్షితముగా ప్రయాణము చేయుటకు దేవునకు మనవి చేయుడని కోరితిని.

22. దారిలో దొంగలబెడదనుండి మమ్ము కాపాడుటకు సైనికులను, రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు మొగము చెల్లదాయెను. ఎందు కనగా మా దేవుడు తనను నమ్మినవారిని దీవించునని, తన్ను నమ్మనివారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పియుంటిని.

23. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని దేవుని వేడుకొంటిమి. ఆయన మా మొరాలించెను.

24. యాజకులలో ముఖ్యులైన వారి నుండి షేరేబ్యాను, హషబ్యాను, మరి పదిమందిని ఎన్ను కొంటిని.

25. రాజు, అతని సలహాదారులును, ప్రధానాధికారులును, యిస్రాయేలు ప్రజలును దేవళము కొరకు ఇచ్చిన వెండి బంగారములను పాత్రములను వారెదుట తూకము వేయించితిని.

26-27. నేను వారి వశము చేసిన వస్తు సామాగ్రి ఇది: ఆరు వందల ఏబది మణుగుల వెండి, నూరు మణుగుల వెండి పాత్రలు, నూరు మణుగుల బంగారపు పాత్రలు, వెయ్యి తులముల ఇరువది బంగారు పాత్రలు, బంగారమువలె మెరయు రెండు రాగిగిన్నెలు.

28. నేను ఆ యాజకులతో “మీరు మీ పితరులదేవుడైన యావేకు నివేదితులు కదా! అట్లే జనులు స్వేచ్చగా యావేకు అర్పించిన ఈ వెండి బంగారు పాత్రలును ప్రతిష్ఠితములైనవి సుమా!

29.  మీరు యెరూషలేము చేరుకొను వరకు వీనిని భద్రముగా నుంచుడు. అట యెరూషలేమున యావే మందిరస్థలమున వీనిని తూకమువేయించి యాజకులకు, లేవీయులకు, యెరూషలేమునందలి యూదుల నాయకులకు అప్పగించువరకు భద్రపరుపుడు” అని చెప్పితిని.

30. అంతట యాజకులు లేవీయులు యెరూషలేము దేవాలయమునకు కొని పోవుటకు ఆ వెండి, బంగారములను, పాత్రములను తూకము వేసిపుచ్చుకొనిరి.

31. మొదటినెల పండ్రెండవ దినమున మేమెల్లరము అహవా నదిని వీడి యెరూషలేమునకు బయలుదేరితిమి. ప్రభువు మమ్ము చల్లనిచూపు చూచెను. ప్రయాణమున శత్రుబాధనుండియు, దొంగల బాధ నుండియు మమ్ము కాపాడెను.

32. మేము యెరూషలేము చేరి అక్కడ మూడునాళ్ళు విశ్రమించితిమి.

33. నాలుగవనాడు దేవాలయమునకు వెళ్ళి వెండి బంగారములను, పాత్రలను తూకమువేసి యాజకుడును, ఊరియా కుమారుడునైన మెరేమోతుకు ముట్టజెప్పితిమి. అతనితోపాటు ఫీనెహాసు కుమారుడగు ఎలియాజరును, ఇద్దరు లేవీయులు, యేషూవ కుమారుడైన యోసాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యాయు ఉండిరి.

34. ప్రతి వస్తువును లెక్కబెట్టి తూకము వేసిరి. ఆ తూకము లెక్కలను గూడ నమోదుచేసిరి.

35. ప్రవాసమునుండి వచ్చినవారందరును యిస్రాయేలు దేవునికి దహనబలి సమర్పించుటకై బలిపశువులను కొనివచ్చిరి. యిస్రాయేలీయులందరి తరపున పండ్రెండుకోడెలను, తొంబది ఆరు పొట్టేళ్ళను, డెబ్బది ఏడు గొఱ్ఱె పిల్లలను అర్పించిరి. పాప పరిహారమునకై పండ్రెండు మేకపోతులను గూడ అర్పించిరి.

36. రాజు ఇచ్చిన శాసనమును పశ్చిమ యూఫ్రటీసు అధికారులకును, సేనాధిపతులకును చూపగా వారు యిస్రాయేలు ప్రజలకును, దేవాలయమునకును సాయము చేయుటకు అంగీకరించిరి.