ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 5

 1. సిరియారాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు. కాని కుష్ట రోగి.

2. ఒకమారు సిరియనులు యిస్రాయేలు దేశముమీద దాడిచేసి వారి బాలికనొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను.

3. ఆమె ఒకనాడు యజమానురాలితో “మన యజమానుడు నమరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళిన ఎంత బాగుండునో! ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా!” అనెను.

4. నామాను రాజునొద్దకు వెళ్ళి యిస్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను.

5. రాజు అతనితో “నీవు యిస్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము. నేను అతనికి కమ్మ వ్రాసిచ్చెదను" అని చెప్పెను. కనుక నామాను ముప్పదివేల వెండినాణెములు, ఆరువేల బంగారు కాసులు, పదిజతల పట్టుబట్టలు కానుకగా తీసికొని యిస్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను.

6. దానియందు ఇట్లున్నది “నా ఉద్యోగియైన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది."

7. యిస్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలుచించుకొనెను. కొలువుకాండ్రతో “వింటిరా! సిరియారాజు నేనితని కుష్ఠము నయము చేయవలయును అని అనుచున్నాడు. చావునుగాని, బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనాయేమి? అతడు నాతో జగడము పెట్టుకొనుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుటలేదా?” అనెను.

8. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని దైవభక్తుడైన ఎలీషా అతనియొద్దకు కబురుపంపి “నీవు బట్టలు చించుకోనేల? నామానును నాయొద్దకు పంపుము. యిస్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించును” అని చెప్పెను.

9. నామాను రథములతో, గుఱ్ఱములతో వెడలివచ్చి ఎలీషా ఇంటిద్వారము ముందట నిలువగా,

10. ఎలీషా అతనివద్దకు తన సేవకునిపంపి “నీవు వెళ్ళి యోర్దాను నదిలో ఏడుసార్లు స్నానముచేయుము. నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును” అని చెప్పించెను.

11. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు “ప్రవక్త వెలుపలికి వచ్చి, నా ఎదుట నిలుచుండి, తన దేవుని ప్రార్ధించి, కుష్ఠము సోకిన భాగముపై తనచేయి త్రిప్పి, నా వ్యాధి నయము చేయుననుకొంటిని.

12. దమస్కు నందలి అబానా, ఫర్పరు నదులు ఈ యిస్రాయేలు నదికంటె గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానముచేసి ఆరోగ్యము పొందలేనా?” అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను.

13. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి 'అయ్యా! ప్రవక్త నిన్నేదైన కష్టమైన కార్యము చేయుమని ఆజ్ఞాపించినయెడల నీవు తప్పక చేసియుండెడివాడవే గదా? ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానముచేసి శుద్ధిపొందుట సులభముగాదా?" అనిరి.

14. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడుసార్లు మునిగి స్నానముచేసెను. వెంటనే అతని శరీరము శుద్ధిపొంది పసిబిడ్డ దేహమువలె అయ్యెను.

15. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకువచ్చి "అయ్యా! ఈ భూమి మీద యిస్రాయేలు దేవుడుతప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించు కోగోరెదను, చిత్తగింపుము” అనెను.

16. కాని ఎలీషా “నేను కొలుచు సజీవుడైన యావే తోడు! నీ కానుక లేమియు నాకక్కరలేదు” అనెను. నామాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు.

17. నామాను “నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చటినుండి రెండు కంచర గాడిదలు మోయునంత మట్టినైనను ' మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటినుండి నేను ప్రభువునకు తప్ప మరియే అన్యదైవములకు బలులుగాని, దహనబలులుగాని సమర్పింపను.

18. మా ప్రభువగు సిరియారాజు రిమ్మోను దేవళమునకు వెళ్ళినపుడు నేనును అతని వెంట పోవలయును. అతడు నా భుజములపై వ్రాలి రిమ్మోనును ఆరాధించునపుడు నేనును ఆ దేవునకు మ్రొక్కవలయును. ఈ ఒక్క కార్యమునకుగాను యావే ప్రభువు నన్ను మన్నించుగాక!” అని పలికెను.

19. ఎలిషా అతనితో “నీవు నిశ్చింతగా వెళ్ళిరమ్ము” అని చెప్పగా నామాను తన దేశమునకు పయనమయ్యెను.

20. అతడు కొంచెము దూరము పోయెనో లేదో, ఎలీషా సేవకుడు గేహసీ “యజమానుడు కానుక పుచ్చుకొనకయే ఈ సిరియా సైన్యాధిపతిని పంపివేసెనుగదా! సజీవుడైన యావే తోడు! నేను అతని వెంట పరుగెత్తి ఏదైన బహుమానమును అడిగి పుచ్చు కొందును” అని తలంచెను.

21. కనుక గేహనీ నామాను వెనువెంట పరుగెత్తాను. నామాను తన వెనుక ఎవరో పరుగెత్తుకొని వచ్చుచున్నారని గమనించి రథము దిగి గేహసీని కలిసికొని “అందరు క్షేమముగా నున్నారా?” అని ప్రశ్నించెను.

22. గేహసీ “మేము అందరము కుశలముగనే ఉన్నాము. ఇప్పుడే ఎఫ్రాయము మన్నెమునందలి ప్రవక్తల సమాజము నుండి ఇరువురు ప్రవక్తలు మా ఇంటికి వచ్చిరి. వారికి గాను మూడు వేల వెండినాణెములు, రెండుజతలు పట్టుబట్టలు ఈయవలసినదని మా యజమానుడు నిన్నడుగు చున్నాడు” అని చెప్పెను.

23. నామాను "అయ్యా! మూడువేలేమి, ఆరువేలనాణెములు గైకొనుము" అని గేహసీని బ్రతిమాలెను. అతడా నాణెములు రెండు సంచులలో పోసెను. ఆ సంచులను, రెండు జతల పట్టుబట్టలను ఇదరు సేవకుల నెత్తికెత్తించెను. వారు ఆ కానుకలను మోసికొనుచు గేహసీ ముందు నడచి వచ్చిరి.

24. వారు కొండచెంతకు రాగానే గేహసీ ఆ సంచులను తన ఇంటచేర్చుకొని నామాను సేవకులను పంపివేసెను.

25. తరువాత గేహసీ ఎలీషా వద్దకు వెళ్ళెను. ప్రవక్త  “ఓయి! నీవెక్కడికి వెళ్ళితివి?” అని అతని నడిగెను. గేహసీ "నేనెక్కడికిని వెళ్ళలేదు” అనెను.

26. కాని ఎలీషా “అతడు రథముదిగి నిన్ను కలసికొనినపుడు నా మనసు నీతో రాలేదనుకొంటివా? డబ్బు, ఉడుపులు, ఓలివుతోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెల మందలు, గొడ్లమందలు, దాసదాసీజనములు కానుకగా స్వీకరించుటకు ఇది అదననుకొంటివా?

27. నామానునకు సోకిన కుష్ఠము తరతరముల వరకు నిన్నును నీ వంశీయులను పట్టి పీడించునుగాక!” అని పలికెను. గేహసీ యజమానుని ఇంటినుండి వెలుపలికి వచ్చునప్పటికి కుష్ఠము సోకగా అతని ఒడలు మంచు వలె తెల్లనయ్యెను.