ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 7

 1. మొర్దెకయి జరిగిన సంఘటన గూర్చి విని సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చుచు, పురవీధులగుండ నడచివచ్చి ప్రాసాద ప్రవేశద్వారము చేరెను.

2. గోనె తాల్చినవారు రాజప్రాసాదమున అడుగిడరాదను నియమము కలదు కనుక అతడు లోనికి పోలేదు.

3. సామ్రాజ్యపు సంస్థానములలో రాజశాసనమును ప్రకటింపగనే, అచటి యూదులు కూడ భోరున ఏడ్చిరి. వారు ఉపవాసముండి పరితాపముతో శోకించుచు గోనె తాల్చి బూడిద మీద కూర్చుండిరి

4. ఎస్తేరు పనికత్తెలు మరియు నపుంసకులు మొర్దెకయి దుఃఖమును గూర్చి తెలియజేయగా ఆమె మిగుల విచారపడెను. అతడు తొడుగుకొనుటకు కొన్ని బట్టలు పంపెను. కాని అతడు వానిని పుచ్చుకొనలేదు.

5. అప్పుడు ఆమె రాజు తనకు పరిచారకునిగా నియమించిన హతాకు అను నపుంసకుని పిలిచి మొర్దెకయి చెంతకుపోయి అతడెందుకు దుఃఖించుచున్నాడో, యేమి జరిగినదో తెలిసికొనిరమ్మని చెప్పెను.

6. హతాకు వెళ్ళి ప్రాసాదము ప్రవేశద్వారము చెంత నిల్చియున్న మొర్దెకయిని కలిసికొనెను.

7. అతడు తనకు సంభవించిన కష్టము సంగతిని, యూదులను చంపినచో రాజుకోశాగారమునకు సొమ్ము చెల్లింతునన్న హామాను సంగతిని తెలియజెప్పెను.

8. యూదులను తెగటార్చుటకు షూషను దుర్గమున ప్రకటింపబడిన రాజశాసనపు ప్రతిని గూడ హతాకునకు ఇచ్చి ఎస్తేరునకు చూపుమని చెప్పెను. ఆమె రాజు చెంతకు పోయి యూదులను కరుణింపవలసినదిగా మనవి చేయవలెననియు అతనితో నుడివెను. “నీ పూర్వ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకొనుము. నేను చిన్న నాడు నిన్ను పెంచి పెద్దచేసితిని. ఈ రాజ్యమున రెండవ స్థానమున నున్న హామాను మనలను నాశనము చేయవలెనని రాజునకు విన్నపము చేసెను. కనుక నీ దేవుని ప్రార్ధింపుము. రాజునకు మనవిచేసి, మమ్ము చావునుండి తప్పింపుము” అని చెప్పుమనెను.

9. హతాకు తిరిగివచ్చి మొర్దెకయి పలుకులను ఎస్తేరునకు ఎరిగించెను.

10. ఆమె మొర్దెకయికి ఈ సందేశము పంపించెను:

11. “రాజు పిలువకయే ప్రాసాద అంతర్భాగములోనికి పోయి అతనిని దర్శింప సాహసించు పురుషునికిగాని, స్త్రీకిగాని ఒక్కటే ఒక శిక్ష - మరణము. అట్టి పట్టున రాజు కరుణించి తన బంగారుదండమునెత్తి ఎవరివైపు చూపునో వారిని మాత్రము ప్రాణములతో వదలివేయుదురు. రాజు సలహాదారులు మొదలుకొని అతని రాజ్యములోని సామాన్య ప్రజలవరకు ఎల్లరకును ఈ నియమము తెలియును. మరి కడచిన ముప్పదినాళ్ళనుండియు రాజు నన్ను తనచెంతకు పిలిపించుకోలేదు.”

12. ఎస్తేరు సందేశము మొర్దెకయికి అందెను.

13. అతడు ఈ క్రింది ప్రతి సందేశమును పంపెను: “నీవు సురక్షితముగా రాజసౌధమున ఉన్నంత మాత్రమున యూదులలో నీవు ఒక్కదానవే తప్పించుకో గలవని భావింపవలదు.

14. ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేని యూదులకు మరియొక దిశనుండి రక్షణము లభించితీరును. కాని నీవు తప్పకచత్తువు. నీ కుటుంబము పేరును మాసిపోవును. అయినను ఇప్పుడు నీవు రాణివైనది ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు ఎరుగుదురు?'

15.ఎస్తేరు మొర్దెకయికి మరల ఈ క్రింది సందేశము పంపెను:

16. “నీవు వెళ్ళి షూషను నగరములోని యూదులనెల్ల ప్రోగుచేయుము. మీరెల్లరు ఉపవాస ముండి నా కొరకు ప్రార్థనచేయుడు. మూడునాళ్ళ పాటు రేయింబవళ్లు ఏమి ముట్టుకొనక కటిక ఉపవాసముండుడు. నా దాసీ జనము, నేను అదే రీతిని ఉపవసింతుము. మూడు నాళ్ళు కడచిన పిదప రాజ శాసనమును గూడ ధిక్కరించి నేనతని సన్నిధికి వెళ్లెదను. అందుకుగాను నేను చావ వలసి వచ్చినచోచత్తును.”

17. అంతట మొర్దెకయి వెడలిపోయి ఎస్తేరు చెప్పినట్లే చేసెను.