ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 5

 1. యూదయా స్త్రీలు, పురుషులు కూడ వారి సోదరయూదులమీద అభియోగము తెచ్చిరి.

2. కొందరు “మా బిడ్డలను మారకము వేసి, మేము ధాన్యము తెచ్చుకొని తిని బ్రతుకవలసి వచ్చినది” అనిరి.

3. మరికొందరు "మేము ధాన్యము తెచ్చుకొనుటకు మా పొలములు, ద్రాక్షతోటలు ఇండ్లు తాకట్టు పెట్టవలసి వచ్చినది"అని పలికిరి.

4. ఇంకా కొందరు “మా పొలములను, ద్రాక్షతోటలను కుదువబెట్టి డబ్బు అప్పు తీసికొని రాజుగారికి పన్ను కట్టవలసివచ్చినది.

5. మేము మా తోటి యూదులవంటివారముకామా? వారికి అవసరమైనవి మాకు మాత్రము అవసరము కాదా? మా పిల్లలు వారిపిల్లల వంటివారు కారా? అయినను మా బిడ్డలు దాసత్వములో ఉండిరి. మా ఆడుపిల్లలు కొందరిని ఇదివరకే దాసీలుగా అమ్మి వేసితిమి. మా పొలములు, ద్రాక్షతోటలనిదివరకే అన్యులదగ్గర కుదువబెట్టితిమి, గనుక దాసులుగా అమ్ముడుపోయిన పిల్లలను తిరిగి కొనితెచ్చుకోజాలకున్నాము” అని పలికిరి.

6. వారి మొర విని నేను మండిపడితిని.

7. ఆ సంగతి నాకు నేనే ఆలోచించి చూచుకొని ప్రజా నాయకులను, అధిపతులను పిలిపించి చీవాట్లు పెట్టితిని. “మీరు మీ తోడి యూదులను పీడించి వడ్డీ వసూలు చేయుచున్నారు” అని చెప్పితిని. అటు పిమ్మట ప్రజలనందరిని ప్రోగు చేయించితిని.

8. “మేము అన్యజాతి ప్రజలకు దాసులుగా అమ్ముడుపోయిన మన తోడి యూదులను మా శక్తికొలది దాసత్వము నుండి విడిపించుచున్నాము గదా! ఇప్పుడు మీరు మీ సోదర ప్రజలను తోడి యూదులకే దాసులుగా అమ్మివేయుచున్నారు” అని మందలించితిని. ప్రజానాయకులు నా మాటలకు జవాబు చెప్పజాలక మౌనము వహించిరి.

9. నేను మరల “మీరు చేయు పని మంచిదికాదు. మీరు దేవునికి భయపడి ఇట్టి దుష్కార్యములు చేయుట మానుకోవలెను గదా! అప్పుడు గాని మన శత్రువులైన అన్యజాతి ప్రజలు మనలను అవహేళన చేయకుండ ఉండరు.

10. మీవలే నేను కూడ ఈ ప్రజలకు డబ్బును, ధాన్యమును అరువిచ్చితిని. నా స్నేహితులు, నాతో పనిచేయువారును అటులనే చేసిరి. ఇప్పుడు మనమందరము ప్రజలు ఈ అప్పులు తీర్చనక్కర లేదని నిర్ణయించుకొందము.

11. కనుక నేడే ఈ ప్రజల పొలములు, ద్రాక్షతోటలు, ఓలీవు తోటలు, ఇండ్లు ఎవరివి వారికి వదిలివేయుడు. డబ్బు, ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనె మొదలైన అప్పులన్నిటిని మన్నించి వదలివేయుడు” అని పలికితిని.

12. ప్రజానాయకులు “మేము నీవు చెప్పినట్లే చేయుదుము. వారి పొలములు వారికి ఇచ్చివేయుదుము. మేమిచ్చిన అప్పులు తిరిగి వసూలు చేయము” అని పలికిరి. వెంటనే యాజకులను పిలిపించి నాయకుల చేత వారెదుటనే ప్రమాణము చేయించితిని.

13. నేను నడికట్టుగా కట్టుకొన్న బట్టను విప్పి వారి యెదుటనే దులిపితిని. “ఇప్పుడు మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొననిచో ప్రభువు కూడ మీ యిండ్లనుండి, మీ జీవనోపాధికి మీరు చేయు పనినుండి ఇట్లే దులిపివేయును”అని నుడివితిని. అక్కడ గుమిగూడిన వారందరు “ఇట్లే జరుగునుగాక!” అని బదులు పలికి ప్రభువునుసన్నుతించిరి. తరువాత వారందరు తమ మాట నిలబెట్టుకొనిరి.

14. ఇంకను రాజు నన్ను యూదా రాజ్యమునకు అధికారిగా నియమించిన పండ్రెండేండ్లు, అనగా అర్తహషస్తరాజైన యిరువదియవయేటి నుండి ముప్పది రెండవ యేటివరకు, నేనును, నా బంధువులును ప్రజలనుండి అధికారికి లభింపవలసిన భోజన వేతనములను ముట్టుకొనియెరుగము.

15. నాకు ముందు అధికారులుగా పనిచేసినవారు వారి అన్నపానీయములకు ప్రజలనుండి రోజుకు నలుబది వెండి నాణెములు వసూలుచేసి వారిని వేధించెడివారు. వారి సేవకులు కూడ ప్రజలను పీడించెడివారు. కాని నేను దేవునికి భయపడి అట్టి దుష్కార్యములు చేయనైతిని.

16. నా శక్తినంతటిని ప్రాకారము కట్టుటకు ధారపోసితిని. నేను పొలము పుట్ర సంపాదించుకోలేదు. నా తోటిపనివారందరు గోడ కట్టుటలో నిమగ్నులైరి.

17. దినదినము నూట యేబదిమంది యూద నాయకులు, అధిపతులు నా ఇంట భోజనము చేసెడి వారు. ఇంకను ఇరుగుపొరుగు జాతుల ప్రజలు కూడ నా యింటికొచ్చి అన్నము తినిపోయెడివారు.

18. ప్రతిదినము ఒక కోడెను, ఆరు మంచి పొట్టేళ్ళను, చాల కోళ్ళను కోయించెడివాడను. పదిరోజులకు ఒక సారి ద్రాక్షసారాయము తెప్పించి నిల్వచేసెడివాడను. ఇంత వ్యయమైనప్పటికీ అధికారి పోషణకు లభింపవలసిన పన్నును వసూలు చేయింపలేదు. ప్రజలప్పటికే దారిద్ర్యభారము వలన నలిగిపోవుచుండిరి.

19. 'ప్రభూ! నీవు మాత్రము నేనీ ప్రజలకు చేసిన ఉపకారమును జప్తియందుంచుకొనుము'.