ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 4

 1-6. సొలోమోను యిస్రాయేలీయులందరికి రాజయ్యెను. అతని రాజకీయోద్యోగుల పేరులివి. - సాదోకు కుమారుడు అసర్యా యాజకుడు. - షీషా కుమారులగు ఎలీహోరెపు, అహియా కార్యదర్శులు. -అహీలూదు కుమారుడగు యెహోషాపాతు లేఖకుడు. -యెహోయాదా కుమారుడగు బెనాయా సైన్యాధిపతి. - సాదోకు, అబ్యాతారు అనువారు యాజకులు. - నాతాను కుమారుడగు అసర్యా ముఖ్యపాలకుడు. - నాతాను కుమారుడగు సాబూదు మంత్రియు, రాజునకు మిత్రుడు. - అహీషారు ప్రాసాదపాలకుడు. - అబ్దా కుమారుడగు అదోనీరాము వెట్టిచాకిరి చేయువారికి అధిపతి.

7. సొలోమోను పండ్రెండుమంది ఉద్యోగులను మండల పాలకులనుగా నియమించెను. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల రాజునకు, అతని పరివారమునకు భోజన పదార్థములను సరఫరా చేయుచుండిరి.

8-19. ఆ ఉద్యోగుల పేర్లు, వారు పాలించిన మండలముల పేర్లు ఇవి: - ఎఫ్రాయీము మన్యమునందు-బెన్హురు. -మాక్సా, షాల్బీము, బేత్-షేమేషు, ఏలోను బెత్షానాను పట్టణములు-బెండేకరు. -అరుబోతు, సోకోతు, హేఫేరు పట్టణములు -బెన్హసెదు. -దోరు మన్యప్రదేశమందు -సొలోమోను కుమార్తె టాపాతు భర్త అయిన బెన్అబీనాదాబు. -తానాకు, మెగిద్ధో, బేత్-షియాను ప్రదేశము, యెస్రేయేలుకు దక్షిణమున సెరితాను ప్రక్కనున్న బేత్-షియాను పట్టణము నుండి ఆబెల్మెహోలా వరకు, యోక్మెయాము ఆవలి పట్టణములు -అహీలూదు కుమారుడు బానా. -రామోతు గిలాదు, మనష్షే కుమారుడగు యాయీరునకు చెందిన గిలాదు పట్టణములు, బాషానున నున్న అర్గోబు, ప్రాకారములు మరియు ఇత్తడి అడ్డగడలు గల అరువది రక్షిత పట్టణములు -బెన్గబేరు. -మహనాయీము -ఇద్ధో కుమారుడు అహీనాదాబు. -నఫ్తాలి -సొలోమోను కుమార్తె బాసెమతును పెండ్లియాడిన అహిమాసు. -ఆషేరు, బేయాలోతు -హూషయి కుమారుడు బానా. -యిస్సాఖారు మండలము -పారువా కుమారుడు యెహోషాఫాత్తు. -బెన్యామీను మండలము -ఏలా కుమారుడు షిమీ. -బాషాను రాజు ఓగు, అమోరీయుల రాజు సీహోను పాలించిన బాషాను మండలము -ఊరి కుమారుడు గెబేరు. వీరు గాక ఈ మండలములన్నిటికి పై అధికారిగ ఒక రాష్ట్రపాలకుడు గూడ నియమింపబడెను.

20. యూదీయులు, యిస్రాయేలీయులు సముద్ర తీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులుగా విస్తరిల్లిరి. వారందరు అన్నపానీయములు సేవించుచు హాయిగా కాలము గడిపిరి.

21. తూర్పున యూఫ్రటీసు నదివరకు, పడమట ఫిలిస్తీయా వరకు, దక్షిణమున ఐగుప్తు సరిహద్దులవరకు గల జాతులన్ని సొలోమోను రాజ్యమున చేరిపోయెను. వారందరు అతనికి కప్పము కట్టిరి. సొలోమోను జీవితకాలమెల్ల వారందరు అతనికి లొంగియుండిరి.

22-23. ప్రతిదినము సొలోమోను సౌధమునకు చేరు భోజన పదార్థముల వివరమిది: 150 కుంచముల గోధుమపిండి, 300 కుంచముల ముతకపిండి, బలసిన కోడెలు పది, పొలమున తిరుగాడు కోడెలు ఇరువది, పొట్టేళ్ళు నూరు. ఇవిగాక జింకలు, దుప్పులు, లేళ్ళు, కోళ్ళు గలవు.

24. సొలోమోను యూఫ్రటీసు నదికి పడమట నున్న దేశమంతటిని పరిపాలించెను. తిఫ్సా నుండి గాజా వరకు గల రాజులందరు అతనికి లోబడి యుండిరి. తన సరిహద్దుననున్న దేశములన్నిటితో అతనికి చెలిమి కుదిరెను.

25. సొలోమోను బ్రతికియున్నంతకాలము దాను నుండి బేర్షెబా వరకుగల యిస్రాయేలీయులు, యూదీయులు ఎవరెవరి అంజూరపు తోటలతో, ద్రాక్షతోటలతో వారు చీకు చింత లేకుండ జీవించిరి.

26. సొలోమోనునకు నలువదివేల అశ్వములు, పండ్రెండు వేలమంది ఆశ్వికులు గలరు.

27. పండ్రెండు మంది మండలాధిపతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క నెల కాలము, సొలోమోనునకు అతని సౌధమునకు కావలసిన భోజనసామగ్రిని సరఫరా చేయుచువచ్చిరి. రాజైన సొలోమోను భోజనబల్లయొద్దకు వచ్చినవారికి అందరికిని ఏ కొరతయు కలుగనీయరైరి.

28. పైపెచ్చు ప్రతి మండలాధిపతియొక్క గుఱ్ఱములకు, చాకిరి గొడ్డులకు కావలసిన యవలను, పశుగ్రాసమును కూడ పంపుచువచ్చిరి. "

29. ప్రభువు సొలోమోనునకు అద్భుతమైన వివేకము నొసగెను. అతనికి అపారమైన తెలివితేటలు దయచేసెను.

30. తూర్పు దేశముల విజ్ఞానులకంటె ఐగుప్తు విజ్ఞానులకంటె గొప్పజ్ఞాని సొలోమోను.

31. అతడు అందరినిమించిన విజ్ఞాని. ఎస్రహీయుడగు ఏతానుకంటెను, మహోలు పుత్రులైన హేమాను, కల్కోలు, దర్థ అనువారికంటెను గొప్పజ్ఞాని. సొలోమోను కీర్తి చుట్టుపట్లనున్న దేశములందెల్ల వ్యాపించెను.

32. అతడు మూడువేల సామెతలు చెప్పెను. పదివందల ఐదు కీర్తనలు కట్టెను.

33. అతడు లెబానోనున పెరుగు దేవదారులు మొదలుకొని మదురుపై ఎదుగు మొక్కల వరకుగల మహావృక్షములు, చెట్టుచేమలు అన్నిటిని గూర్చి మాట్లాడగలడు. మృగములు, పక్షులు, ప్రాకుడు జంతువులు, చేపలు మొదలైన ప్రాణికోటినంతటిని గూర్చి ఉపన్యసింపగలడు.

34. ప్రపంచమునందలి సకల జాతిజనులు సొలోమోను విజ్ఞానవాక్యములు వినుటకువచ్చిరి. అతడు తన విజ్ఞాన బోధను ఆలించిన రాజులనుండి బహుమతులు పొందెను.