ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 5

 1. సొలోమోను దేవాలయపు పనులన్నిటిని పరిపూర్తి చేయించెను. అటుపిమ్మట ప్రభువునకు తన తండ్రి దావీదు అంకితముచేసిన వెండిబంగారములను, ఇతర వస్తువులను కొనివచ్చి దేవాలయ కోశాగారమునకు సమర్పించెను.

2. అంతట సొలోమోను రాజు యిస్రాయేలు పెద్దలను, తెగనాయకులను యెరూషలేమున సమావేశపరచెను. ప్రభువు మందసమును సియోను నందు గల దావీదు నగరము నుండి దేవాలయమునకు తరలింపవలెనని చెప్పెను.

3. కనుక యిస్రాయేలీయులెల్లరు ఏడవనెలలో వచ్చు ఉత్సవము సందర్భమున అక్కడ సమావేశమైరి.

4-5. అవ్విధమున నాయకులెల్లరు ప్రోగైన పిదప లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. సొలోమోను, యిస్రాయేలు ప్రజలెల్లరు మందసము ముందట సమావేశమై లెక్కలేనన్ని పొట్టేళ్ళను, కోడెలను బలిగా సమర్పించిరి.

6. యాజకులును, లేవీయులును కలిసి ప్రభువు గుడారమును, దాని సామాగ్రితోపాటు దేవాలయమునకు కొని వచ్చిరి.

7. అటుతరువాత యాజకులు మందసమును దేవాలయములోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల నడుమ ఉంచిరి.

8. వాని రెక్కలు మందసమును, దానిని మోయు దండెలను కప్పి వేసెను.

9. గర్భగృహము ఎదుట పవిత్రస్థలములో నిలుచుండి చూచినచో ఈ దండెల కొనలు కన్పించేడివి. కాని బయటనుండి చూచువారికి అవి కన్పించేడివికావు. ఆ దండెలు నేటికిని అచటనేయున్నవి.

10. మోషే హోరెబు కొండచెంత ఆ మందసములో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేవు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చిన తరువాత ప్రభువు ఈ కొండచెంతనే వారితో నిబంధనము చేసికొనెను.

11-14. యాజకులెల్లరును, వారు ఏ వర్గమునకు చెందినవారైనను, తమను తాము శుద్ధిచేసికొనిరి. గాయకులైన లేవీయులు, అనగా ఆసాపు, హేమాను, యెదూతూను మరియు వారి వంశీయులవారు, నార బట్టలు తాల్చి, బలిపీఠమునకు దగ్గరగా, తూర్పు వైపున నిలుచుండి స్వరమండలము, తంబుర, చిటి తాళములు వాయించుచుండిరి. నూటఇరువదిమంది యాజకులు వారికెదురుగా నిలుచుండి బూరలనూదు చుండిరి. బూరలనూదువారు, స్వరమండలము మొదలగు వాద్యములను వాయించువారు, గాయకులందరు ఏకమై “ప్రభువును స్తుతింపుడు, అతడు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది" . అని ఎలుగెత్తి గానముచేసిరి. యాజకులు పవిత్ర స్థలమునుండి వెలుపలికి వచ్చుచుండగా ప్రభువు తేజస్సుతో ప్రకాశించు మేఘము దేవుని మందిరమును నింపెను. ఆ వెలుగు వలన యాజకులు ఆ మేఘమున్నచోట నిలిచి పరిచర్య చేయజాలరైరి.