ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 8

 1. దేవాలయమును, ప్రాసాదమును కట్టి ముగించుటకు సొలోమోనునకు ఇరువది యేండ్లు పట్టెను.

2. అటు తరువాత అతడు హూరాము తనకిచ్చిన నగరములను పునర్నిర్మాణము చేయించి వానిలో యిస్రాయేలీయులను వసింపజేసెను.

3. అతడు హమాతు, సోబా మండలములను జయించెను.

4. ఎడారిలోని తడ్మోరు పట్టణమును సురక్షితము చేసెను. వస్తుసంభారములను నిల్వయుంచిన హమాతు మండలపు పట్టణములను అన్నిటిని పునర్నిర్మించెను.

5. ఆ రాజు ఈ క్రింది నగరములనుగూడ పునర్నిర్మాణము చేయించెను: కవాటములతో, ప్రాకారములతో సురక్షితములైయున్న ఎగువబేతహారోను, దిగువ బేతహారోను,

6. బాలతు నగరము, వస్తు సంభారములను ఉంచిన నగరములు, రథములను, గుఱ్ఱములను ఉంచిన నగరములు. పైగా యెరూషలేము నందును, లెబానోను నందును తన ఏలుబడిలో నున్న ఇతర మండలములలోను తాను నిర్మింపగోరిన భవనముల నెల్ల నిర్మించెను.

7-8. యిస్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకొనినపుడు అచటి జాతులనన్నిటిని సంహరింపలేదు. అటుల సంహరింపక మిగిల్చిన జాతులవారి సంతానమైన ప్రజలను సొలోమోను వెట్టిచాకిరికి వినియోగించుకొనెను. హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వియులు, యెబూసీయులు ఆ రీతిగా మిగిలియును ఆ జాతులవారి సంతానమే. ఈ ప్రజలు నేటికిని వెట్టి చాకిరి చేయుచునే ఉన్నారు.

9. అతడు యిస్రాయేలీయులచేత మాత్రము వెట్టిచాకిరి చేయింపలేదు. వారు సైనికులుగను, అధికారులుగను, రథనాయకులుగను, అశ్వదళాధిపతులుగను పనిచేసిరి.

10. వీరిలో రెండువందల ఏబదిమంది ముఖ్యులు. సొలోమోను రాజు వీరిని ప్రజలమీద అధికారులుగా నియమించెను.

11. సొలోమోను తన భార్యయైన ఐగుప్తురాజు కుమార్తెను దావీదునగరము నుండి తోడ్కొనివచ్చెను. తాను స్వయముగా నిర్మించిన భవనముననే ఆమెకు విడిది కల్పించెను. యిస్రాయేలు రాజైన దావీదు పట్టణమున ఆమె వసింపరాదనియు, దైవమందసము నుంచినందున ఆ తావు పవిత్రమైనదనియు అతడు తలంచెను.

12. సొలోమోను దేవాలయము నెదుట తాను నిర్మించిన బలిపీఠముపై ప్రభువునకు దహనబలులు అర్పించెను.

13. ప్రతిదిన దహనబలులు, విశ్రాంతి దినములందు, అమావాస్యలందు అర్పించుబలులు, పొంగనిరొట్టెల పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ అను మూడు సాంవత్సరిక ఉత్సవములు మొదలైనవానిని గూర్చి మోషే ధర్మశాస్త్రము నందు ఆదేశించిన నియమములనెల్ల అతడు పాటించెను.

14. సొలోమోను తన తండ్రి దావీదు చేసిన నియమముల ప్రకారము యాజకుల అనుదిన ఆరాధన కార్యక్రమములను క్రమబద్దము చేసెను. గానముచేయుచు ఆరాధనయందు యాజకులకు తోడ్పడు లేవీయుల పరిచర్యనుగూడ నియమబద్ధము చేసెను. దావీదు శాసనములననుసరించి దేవాలయ సంరక్షకులు ప్రతిరోజు ఆయా దేవాలయ ద్వారముల వద్ద చేయవలసిన ఊడిగమునుగూడ నియమబద్ధము చేసెను.

15. యాజకులు, లేవీయులు, రాజు తమని గూర్చి చేసిన నియమములనెల్ల పాటించిరి. వస్తు సంభారములను గూర్చియు, ఇతరాంశములను గూర్చియు అతడు చేసిన శాసనములనెల్ల అనుసరించిరి.

16. సొలోమోను తలపెట్టిన పనులన్నియు ముగిసెను. దేవాలయమునకు పునాదులెత్తుట నుండి దానిని కట్టి ముగించుట వరకునుగల సకలకార్యములు విజయవంతముగా పూర్తి అయ్యెను.

17. అంతట సొలోమోను ఎదోము మండలములోని ఏసోన్గబేరు, ఏలొతు రేవులను చూడబోయెను. హురాము అతనికి ఓడలనంపెను. వానిని హురాము అధికారులు నైపుణ్యముగల అతని నావికులు నడిపించిరి.

18. వారును, సొలోమోను నావికులును కలసి ఓఫీరు మండలమునకు వెళ్ళి అచటి నుండి పదునారు బారువుల బంగారము కొని తెచ్చిరి.