ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 5

 1. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు రాజు హామాను అనునతనిని ప్రధానమంత్రిగా నియమించెను. ఇతడు హమ్మెదాతా కుమారుడైన, అగాగు వంశజుడు.

2. ఆస్థానమునందలి ఉద్యోగులెల్లరు హామానునకు మోకరిల్లి దండము పెట్టవలెనని రాజు కట్టడచేసెను. మొర్దెకయి ఒక్కడు తప్ప మిగిలిన రాజోద్యోగులెల్లరు అట్లే చేయుచుండిరి.

3. కనుక వారు “నీవు రాజాజ్ఞ ధిక్కరింతువేల?” అని మొర్దెకయిని అడిగిరి.

4. వారు ప్రతిరోజు మొర్దెకయికి సలహా ఇచ్చుచున్నను, అతడు వారి మాట లెక్క చేసెడి వాడు కాదు. తాను యూదుడను అని మాత్రము బదులు చెప్పెడి వాడు. ఆ ఉద్యోగులు మొర్దెకయి తన పట్టుదలనెట్లు నిలబెట్టుకోగలడో చూతమని ఆ సంగతిని హామానునకు తెలియజేసిరి.

5. మొర్దెకయి తనకు మోకాలు వంచి దండము పెట్టుటలేదని గ్రహించి హామాను మండిపడెను.

6. అతడు మొర్దెకయి యూదజాతికి చెందినవాడని తెలిసికొని అతనినొక్కనినే వధించిన చాలదనియు అహష్వేరోషు సామ్రాజ్యము నుండి ఆ జాతినెల్ల రూపుమాపవలెననియు నిశ్చయించుకొనెను.

7. అహష్వేరోషు పరిపాలనాకాలము పండ్రెండవయేట నీసాను పేరుగల మొదటినెలలో యూదుల వధకు అనువైన నెలను, తేదీని నిర్ణయించుటకు హామాను చీట్లు ('పూరు' అనగా చీటి) వేయించెను. అదారు పేరుగల పండ్రెండవ నెలలో వచ్చు పదుమూడవ రోజు హత్యకు అనువైన దినమని నిర్ణయించిరి.

8. కనుక హామాను రాజుతో “ప్రభువులవారి సామ్రాజ్యమున, ప్రతి రాష్ట్రమునను చెల్లాచెదరైయున్న ఒకానొక జాతి ప్రజలు కాన్పింతురు. వారి ఆచార వ్యవహారములు ఇతరజాతుల ఆచారముల వంటివికావు. పైగా వారు రాజశాసనములు పాటించుటలేదు. అట్టి వారిని క్షమించుట దేవరవారికి క్షేమము కాదు.

9. ఏలినవారికి సమ్మతగునేని ఈ జాతిని నిర్మూలింపవలెనని శాసనము చేయుడు. వ్యయమునకుగాను నేను పదివేల వెండినాణెములను రాజోద్యోగుల ద్వారా కోశాగారమునకు ముట్టచెప్పెదను” అనెను.

10. ఆ మాటలకు ప్రభువు రాజముద్ర గల తన అంగుళీయకమును తీసి యూదులకు బద్దశత్రువైన హమ్మెదాతా కుమారుడును అగాగు వంశజుడునైన హామానునకు ఇచ్చెను.

11. అతనితో “ఆ ప్రజ, వారి సొత్తుగూడ నీ అధీనముననే యుండును. వారిని నీ ఇష్టము వచ్చి నట్లు చేయుము” అనెను. .

12. మొదటి నెల పదుమూడవ దినమున హామాను రాజ లేఖకులను పిలిపించి వారిచేత రాజ శాసనపు ప్రతులను వ్రాయించెను. ఆ ప్రతులు సామ్రా జ్యమునందలి వివిధ అధిపతులకును, అచటి ముఖ్య ఉద్యోగులకును పంపునవి కనుక వానిని వివిధ రాష్ట్రముల భాషలలోను, లిపులలోను వ్రాయించెను. వానిని రాజు పేరుతోనే వ్రాయించి, అతని అంగుళీయకముతో ముద్రించెను.

13. వేగముగా పరుగెత్తు వార్తావహులు ఆ ప్రతులను వివిధ సంస్థానములకు కొనిపోయిరి. నిర్ణీతదినమున, అనగా అదారు పేరు గల పండ్రెండవ నెలలో పదుమూడవ రోజున పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పిల్లలు అను వ్యత్యాసమును పాటింపక యూదులనెల్ల వధింపవలెననియు, దయాదాక్షిణ్యములు చూపక వారినెల్ల తుదముట్టించి వారి ఆస్తి పాస్తులను స్వాధీనము చేసుకోవలెననియు ఆ తాకీదులలో వ్రాయబడియుండెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services