ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 4

 1. ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజు కోపముచల్లారెను. అతడు వష్టి అపరాధమును, తాను చేయించిన శాసనమును గూర్చి తలపోయుచుండెను.

2. అప్పుడు రాజు సలహాదారులు “ప్రభువులవారు అందగత్తెలయిన కన్నెలను వెదకింపవలెను.

3. ఈ కార్యమునకుగాను మన రాష్ట్రములన్నిట ఉద్యోగులను నియమింపుడు. వారు సౌందర్యవంతులైన కన్నెలను వెదకి ఈ షూషను రాజధానియందలి అంతఃపురమునకు కొనివత్తురు. స్త్రీల మీద అధికారిగనుండు నపుంసకుడు హేగె అధీనమున వారినెల్ల నుంచుడు. అతడు ఆ యువతులకు అలంకరణ ద్రవ్యములను సరఫరా చేయును.

4. వారిలో ఏలినవారికి నచ్చిన కన్య వష్టికి బదులుగా రాణియగును” అని ఆలోచన చెప్పిరి.ఆ ఉపదేశము రాజునకు నచ్చెను. అతడు వారు చెప్పినట్లే చేయించెను.

5. షూషను దుర్గమున బెన్యామీను తెగకు చెందిన మొర్దెకయి అను యూదుడు కలడు. యాయీరు, షిమీ, కీషు అతని మూలపురుషులు.

6.పూర్వము యెరూషలేము నుండి నెబుకద్నెసరు రాజు కొనివచ్చిన బందీలలో యూదారాజు యెకోన్యాతోపాటు ఇతడును ఒకడు.

7. ఇతని పినతండ్రి కూతురే ఎస్తేరు అను మారుపేరు గల హదస్సా, ఎస్తేరు తల్లిదండ్రులు గతింపగా మొర్దెకయి ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్దచేసెను. ఆ యువతి రూపవతి.

8. రాజు శాసనము ప్రకారము చాలమంది యువతులను షూషను దుర్గమునకు కొనివచ్చిరి. ఎస్తేరు కూడ వారిలో నొకతె. ఆమెను కూడ రాజ అంతఃపుర స్త్రీలపై అధికారిగా నున్న హేగె అధీనమున నుంచిరి.

9. అతనికి ఎస్తేరు నచ్చెను. ఆమె అతని మన్నన పొందెను. కనుక అతడు ఆ యువతికి శీఘ్రముగా అలంకరణ ద్రవ్యములు, విశిష్ట భోజనములు పంపించెను. పైగా రాజు దాసీజనమునుండి ఏడుగురు పనికత్తెలనుగూడ ఎస్తేరుకు సేవ చేయుటకు హేగె నియమించెను. అతడు వారిని అందరిని అంతఃపురమున మేలైన విడిదికి తరలించెను.

10. మొర్దెకయి ఆజ్ఞపై ఎస్తేరు తాను యూదుల ఆడుపడుచునని ఎవరికి చెప్పలేదు.

11. అతడు ప్రతిదినము అంతఃపుర ప్రాంగణమున పచార్లు చేయుచు ఎస్తేరు స్థితిగతులను తెలిసి కొనెడివాడు.

12. పండ్రెండు నెలలు కడచిన తరువాత, యువతులందరిని వంతులవారిగా రాజువద్దకు కొనిపోవుదురు. ఆ మధ్యకాలమున సౌందర్యము పెంపొందించు కొనుటకుగాను వారు ఆరు నెలలపాటు గోపరసముతోను, ఆరునెలలపాటు వివిధ సుగంధతైలములతోను దేహ మర్దనము చేయించుకొనెడివారు.

13. అంతఃపురమునుండి రాజప్రాసాదమునకు పోవునపుడు, ప్రతియువతికి ఆమె కోరుకొనిన వస్త్రములు, ఆభరణములు ఒసగెడివారు.

14. ప్రతి యువతి రాత్రి రాజప్రాసాదమునకు పోవును. మరునాటి ప్రొద్దుట ఆమెను మరియొక అంతఃపురమునకు కొనిపోవుదురు. అట రాజు ఉపపత్నులు వసింతురు. అచట అధికారి నపుంసకుడగు షాస్గసు. ఆ రెండవ అంతఃపురము చేరుకొనిన యువతి రాజు మనసుపడి పేరుచెప్పి ప్రత్యే కముగా పిలిపించు కొనిననే తప్ప మరల అతని యొద్దకు వెళ్ళజాలదు.

15. ఇట్లుండగా రాజునొద్దకు వెళ్ళుటకు ఎస్తేరు వంతువచ్చెను. ఆమె అబీహాయిలు పుత్రిక. ఇతని అన్నకుమారుడైన మొర్దెకయి ఎస్తేరును పుత్రికగా స్వీకరించి పెంచెనుగదా! ఎస్తేరును కంటితో చూచిన వారందరు ఆమెను మెచ్చుకొనెడివారు. తనవంతు వచ్చినపుడు ఎస్తేరు అంతఃపురపాలకుడు హేగె యిచ్చిన ఉడుపులు తప్ప మరేమియు ధరింపలేదు.

16. అహష్వేరోషు రాజు పరిపాలనాకాలము ఏడవయేట తెబేతు అను పదియవనెలలో ఎస్తేరును రాజప్రాసాదమునకు కొని వచ్చిరి.

17. యువతులందరి కంటె ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించెను. ఆమె రాజు మన్నన పొందెను.

18. కనుక అతడు ఎస్తేరు శిరస్సుమీద కిరీటము పెట్టి వష్టి స్థానమున ఆమెను రాణిగా నియమించెను. ఆమె గౌరవార్ధము గొప్పవిందు చేయించి అధిపతులను, ఉద్యోగులను ఆహ్వానించెను. సంస్థానములన్నింటికి సెలవు దినము ప్రకటించెను. తన హోదాకు తగినట్లుగా యోగ్యులకు బహుమతులు ఒసగెను.

19-20. యువతులందరివలెనే ఎస్తేరు కూడ రెండవ అంతఃపురమునకు వెళ్ళెను. కాని ఆమె తాను యూదుల ఆడుపడుచునని అట నెవరికిని తెలియనీయలేదు. అది మొర్దెకయి ఆజ్ఞ. చిన్ననాడు అతని అదుపులో నున్నప్పటివలె అంతఃపురమునకు కూడ ఆమె అతని ఆజ్ఞ పాటించెను.

21. మొర్దెకయి రాజ్య వ్యవహారములను పరిశీలించు ఉద్యోగిగా నియుక్తుడై ప్రాసాదమున పనిచేయుచుండెను. అప్పుడు రాజు నివాసప్రాంగణమునకు కావలికాయు నపుంసకులు బిగ్తాను, తేరేషు రాజుపై ఆగ్రహము చెంది అతనిని హత్య చేయచూచుచుండిరి.

22. మొర్దెకయి ఆ సంగతి పసికట్టి ఎస్తేరునకు తెలుపగా ఆమె రాజునకు విన్నవించెను.

23. రాజు ఆ నపుంసకులను పరీక్షించి చూడగా ఆ ఆరోపణ నిజమేనని తేలెను. కనుక ఆ ఇరువురిని ఉరితీయించిరి. ఆ ఉదంతమును రాజు సమక్షముననే రాజ కార్యముల దస్తావేజున లిఖించిరి.