ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 3

 1. యూదా రాజ్యమున యెహోషాపాతు పరిపాలన కాలములో పదునెనిమిదవ యేట, యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము రాజై సమరియా నగరము నుండి పండ్రెండేండ్లు పరిపాలించెను.

2. ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను ఈ రాజు తన తల్లిదండ్రులంత దుర్మార్గుడు కాడు. అతడు బాలు పూజకొరకు తన తండ్రి నిర్మించిన స్తంభమును పడగొట్టించెను.

3. అయినను పూర్వము నెబాతు కుమారుడు యరోబామువలే యెహోరామును ప్రజలను పాపమునకు పురికొల్పెను. తాను దుష్కార్య ములు చేయుట మానడయ్యెను.

4. మోవాబు రాజైన మేషా గొఱ్ఱెల పెంపకదారుడై విస్తారమైన మందలుకలిగి, ఏటేటా లక్ష గొఱ్ఱె పిల్లలను, లక్షపొట్టేళ్ళ ఉన్నిని యిస్రాయేలు రాజునకు కప్పముగా సమర్పించెడివాడు.

5. కాని అహాబు చనిపోగానే మోవాబు రాజు యిస్రాయేలు రాజునకు ఎదురు తిరిగెను.

6. వెంటనే యెహోరాము సమరియా నుండి తన సైన్యములన్నిటిని సమావేశపరచెను.

7. అతడు యూదా రాజగు యెహోషాఫాత్తు వద్దకు దూతలనంపి “మోవాబు నాకు ఎదురు తిరిగినాడు. నేను అతని మీదికి దాడిచేసినచో నీవు నాకు తోడ్పడెదవా?” అని అడిగించెను.

8. యూదా రాజు “తప్పక తోడ్పడుదును. నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే. నా సైన్యములు, గుఱ్ఱములు, మీ బలములతో కలిసిపోరాడును. కాని మనము ఏ మార్గమున యుద్ధమునకు పోవలెనో తెలుపుము” అని ప్రత్యుత్తరము పంపెను. “ఎదోము ఎడారిగుండ పోవుదము” అని యిస్రాయేలు రాజు మరల జవాబు పంపెను.

9. ఆ రీతిగా యిస్రాయేలు, యూదా, ఎదోము రాజులు యుద్ధమునకు వెడలిరి. ఏడు దినములు ప్రయాణము చేసిన పిదప వారి సైన్యమునందలి యోధులకును, పశువులకును నీరు కొరతపడెను.

10. యెహోరాము రాజు “హా! చెడితిమికదా! యావే మన ముగ్గురిని శత్రువుల చేతికి అప్పగించుటకే పిలిచెనేమో!” అనెను.

11. కాని యెహోషాఫాత్తురాజు “యావేను సంప్రదించుటకు ఇచట ప్రవక్త ఎవడును దొరకడా?" అని అడిగెను. యెహోరాము సైనికోద్యోగి ఒకడు “షాఫాత్తు కుమారుడు ఎలీషా ఉన్నాడు. పూర్వము అతడు ఏలీయాకు పరిచారకుడుగా ఉండెడివాడు” అని చెప్పెను.

12. యెహోషాఫాత్తు “ఇకనేమి, అతడు ప్రభువు సందేశమును విన్పింపగలడు” అనెను. కనుక ఆ ముగ్గురు రాజులు ఎలీషా వద్దకు వెళ్ళిరి.

13. కాని ఎలీషా యిస్రాయేలు రాజుతో “నేను నీకెందుకు తోడ్పడవలయును? నీవు వెళ్ళి మునుపు మీ తల్లిదండ్రులు సంప్రదించిన ప్రవక్తలనే సంప్ర తింపుము" అనెను. యిస్రాయేలు రాజు యెహోరాము "అయ్యా! నీవు ఇట్లనవలదు. ప్రభువు మమ్ము ముగ్గురిని మోవాబురాజు చేతికి అప్పగించినాడు” అని పలికెను.

14. ఎలీషా “సైన్యాములకధిపతియగు యావే సాన్నిధ్యమున నేను నిలబడియున్నాను. ఆయన జీవము తోడు! యూదారాజైన ఈ యెహోషాఫాత్తు మొగము చూచి నీ మాటలు ఆలింపవలసి వచ్చినదికాని లేకున్న నిన్ను కన్నెత్తియైన చూచి ఉండను.

15. సరియే! ఇప్పుడొక సంగీతకారుని నా యొద్దకు కొనిరండు” అనెను. ఆ పాటగాడు వాద్యమును వాయింపగా ఎలీషా యావే బలమును పొంది.

16. "వినుడు! దైవ సందేశమిది. ఈ లోయనిండ గోతులు త్రవ్వుడు.

17. గాలిగాని, వానగాని లేకున్నను లోయ నీటితో నిండును. మీరును, మీ సైనికులును, మీ జంతువులును తృప్తిగా నీళ్ళు త్రాగవచ్చును.

18. ఇంకను వినుడు. త్రాగుటకు నీటినిచ్చుట ప్రభువునకు తేలికైనపని. పైగా అతడు మోవాబీయులను గూడ మీ చేతికి అప్పగించును.

19. మీరు ముఖ్యమైన మోవాబీయుల సురక్షిత పట్టణములన్నిటిని జయింతురు. వారి పండ్ల చెట్లనన్నిటిని నరుకుదురు. నీటి బుగ్గలను అన్నిటిని పూడ్చివేయుదురు. సారవంతమైన పంటపొలములన్నిటిని రాళ్ళు రప్పలు పడవేసి పాడుచేయుదురు” అని పలికెను.

20. మరునాటి ఉదయకాలబలి నర్పించు సమయమునకు ఎదోమువైపునుండి నీరు పొరలివచ్చి ఆ ప్రదేశమునంతటిని క్రమ్మివేసెను.

21. ముగ్గురు రాజులు తమను ఎదిరింపవచ్చిరని విని మోవాబీయులు పిల్లలనక, పెద్దలనక ఆయుధములు చేపట్టగలవారందరు ప్రోగైవచ్చి తమ పొలిమేర మీద గుమికూడిరి.

22. వారు మరునాటి ప్రొద్దుట నిద్దురలేచి చూడగా ఉదయించు సూర్యుని కిరణములు సోకి ఆవలినీరంతయు నెత్తురువలె ఎఱ్ఱగా కన్పించెను.

23. అప్పుడు మోవాబీయులు “అది నెత్తురుసుమా! ముగ్గురురాజులు తమలో తాము పోరాడుకొని చచ్చి యుందురు. మనము వెళ్ళి వారి శిబిరమును దోచుకొందము” అనుకొనిరి.

24. కాని మోవాబీయులు శిబిరము చెంతకు రాగానే యిస్రాయేలీయులు వారిని తరిమికొట్టిరి. వారిని వెన్నాడి చిక్కినవారిని చిక్కినట్లు ఖండఖండములుగా తునియలు చేసిరి.

25. వారి పట్టణములను నాశనము చేసిరి. యిస్రాయేలు సైన్యమున ప్రతివాడు మోవాబీయుల పంటపొలముల మీద రాళ్ళుపడవేసెను. ఇంకను వారి నీటిబుగ్గలను పూడ్చివేసి, పండ్ల చెట్లను నరికివేసిరి. కడకు వారి రాజధాని కీర్- హరేసేతు మిగులగా ఒడిసెల విసరు యిస్రాయేలు సైనికులు దానినికూడ ముట్టడించిరి.

26. మోవాబు రాజు తనకు ఓటమి కలుగనున్నదని గ్రహించి ఏడువందలమంది ఖడ్గధారులను వెంటనిడుకొని శత్రుసైన్యముగుండ సిరియారాజు నొద్దకు పారిపోజూచెను. కాని అది అతని వలన కాకపోయెను.

27. అంతట అతడు యువరాజగు తన జ్యేష్ఠ కుమా రుని నగరప్రాకారముమీద దహనబలిగా సమర్పించెను. యిస్రాయేలీయుల మీదికి కోపము ప్రేరేపితముకాగా, నగరమును ముట్టడించుటకు వెరచి, తమ దేశమునకు మరలివచ్చిరి.