ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 4

 1-2. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను. “కుటుంబముల వారిగా, వంశముల వారిగా లేవీయులలో కోహతీయుల జనసంఖ్య నిర్ణయింపుము. 

3. ముప్పది నుండి యేబదియేండ్లకు మధ్య వయస్సు ఉండి సాన్నిధ్యపుగుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారి పేర్లను వ్రాయింపుము.

4. కోహతీయులు సాన్నిధ్యపుగుడారమును, మహాపవిత్ర వస్తువులను చూచుకొను బాధ్యతలివి.

5. శిబిరము కదలవలసి వచ్చినపుడు అహరోను కుమారులు మందసము ముందు వ్రేలాడుతెరను దించి, దానితో మందసమును కప్పవలెను.

6. దాని మీద గట్టితోలుపట్టను కప్పి మీద ఊదావర్ణ వస్త్రము కప్పవలెను. అటుపిమ్మట మందసము కడియములలో మోతకఱ్ఱలను దూర్చవలెను,

7. దేవునికి రొట్టెలను అర్పించు బల్లమీద ఊదావస్త్రము కప్పి దానిమీద పాత్రలు, సాంబ్రాణి, గిన్నెలు, సమర్పణ పాత్రలు, ద్రాక్షాసారాయపు కూజాలు ఉంచవలెను. నిత్యార్పణముగా సమర్పించు రొట్టెలను గూడ దాని మీదనే ఉంచవలెను.

8. వీనిమీద ఎల్లని వస్త్రము కప్పి, పైన గట్టి తోలుపట్టను కప్పి, తరువాత బల్ల కడియములలో మోతకఱ్ఱలు దూర్చవలెను.."

9. ఊదావస్త్రముతో దీపస్తంభమును దాని దీపములను, వత్తులను, పళ్ళెరములను, తైల పాత్రములను కప్పివేయవలెను.

10. దీపస్తంభమును దాని పరికరములన్నిటిని గట్టి తోలుపట్టీతో కప్పివేసి మోత పలకల మీద ఉంచవలెను.

11. బంగారుపీఠము మీద ఊదావస్త్రము కప్పి దానిమీద గట్టి తోలుపట్టను కప్పవలెను. తరువాత దానికి మోతకఱ్ఱలు దూర్పవలెను.

12. పరిశుద్ధ స్థలమున వాడు ఇతర పరికరములను అన్నిటిని ప్రోగుచేసి ఊదావస్త్రముతో కప్పి :గట్టి తోలుపట్టను మీద పరచి మోతపలక మీద ఉంచవలెను.

13. బలిపీఠము మీదినుండి బూడిదను తొలగించి ఎఱ్ఱనివస్త్రము కప్పవలెను.

14. దానిమీద పరిచర్యోపకరణములు అనగా నిప్పు పళ్ళెరములు, చీలుగరిటెలు, నెత్తురుచల్లు పళ్లెరములు, పాత్రలు ఉంచవలెను. వానిమీద గట్టి తోలుపట్టను కప్పవలెను. అటు పిమ్మట దానికి మోతకఱ్ఱలు దూర్పవలెను.

15. శిబిరము కదులునపుడు అహరోను, అతని కుమారులు వచ్చి పరిశుద్ధస్థలములోని పరిశుద్ధ వస్తువులను, వాని ఉపకరణములను కప్పివేసిన పిదప గాని, కోహతీయులు వానిని మోసికొని వెళ్ళకూడదు. కోహతీయులు పరిశుద్ధవస్తువులను చేతితో ముట్టరాదు. ముట్టినచో చత్తురు. గుడారము కదలునపుడెల్ల కోహతీయులు చేయవలసిన పనులు ఇవియే.

16. అహరోను కుమారుడు. ఎలియెజెరు గుడారమునంతటిని చూచుకోవలెను. దీపములనూనె, సాంబ్రాణి, సమర్పణపురొట్టెలు, అభిషేకతైలము, గుడారము, పరిశుద్ధవస్తువులు, వాని ఉపకరణములు, వీని అన్నిటి బాధ్యతను అతడే వహించును.” అంది

17. దేవుడైన యావే మోషే అహరోనులతో ఇట్లు చెప్పెను.

18. “కోహతీయుల వంశకుటుంబములను లేవీ తెగనుండి అంతరించిపోకుండ తగు జాగ్రత్తలు తీసుకొనుము. పరిశుద్ధవస్తువుల దగ్గరకు వచ్చి కోహతీయులు ప్రాణములు కోల్పోకుందురుగాక.

19. వారు మహాపవిత్రమైన వాటిని సమీపించి ప్రాణములు కోల్పోక బ్రతికియుండునట్లు మీరు వారికిట్లు చేయుడు: అహరోనును అతని కుమారులును లోనికి వచ్చి వారిలో ఒక్కొక్కడు ఏమి చేయవలయునో, ఏమి మోసుకొని రావలయునో నియమింపవలెను.

20. కాని కోహాతీయులు గుడారములోనికి పోయి యాజకులు పరిశుద్ధ వస్తువులను ప్రయాణమునకు సిద్ధము చేయుచుండగా చూచినయెడల తప్పకచత్తురు.”

21. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను:

22. “కుటుంబములవారిగా - వంశములవారిగా గెర్షోనీయులను లెక్క వేయుము.

23. ముప్పది నుండి ఏబది యేండ్లకు మధ్య వయస్సు ఉండి గుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారి పేర్లను వ్రాయింపుము.

24. వారి బాధ్యతలు, వారు మోసి కొనిపోవలసిన వస్తువులు ఇవి:

25-26. సాన్నిధ్యపు గుడారమును కప్పు లోపలితెరలను, వెలుపలికప్పు తెరలను, దానిమీద గట్టితోలు కప్పడమును, దాని ప్రవేశస్థలమున వ్రేలాడుతెరను, ఆవరణము తెరలను, వాని త్రాళ్ళను, ఆవరణ ప్రవేశస్థలమున వ్రేలాడు తెరలను, ఈ పరికరములను అమర్చుటకు వలసిన వస్తువులను వారు మోసికొనిరావలెను.

27. అహరోను అతని కుమారుల మాట ప్రకారము గెర్షోనీయులకు విధించిన బాధ్యతలు నిర్వర్తింపబడవలెను. అన్నిటిని వారు సక్రమముగా నిర్వర్తించునట్లు వారిని ఆజ్ఞాపింపవలెను. 

28.సాన్నిధ్యపు గుడారమున గెర్షోనీయుల బాధ్యతలివి. యాజకుడైన అహరోనుని కుమారుడు ఈతామారు వారిచే పనిచేయించును.”

29. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను: “మెరారీయులను వంశముల వారిగా, కుటుంబముల వారిగా లెక్కింపుము.

30. ముప్పది నుండి ఏబదియేండ్ల మధ్య వయస్సు ఉండి గుడారమున పరిచర్య చేయుటకు యోగ్యులైన మగవారినందరిని లెక్క వేయుము.

31-32. మెరారీయుల బాధ్యతలు, వారు మోయవలసిన వస్తువులు ఇవి: మందిరపు చట్రములు, దాని అడ్డకఱ్ఱలు, స్తంభములు, పునాదిదిమ్మెలు, ఆవరణ స్తంభములు, వాటి పునాదిదిమ్మెలు, మేకులు, త్రాళ్ళు, వాని ఉపకరణములన్నిటిని వారు మోసికొని రావలెను.

33. సాన్నిధ్యపుగుడారమున మెరారీయుల బాధ్యతలివి. యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు వారిచేత పనులు చేయించుచుండును.”

34-48. మోషే అహరోను సమాజపు పెద్దలు, కోహాతు, గెర్షోను, మెరారి అను మూడు లేవీయ వంశముల, జనసంఖ్యను నిర్ణయించిరి. ముప్పది నుండి ఏబదియేండ్లకు మధ్య వయస్సు ఉండి, సాన్నిధ్యపు గుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారినందరిని వంశములవారిగా కుటుంబముల వారిగా లెక్కించిరి. కోహాతు వంశము - 2,750; గెర్షోను వంశము - 2,630; మెరారి వంశము - 3,200; మొత్తము . జనసంఖ్య - 8,580.