ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 3

 1-2. యెబూసీయుడైన ఒర్నాను అనువాని కళ్ళమున దావీదునకు దేవుడు దర్శనమిచ్చెను. ఆ తావు యెరూషలేములోని మోరీయా కొండమీద ఉన్నది. ఆ స్థలమును దావీదు దేవాలయ నిర్మాణమునకు సిద్ధముచేసెను. సొలోమోను తన పరిపాలనాకాలము నాలుగవయేట, రెండవనెల, రెండవదినమున ఆ తావుననే దేవాలయ నిర్మాణము ప్రారంభించెను.

3. అతడు నిర్మించిన దేవాలయము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.

4. దేవాలయము ముందటి ప్రవేశగృహము ఇరువది మూరల వెడల్పు, నూటఇరువది మూరలు ఎత్తు కలిగియుండెను. దాని వెడల్పు దేవాలయము వెడల్పుతో సమానముగా నుండెను. అతడు ఈ గృహము లోపలి భాగమును మేలిమి బంగారముతో పొదిగించెను.

5. మందిరమున ముఖ్యమైన గదిని దేవదారు కొయ్యతో కప్పి మేలిమి బంగారముతో పొదిగించెను. దానియందు ఖర్జూర వృక్షములు, గొలుసుల ఆకృతులు చెక్కించెను.

6. దేవాలయమును అందమైన రత్నములతో, ఫర్వాయీమునుండి తెప్పించిన మేలిమి బంగారముతో అలంకరించెను.

7. దేవాలయపు గోడలను, దూలములను, ప్రవేశ మంటపమును, తలుపులను గూడ మేలిమి బంగారముతోనే పొదిగించెను. గోడల మీద కెరూబీము దూతల ప్రతిమలను కూడ చెక్కించెను.

8. మహాపవిత్రస్థలమైన గర్భగృహము పొడవు, వెడల్పుకూడ ఇరువది మూరలు. దాని వెడల్పు దేవాలయము వెడల్పుతో సమానముగా ఉండెను. దాని గోడలను ఒక వేయి రెండువందల మణుగుల మేలిమి బంగారముతో పొదిగించెను.

9. ఏబది తులముల బంగారముతో మేకులు చేయించెను. మీది గదుల గోడలను కూడ బంగారముతో పొదిగించెను.

10. లోహముతో రెండు కెరూబీము దూతల ప్రతిమలను పోత పోయించి, వానిని బంగారముతో పొదిగించి గర్భగృహమున ఉంచెను.

11-13. ఆ ప్రతిమల ముఖములు మందిరపు లోతట్టు తిరిగియుండి, ఒకదాని ప్రక్కన యొకటి ఉండునట్లు నిలబెట్టించెను. వానిలో ఒక్కొక్క దానికి రెండు రెక్కలు కలవు. ఒక్కొక్క రెక్క ఐదు మూరల పొడవు ఉండెను. అవి రెక్కలను చాచి యుండగా గది మధ్యన ఆ రెక్కలు ఒకదానికొకటి తాకుచుండెను. మరియు ఆ రెక్కలు గదిలోపలి రెండు గోడలకు కూడ తాకుచుండెను. ఆ నాలుగురెక్కలు ఒక కొననుండి మరియొక కొనకు ఇరువది మూరలు పొడవుండెను.

14. పట్టు దారముతో గర్భగృహమునకు ఒకతెరను అల్లించి దానికి ఊదా, ఎరుపు, ధూమ్రవర్ణము లతో అద్దకము వేయించెను. దానిమీద కెరూబీము దూతల బొమ్మలను కూడ కుట్టించెను.

15. అతడు దేవాలయమునకు ముందట రెండు స్థంభములు నెలకొల్పెను . వాని పొడవు ముప్పది ఐదు మూరలు. ఒక్కొక్క దానిమీద ఐదు మూరల ఎత్తుగల పీటలును కలవు.

16. ఆ స్తంభముల కొనలను కలగలసిన గొలుసుల పనితో కలుపుచూ, స్తంభముల పై భాగమున నూరు దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసుల పనిమీద అలంకరించెను. మీదిపీటలను దానిమ్మపండ్ల బొమ్మలతో అలంకరించెను.

17. స్తంభములను దేవాలయ ముఖద్వారమునకు ఇరు వైపుల అమర్చిరి. దక్షిణదిశనున్న దానికి యాకీను అనియు,. ఉత్తరదిశనున్న దానికి బోవాసు అనియు పేర్లు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services