ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 3

 1. ప్రధానయాజకుడైన ఎల్యాషిబు, అతని తోటి యాజకులు కలిసి గొఱ్ఱెలద్వారము నిర్మించిరి. వారా ద్వారమునకు ప్రతిష్ఠ చేసి తలుపులు పెట్టిరి. వారు హనన్యేలు గోపురము వరకు ప్రాకారము కట్టిరి.

2. యెరికో నివాసులు దాని ప్రక్కభాగమును కట్టిరి. ఇమ్రీ కుమారుడైన సక్కూరు దాని అవతలి భాగము కట్టెను.

3. హస్సేనా వంశస్థులు మత్స్యద్వారము నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులు పెట్టి గడియలు, తాళములు అమర్చిరి.

4. దాని ప్రక్క భాగమును హక్కోసు మనుమడు ఊరియా కుమారుడగు మెరెమోతు నిర్మించెను. దాని అవతలి భాగమును మెషెషబేలు మనుమడును, బెరెకియా కుమారుడనగు మెషూల్లూము నిర్మించెను. దానికానుకొని బానా కుమారుడగు సాదోకు కట్టెను.

5. దాని ప్రక్క భాగమును తెకోవా పౌరులు కట్టిరి. కాని వారి నాయకులు మాత్రము నిర్మాణ కార్యకర్తలు నియమించిన కాయ కష్టము చేయుటకు నిరాకరించిరి.

6. పాసెయా కుమా రుడైన యోయాదా, బెసోద్యా కుమారుడైన మెషుల్లాము పాతద్వారమును పునర్నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చిరి.

7. దాని ప్రక్కభాగమును పశ్చిమ యూఫ్రటీసు అధికారి న్యాయపీఠముంచబడు భవనము వరకు నిర్మించినవారు గిబియోనీయుడగు మెలట్యా, మెరోనోతునకు చెందిన యాదోను, గిబ్యోను మిస్పా పట్టణ పౌరులు.

8. హర్హయా కుమారుడు స్వర్ణకారుడునైన ఉజ్జీయేలు ఆ మీదటి భాగము కట్టెను. అత్తర్ల పనివాడైన హనన్యా దాని ప్రక్కభాగమును వెడల్పు గోడవరకు కట్టెను.

9. యెరూషలేము అర్ధమండల పాలకుడును, హూరు కుమారుడునగు రెఫాయా ఆ మీదటి భాగము కట్టెను.

10. దానికి ఆవలిగోడను హరూమపు కుమారుడైన యెదాయా తననింటికి ఎదురుగా నిర్మించెను. హషబ్నెయా కుమారుడైన హట్టూషు దాని ప్రక్కభాగమును కట్టెను.

11. దానికి ఆనుకొనియే హారిము కుమారుడైన మల్కియా, పహత్మోవబు కుమారుడగు హష్షూబు కట్టిరి. పొయ్యి ద్వారమును గూడ వారే కట్టిరి.

12. యెరూషలేము రెండవ అర్ధభాగమునకు అధిపతియు, హల్లో హేషు కుమారుడైన షల్లూము దాని ప్రక్కభాగమును కట్టెను. షల్లూము కుమార్తెలునూ పనిలో అతనికి తోడ్పడిరి.

13. హానూను మరియు సనోవా పౌరులు కలిసి లోయద్వారమును నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి, తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చిరి. ప్రాకారమును పెడద్వారమువరకు వెయ్యిమూరల పొడవున మరమ్మతు చేసిరి.

14. బేత్ హక్కేరము మండల పాలకుడును రేకబు కుమారుడునగు మలకియా పెడద్వారమును కట్టెను. అతడు దానికి దూలములు నిలిపి, తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చెను.

15. మిస్ఫా మండలాధిపతియు కొల్హోసే కుమారుడునగు షల్లూము జలధారద్వారమును నిర్మించెను. దానికి తలుపులు పెట్టి, గడియయు, తాళమున మర్చెను. షేలా మడుగుచెంత రాజోద్యానవనము ప్రక్కన ప్రాకారము కట్టించెను. ఈ గోడ దావీదు నగరము మెట్లవరకు పోయెను.

16. బేత్సూరు మండల పాలకుడును అస్పూకు కుమారుడునగు నెహెమ్యా దాని ప్రక్కభాగము నిర్మించెను. ఈ గోడ దావీదు సమాధి, కృత్రిమమడుగు, సైనికాశ్రయమువరకు పోయెను.

17. దాని ప్రక్కభాగమున క్రింది లేవీయులు నిర్మించిరి. బానీ కుమారుడగు రెహూము ఆ మీదటి భాగమును కను. కెయిలా మండలములోని అర్ధ భాగమునకు అధిపతియైన హషబ్యా తనమండలము తరపున ఆ తరువాతి భాగమును కట్టెను.

18. కెయిలా మండలములోని అర్ధభాగమునకు అధిపతియు హేనాదాదు కుమారుడునైన బవ్వయి దాని తరువాతి భాగమును కట్టెను.

19. మిస్పా మండలాధిపతియు యేషూవ కుమారుడునైన ఏసేరు ఆ మీది భాగమును కట్టెను. ఆ గోడ ఆయుధాగారము నుండి ప్రాకారము వంపుతిరుగు తావువరకు పోయెను.

20. సబ్బయి కుమారుడగు బారూకు ప్రక్కభాగము కట్టెను. ఆ గోడ ప్రధానయాజకుడగు ఎల్యాషిబు ఇంటివరకు పోయెను.

21. ఆ మీదటి భాగమును హక్కోజు మనుమడును ఊరియా కుమారుడునైన మెరేమోతు నిర్మించెను. ఆ గోడ ప్రధానయాజకుని ఇల్లు మొదలుకొని ఆవలికొన వరకు పోయెను..

22. దాని ప్రక్కభాగమును ఈ క్రింది యాజకులు నిర్మించిరి. యెరూషలేము ప్రాంతపు యాజకులు ఆ మీదటి భాగమును నిర్మించిరి.

23. బెన్యామీను, హష్షూబు తమ ఇండ్లకెదురుగా తరువాయి గోడను కట్టిరి. అటు తరువాతి భాగమును అనన్యా మనుమడును, మాసెయా కుమారుడైన అసర్యా తన ఇంటికెదురుగా నిర్మించెను.

24. అటు తరువాత హీనాదాదు కుమారుడైన బిన్నుయి అజర్యా ఇంటినుండి ప్రాకారము మూలవరకు గోడ కట్టెను.

25. ఆ మీదట ఊసయి కుమారుడగు పాలాలు కట్టెను. చెరసాల చెంతగల మీది రాజప్రసాదము చెంతనున్న బురుజు వరకును, ప్రాకారపు మలుపువరకును అతడు కట్టెను.

26. పరోషు కుమారుడైన పెదయా తరువాతి భాగమును కట్టెను. ఆ గోడ జలద్వారము వరకును, దేవాలయ రక్షణ బురుజువరకును పోయెను.

27. తెకోవా పౌరులు తరువాతి భాగమును కట్టిరి. ఆ గోడ దేవాలయము ఎదుటి బురుజునుండి ఓఫేలు గోడవరకు పోయెను.

28. అశ్వద్వారము నుండి యాజకులెవరి ఇంటిముందు వారు గోడకట్టిరి. 

29. ఇమ్మేరు కుమారుడైన సాదోకు తరువాతి భాగమును తన ఇంటికెదురుగా కట్టెను. తూర్పుద్వారమునకు పాలకుడును, షెకన్యా కుమారుడునగు షేమయా తరువాతి గోడను కట్టెను.

30. షెలెమ్యా కుమారుడైన హనన్యా, సాలాపు ఆరవ కుమారుడైన హానూను తరువాతి భాగమును కట్టిరి. బెరాకియా కుమారుడైన మెషుల్లాము తరువాతి గోడను తనింటికెదురుగా కట్టెను.

31. స్వర్ణకారుని కుమారుడైన మల్కియా తరువాతి భాగమును కట్టెను. దేవాలయపు పనివారు, వర్తకులు వాడుకొను భవనము వరకు అతడు కట్టేను. ఈ భవనము దేవాలయ రక్షణద్వారము చెంత ప్రాకారము మీద కట్టబడిన గది దాపున కలదు.

32. ఆ గదియొద్దనుండి గొఱ్ఱెల ద్వారమువరకుగల గోడను స్వర్ణకారులు, వ్యాపారులు కలిసి నిర్మించిరి.