ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 8

 1. ఏడవనెల వచ్చునప్పటికి యిస్రాయేలీయులందరు తమతమ నగరములందును పట్టణములందును స్థిరపడిరి. ప్రజలెల్లరు ఒక్కుమ్మడిగా పయనమై వచ్చి జలద్వారమునొద్దగల మైదానమున ప్రోగైరి. వారు ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రాను చూచి ప్రభువు మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును కొనిరమ్మనిరి.

2. ఏడవనెల, మొదటి దినమున ఎజ్రా గ్రంథమును తెచ్చెను. అచట స్త్రీలు, పురుషులు, ధర్మశాస్త్రమును అర్ధముచేసికొనుపాటి ప్రాయముగల పిల్లలు గుమిగూడియుండిరి.

3. అతడా మైదానముననే ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ఎల్లరు సావధానముగా వినిరి.

4. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్యవేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మత్తిత్యా, షేమ, అనాయ, ఊరియా, హిల్కీయా, మాసేయా అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయా, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము నిలుచుండిరి.

5. ఎజ్రా వేదికనెక్కి యుండుటచే అందరికంటె ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరు అతనివైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరు లేచి నిలుచుండిరి.

6. ఎజ్రా మహాదేవుడైన యావేను స్తుతించెను. ప్రజలెల్లరు చేతులు పైకెత్తి “ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటుపిమ్మట ఎల్లరు నేలమీద సాగిలపడి యావేకు నమస్కరించిరి.

7. అంతట ప్రజలు లేచి తమతమ తావులందు నిలుచుండిరి. అప్పుడు ఈ క్రింది లేవీయులు వారికి ధర్మశాస్త్ర భావమును వివరించిరి:" యేషూవ, బానీ, షేరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతయి, హోదీయా, మాసెయా, కేలీటా, అసర్యా, యోసాబాదు, హనాను, పెలాయా.

8. వారు ధర్మ శాస్త్రమును చదివి దానిననువదించిరి. దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్ధము చేసికొనిరి.

9. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక అధికారి నెహెమ్యా, యాజకుడును, ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా, ప్రజలకు బోధచేయుచున్న లేవీయులు జనులను చూచి “ఇది ప్రభువునకు పవిత్రదినము. కనుక మీరు దుఃఖింపవలదు” అని చెప్పిరి.

10. మరియు అతడు వారితో “ఇక యింటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకుగూడ పంచియిండు. నేడు ప్రభువునకు పవిత్రదినము కనుక మీరు దుఃఖింపవలదు. యావేనందు ఆనందించుటయే మీకు శక్తి.” అని చెప్పెను.

11. లేవీయులు ప్రజల మధ్యకు వెళ్ళి “దుఃఖింపకుడు. ఇది ప్రభువునకు పవిత్రదినము” అని చెప్పుచు వారినోదార్చిరి.

12. తమకు తెలియజేయబడిన మాటలన్నియు అర్ధము చేసుకొని ప్రజలు తమ ఇండ్లకు వెళ్ళి ఆనందముతో తిని, త్రాగిరి. పేదసాదలకు అన్నపానీయములు పంపించిరి.

13. రెండవ రోజు ప్రజానాయకులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రమును వినుటకై ధర్మశాస్త్ర బోధకుడు ఎజ్రా వద్దకు వచ్చిరి.

14. ప్రభువు మోషే ద్వారా జారీ చేసిన ధర్మశాస్త్రమున "ఏడవనెల ఉత్సవము జరుగునపుడు యిస్రాయేలీయులు గుడారములలో వసింపవలయును” అను వాక్యము ఒకటి కలదు. అది వారి కంటబడెను.

15. కనుక వారు యెరూషలేమునందు ఇతర నగరములందు. ఈ క్రింది ప్రకటన జారీ చేయించిరి: “మీరు కొండలకు వెళ్ళి ఓలివు, దేవదారు, గొంజి, ఖర్జూరము మొదలైన గుబురుచెట్ల కొమ్మలను నరికి తెచ్చి ధర్మశాస్త్ర నియమము ప్రకారము గుడారములను నిర్మింపుడు.”

16. ప్రజలు వెంటనే వెళ్ళి కొమ్మలు నరికితెచ్చిరి. వానితో తమ మిద్దెలమీద, ముంగిళ్ళలో, దేవాలయ ప్రాంగణమునందు, జలద్వారము, ఎఫ్రాయీము ద్వారము, మైదానములందు గుడారములు నిర్మించిరి.

17. ప్రవాసమునుండి తిరిగివచ్చిన జనులెల్లరు గుడారములు కట్టి వానిలో వసించిరి. నూను కుమారుడైన యెహోషువ కాలమునుండి యిస్రాయేలీయులు ఇట్టి కార్యమును చేసి ఎరుగరు. ప్రజలెల్లరు పరమానందము నొందిరి

18. పండుగ మొదటి నాటినుండి కడపటి నాటివరకు ఎజ్రా ప్రతి రోజు ధర్మశాస్త్రమును చదువుచుండెను. ఉత్సవము ఏడు రోజులు సాగెను. ఎనిమిదవనాడు నియమము ప్రకారము పండుగ సమావేశము జరుపుకొనిరి.