ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 8

 1. ఎఫ్రాయీము తెగలవారు గిద్యోనుతో “నీవు చేసినపని ఏమియు బాగుగాలేదు. నీవు మిద్యానీయులతో పోరునకు వెడలినపుడు మమ్మేల పిలువనైతివి?” అని తీవ్ర వివాదము పెట్టుకొనిరి.

2. గిద్యోను వారితో “మీతో పోల్చుకొనినచో నేను సాధించినది ఏపాటి? ఎఫ్రాయీము తెగలవారి పొలములో పరిగలేరినను, అబీయేసేరు తెగల వారి పొలములో పండిన నిండు పంటకంటెను మిక్కుటమే అగును.

3. మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సెయేబులను యావే మీ చేతికి అప్పగించెను. మీతో పోల్చుకొనినచో నేను చూపిన పరాక్రమము ఏపాటిది?” అనెను. ఆ మాటలకు వారి కోపము చల్లారెను.

4. గిద్యోను, అతని అనుచరులు మూడు వందల మంది అలసటగానున్నను శత్రువులను వెన్నాడుచు యోర్దాను నదిని దాటిరి. కాని వారు ఆకలివలన బాధపడజొచ్చిరి.

5. కనుక అతడు సుక్కోతు నగర వాసులతో “నా అనుచరులు అలసిసొలసియున్నారు! వారికి కొన్ని రొట్టెలను ఇవ్వుడు. నేను మిద్యాను రాజులు సెబా, సల్మూనాలను తరుముకొనివచ్చితిని” అని చెప్పెను.

6. కాని సుక్కోతు పెద్దలు “ఏమేమి! నీ సైన్యములకు రొట్టెలనీయవలయునా? సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ వశమైరి కాబోలు!” అని హేళన మొనర్చిరి.

7. గిద్యోను వారితో “అట్లే కానిండు! ప్రభువు ఈ శత్రువులను నా వశము చేయగనే నేను ఎడారిముండ్లతో, ముండ్లకంపతో మీ చర్మము చీల్చెదను” అనెను.

8. అటనుండి గిద్యోను పెనూవేలుకు సాగిపోయి ఆ నగరపౌరులనుగూడ రొట్టెలను ఇవ్వుడని అడిగెను. వారును సుక్కోతు పౌరుల రీతిగనే జవాబిచ్చిరి.

9. అతడు వారితో “నేను విజేతనై మరలి వచ్చునపుడు మీ బురుజులను నేలమట్టము చేయుదును” అనెను.

10. సెబా, సల్మూనా రాజులు కర్కోరున విడిది చేసిరి. వారితోపాటు పదునైదువందలమంది సైనికులు నుండిరి. తూర్పుసీమ నుండి వచ్చిన వారిలో మిగిలినది వారుమాత్రమే. వారి వీరులు లక్ష ఇరువది వేల మంది రణమున మడిసిరి.

11. గిద్యోను నోబా, సొగ్బేహా నగరములకు తూర్పుగా “దేశదిమ్మరుల త్రోవ" వెంటపోయి ఏమరుపాటుననున్న శత్రువుల మీదపడి వారిని చంపెను.

12. సెబా, సల్మూనా పారిపోయిరి. కాని గిద్యోను వారిని వెన్నాడి చెర పట్టెను. వారి దళమునుగూడ తునుమాడెను. -

13. ఆ రీతిగా యుద్ధము ముగిసిన తరువాత గిద్యోను హెరెసుకొండ మీదుగా మరలివచ్చెను.

14. అతడు దారిలో సుక్కోతు యువకుని ఒకనిని బంధించి ప్రశ్నింపగా వాడు ఆ నగరనాయకుల పేర్లు డెబ్బది ఏడు వ్రాసియిచ్చెను.

15. అంతట గిద్యోను సుక్కోతు చేరి పౌరులతో “అలసిసొలసిపోయిన నీ సైన్యములకు రొట్టెలనందించుటకు సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ చేతచిక్కిరి కాబోలు! అని మీరు నన్ను పరిహసించితిరి గదా! ఇదిగో, ఆ సెబా, సల్మూనా రాజులు" అని పలికెను.

16. సుక్కోతు నాయకులను, పౌరులను ఎడారి ముండ్లతో చీల్చివేసెను.

17. పెనూవేలు బురుజు పడగొట్టి పురజనులను చిత్రవధ గావించెను.

18. అంతట గిద్యోను సెబా, సల్మూనా రాజుల వైపు తిరిగి “మీరు తాబోరు కొండవద్ద సంహరించిన వీరులు ఎట్టివారో మీకు గుర్తున్నదా?” అని అడిగెను. ఆ రాజులు “వారు అచ్చముగా నీ వలె నుండిరి. ఆ వీరులందరు రాజతనయులవలె ప్రవర్తించిరి” అని చెప్పిరి.

19. గిద్యోమ వారితో “వారు మా తల్లి కడుపునపుట్టిన సొంతసోదరులు. యావే తోడు! నాడు మీరు వారిని విడిచిపెట్టియుండినయెడల నేడు నేనును మిమ్ము విడిచియుందును” అనెను.

20. అంతట గిద్యోను తన పెద్దకొడుకు యేతేరును చూచి “ఇటు వచ్చి వీరిని వధింపుము” అనెను. కాని ఆ కుఱ్ఱవాడు కత్తిదూయలేదు. అతడింకను పసివాడు గనుక భయపడిపోయెను.

21. సెబా, సల్మూనా రాజులు గిద్యోనుతో “నీవే మా మీదబడి మమ్ము వధింపుము. పరాక్రమము పెద్దవారికేగదా!" అనిరి. గిద్యోను ఆ రాజుల మీదబడి వారిని వధించెను. వారి ఒంటెల మెడలనుండి వ్రేలాడు చంద్రహారములను గైకొనెను.

22. యిస్రాయేలీయులు గిద్యోనుతో “నీవు మమ్ము మిద్యానీయుల బారినుండి కాపాడితివి గనుక నీవును, నీ కుమారుడును, నీ మనుమడును మా మీద పరిపాలన చేయవచ్చును" అనిరి.

23. కాని గిద్యోను “నేనుగాని నా కుమారుడుగాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్మేలును.

24. ఇపుడు నా మనవి ఒకటి వినుడు. మీలో ప్రతి ఒక్కడు కొల్లసొమ్ము నుండి నాకొక బంగారుపోగును ఈయవలయును” అనెను. ఓడి పోయిన శత్రు సైనికులు యిష్మాయేలీయులు గనుక వారు బంగారు చెవిపోగులు తాల్చియుండిరి.

25. యిస్రాయేలీయులు గిద్యోను విన్నపమును అంగీకరించిరి. అతడు ఉత్తరీయమును విప్పగా యిస్రాయేలీయులందరు తమ కొల్లసొమ్ము నుండి ఒక్కొక్క బంగారు చెవిపోగును విసరివేసిరి. ఆ రీతిగా గిద్యోను ప్రోగుజేసిన బంగారు చెవిపోగులు పదునేడు వందల తులముల యెత్తు ఆయెను.

26. పైగా మిద్యాను రాజులు ధరించిన చంద్రహారములు, వాటికి వ్రేలాడు పతకములు, పట్టుబట్టలు, ఇంకను వారి ఒంటెల కంఠాభరణములు గిద్యోనునకు లభించెను.

27. వీనినన్నింటితో గిద్యోను యాజక ప్రత్యేక అంగీ ఎఫోదును ఒకటి తయారుచేయించి దైవప్రతిమనుచేసి తన నగరమైన ఒఫ్రాయందు ప్రతిష్ఠించెను. కాని యిస్రాయేలీయులు ఆ ఎఫోదును ఆరాధింపమొదలిడిరి. ఆ చర్యవలన గిద్యోను, అతని కుటుంబము ఉరిలో తగులుకొనెను.

28. ఆ రీతిగా మిద్యానీయులు యిస్రాయేలీయుల చేతిలో ఓడిపోయిరి. వారు మరల తలయెత్తుకొని తిరుగనేలేదు. యిస్రాయేలీయులు గిద్యోను జీవించినంత కాలము నలువదియేండ్లు చీకుచింత లేకుండ జీవించిరి.

29. యోవాషు కుమారుడు యెరూబాలు బ్రతికియున్నంత కాలము తన యింటనే వసించెను.

30. అతనికి చాలమంది భార్యలు కలరు గనుక డెబ్బదిమంది కుమారులు కలిగిరి.

31. షెకెమున వసించు అతని ఉంపుడుకత్తెకు గూడ ఒక కుమారుడు పుట్టెను. ఆ బిడ్డకు అబీమెలెకు అని పేరు పెట్టెను.

32. యోవాషు కుమారుడు గిద్యోను పండువంటి నిండు ప్రాయమున కన్నుమూసెను. అతనిని అబీయెసీయుల మండలమునందలి ఒఫ్రా నగరమున అతని తండ్రి యోవాసు సమాధిలోనే పూడ్చివేసిరి.

33. గిద్యోను గతించిన తరువాత యిస్రాయేలీయులు మరల బాలును కొలిచిరి. బాలుబెరీతును దైవముగా పూజించిరి.

34. చుట్టుపట్లనున్న శత్రువుల నుండి తమను కాపాడిన యావేను పూర్తిగా విస్మరించిరి.

35. తమకు అన్ని ఉపకారములు చేసిన యెరూబాలు అనబడు గిద్యోను కుటుంబమును కూడ పూర్తిగా మరచిపోయిరి.