ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 6

 1. రాజశాసనమిది: “హిందూ దేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూట యిరువదియేడు సంస్థానముల పాలకులకును, వారి క్రింది అధికారులకును, మహాప్రభువైన అహష్వేరోషు వ్రాయునది.

2. మేము చాల జాతులకు ప్రభువులమై ప్రపంచమంతటిని యేలు వారము. అయినను అధికార గర్వముతో ఉప్పొంగక న్యాయసమ్మతము గాను, దయాపూర్వకముగాను పరిపాలన చేయగోరెదము. మా ప్రజలెట్టి ఉపద్రవములకు గురికాక, సుఖముగా జీవింపవలెననియు, మా సామ్రాజ్యమున శాంతిభద్రతలు నెలకొనగా జనులెల్లరు ఒక మూల నుండి మరియొక మూలవరకు సురక్షితముగా రాకపోకలు సలుపవలెననియు మా కోరిక. లోకములోని జనులెల్లరు వాంఛించు శాంతి ఈ సామ్రాజ్యమునను నెలకోనవలెననియే మా అభీష్టము.

3. ఈ ఆశయమునెట్లు సాధింపవలెనాయని మా సలహాదారులను అడిగితిమి.వారిలో ఒకని పేరు హామాను. ఇతడు చాల వివేకము, రాజభక్తి, విశ్వసనీయత కలవాడు. అధికారమున మా తరువాత మాయంతటివాడు.

4. ఈ హామాను మా సామ్రాజ్యమునందలి వివిధ జాతులతో కలిసి జీవించు విరోధిజాతి ఒకటి కలదని మాకు విన్నవించెను. మరియు వారి ఆచార వ్యవహారములు ఇతర జాతుల ఆచారవ్యవహారముల కంటె భిన్నముగా నుండుననియు, వారెల్లప్పుడు రాజశాసనములను ధిక్కరించుచుందురనియు, ఈ రాజ్యమును ఏకము చేయవలెనన్న నా సత్సంకల్పమును ఎల్లప్పుడు చెరచుచుందురనియు అతడు తెలిపెను.

5. కనుక ఈ ఒక్కజాతి మా యేలుబడిలోని ఇతర జాతులన్నిటికి విరోధముగా వర్తించుచున్నదనియు, దాని ఆచార వ్యవహారములు దోష దూషితముగానున్నవనియు మేము గుర్తించితిమి. ఈ జాతి మాకు వ్యతిరేకముగా ఘోరమైన అపరాధములు చేయుచున్నదనియు, దీని వలన మా సామ్రాజ్య భద్రతకే ముప్పు వాటిల్లనున్నదనియు మేము గ్రహించితిమి.

6. కనుక మా శ్రేయస్సు నిమిత్తమై మేమే స్వయముగా ఎన్నుకొనగా మాకు ప్రధానోద్యోగియు, రెండవ తండ్రి వంటివాడునగు హామాను వ్రాయించిన ఈ తాకీదులలో పేర్కొనబడిన జాతి జనులందరిని ఎట్టి దయాదాక్షిణ్యములు చూపకుండ, వారి భార్యలను, పిల్లలను కత్తికి ఎరజేయవలెను. ఈ సంవత్సరము వచ్చు అదారు పేరుగల పండ్రెండవ నెలలో పదునాలుగవ దినమున ఈ కార్యమును జరుపవలెను. ఇది మా ఆజ్ఞ,

7. ఈ రీతిగా పూర్వమునుండి మమ్ము ఎదిరించుచు వచ్చిన ఈ దుష్టజాతిపీడ నేటితో విరుగడకాగా, ఇకమీదట మా సామ్రాజ్యము శాశ్వతముగా శాంతి భద్రతలను అనుభవించును గాక!”

14. ఈ శాసనమును ప్రతి రాష్ట్రమున ప్రకటింప వలెననియు నిర్ణయించిరి. అట్లు చేసినచో ప్రతి సంస్థానము నిర్ణీతదినమున యూదులను వధించుటకు సిద్ధముగా ఉండునని వారి తలపు.

15. రాజాజ్ఞపై వార్తావహులు త్వరపెట్టబడి పై శాసనపు తాకీదులను వివిధ సంస్థానములకు కొనిపోయిరి. మొదట రాజధాని షూషను దుర్గముననే రాజశాసనమును ప్రకటించిరి. ఒక ప్రక్క రాజు హామానుతో విందారగించుచు ఆనందించుచుండగా మరియొక ప్రక్క షూషనునగరము ఈవార్త విని గగ్గోలుపడెను.