ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 3

 1. కనాను దేశమున వసించుచు, పోరాట తీరు ఎరుగని యిస్రాయేలీయులకు యుద్ధము నేర్పుటకై యావే ఆ దేశమున నిలువనిచ్చిన అన్యజాతుల పేర్లివి.

2. యిస్రాయేలు జనుల పలుతెగలవారికి, విశేషముగా పూర్వ యుద్ధముల నెరుగనివారికి, పోరాటము నేర్పుటకే యావే అన్యజాతులను అచ్చట నిలువనిచ్చెను.

3. ఫిలిస్తీయదొరలు ఐదుగురు, కనానీయులు, సీదోనీయులు, బాలుకొండసీమ నుండి హమాతుకనుమ వరకు లెబానోనున జీవించిన హివ్వీయులు యావే నిలువనిచ్చిన జాతులు.

4. యావే మోషే ద్వారా పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను యిస్రాయేలీయులు పాటింతురో లేదో తెలిసికొనునట్లు వారిని పరీక్షించుటకై ఈ జాతులు ఉపయోగపడినవి.

5-6. యిస్రాయేలు ప్రజలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు మొదలైన జాతులతో కలిసి జీవించిరి. ఆ ప్రజలతో వియ్యమందుకొని వారి దేవతలను కొలిచిరి.

7. యిస్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. యావేను మరచిపోయి బాలు, అషేరా మొదలైన దేవతలను సేవించిరి.

8. యావే మహోగ్రుడై వారిని మెసపోతోమియ రాజగు కూషన్రిషాతయీము వశముచేసెను. ఆ రాజు యిస్రాయేలీయులను ఎనిమిదేండ్లు దాసులనుగా ఏలెను.

9. అంతట యిస్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికొక రక్షకుని లేవనెత్తెను, కాలేబు చిన్నతమ్ముడును, కనసు కుమారుడగు ఒత్నీయేలు యిస్రాయేలీయులను రక్షించెను.

10. యావే ఆత్మ ఒత్నీయేలును ఆవేశించెను. అతడు యిస్రాయేలీయులకు న్యాయాధిపతియై శత్రువులతో యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను. రాజైన కూషన్రిషాతయీము ఒత్నీయేలు వశముచేసెను. ఒత్నీయేలు ఆ రాజును ఓడించెను.

11. అటు తరువాత యిస్రాయేలీయులు నలువదియేండ్లు చీకుచింత లేకుండ జీవించిరి.

12. కాని కనసు కుమారుడగు ఒత్నీయేలు గతింపగనే యిస్రాయేలీయులు మరల దుష్టకార్య ములు చేసి యావేకు కోపము రప్పించిరి. ప్రభువు మోవాబురాజు ఎగ్లోనును యిస్రాయేలీయులపై పురికొల్పెను. ఆ ప్రజలు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి గదా!

13. ఎగ్లోను అమ్మోనీయులను, అమాలేకీయులను ప్రోగుజేసికొని వచ్చి యిస్రాయేలీయుల మీదబడి వారి ఖర్జూర వృక్షముల నగరమును స్వాధీనము చేసికొనెను.

14. కనుక యిస్రాయేలీయులు మోవాబురాజు ఎగ్లోనునకు దాసులై పదునెనిమిదియేండ్లు అతనికి ఊడిగము చేసిరి.

15. అంతట యిస్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికి ఏహూదు అను రక్షకుని లేవనెత్తెను. అతడు బెన్యామీనీయుడగు గేరా కుమారుడు. ఎడమ చేతివాటమువాడు. యిస్రాయేలీయులు అతని ద్వారా మోవాబురాజైన. ఎగ్లోనునకు కప్పపు కానుకలు పంపుకొనిరి.

16. ఏహూదు మూరెడు పొడుగు గల రెండంచుల కత్తిని ఒక దానిని తయారు చేసికొని, తన దుస్తులక్రింద కుడితొడమీద వ్రేలాడ గట్టుకొనెను.

17. అతడు కప్పముకొనిపోయి మోవాబు రాజు ఎగ్లోనునకు సమర్పించెను. ఆ రాజు చాల లావైనవాడు.

18. ఏహూదు కప్పమును చెల్లించి, దానిని మోసిన పరిజనముతో తిరిగిపోయెను.

19. కాని అతడు గిల్గాలు ప్రతిమలదాక సాగిపోయి మరల ఎగ్లోను వద్దకు తిరిగివచ్చి “రాజా! నీకొక రహస్య సందేశము కొనివచ్చితిని” అనెను, ఎగ్లోను తన పరివారమంతయు అచటనుండి. లేచి వెడలిపోవు వరకు ఊరకుండ వలసినదిగా ఏహూదుతో చెప్పెను.

20. ఏహూదు రాజు దగ్గరకు వచ్చినపుడు, రాజు మిద్ధేమీది చలువగదిలో ఒంటరిగా కూర్చుండెను. ఏహూదు “రాజా! నీకొక దైవసందేశము వినిపింపవలెను” అని పలికెను. రాజు తన ఆసనము నుండి లేచి నిలబడెను.

21. వెంటనే ఏహూదు తన ఎడమచేతితో కుడితొడ మీద వ్రేలాడుకత్తిని దూసి ఎగ్లోను కడుపున పొడిచెను.

22. కత్తితోపాటు పిడికూడ ఎగ్లోను పొట్టలో దూరగా క్రొవ్వు వెలుపలికి వచ్చి కత్తిని కప్పివేసెను. కత్తి అతని వెనుక నుండి బయటికి వచ్చిన కారణమున ఏహూదు దానిని బయటికి తీయలేక పోయెను.

23. అతడు మీది గది తలుపులు లాగి, లోపల బిగించి తాను వెడలిపోయెను.

24. ఏహూదు వెడలిపోయిన తరువాత రాజ సేవకులు వచ్చి చూడగా తలుపులు లోపల బిగింపబడి యుండెను. వారు రాజు తన చలువగదిలో కాల కృత్యములు తీర్చుకొనుచుండెను కాబోలు అనుకొనిరి.

25. సేవకులు కొంత తడవాగి ఏమి జరిగినదోయని విస్తుపోవజొచ్చిరి. అయినను వారి రాజు మీది గది తలుపులు తెరవలేదు. కడకు పరిచారకులు వారి నిగునంతకెళ్ళ బీగము కొనివచ్చి తలుపులు తెరచి చూడగా రాజు చనిపోయి నేలపై పడియుండెను.

26. సేవకులు రాజుకొరకు మీది గది యొద్ద వేచియుండగనే ఏహూదు తప్పించుకొని పారిపోయెను. అతడు గిల్గాలు ప్రతిమలను దాటి సెయీరా మండలమునకు వెడలిపోయెను.

27. ఆ చోటు చేరగనే ఎఫ్రాయీము కొండసీమలో బాకానూదెను. యిస్రాయేలీయులు కొండల నుండి దిగివచ్చి ఏహూదును కలసికొనిరి.

28. అతడు వారితో “మీరు నా వెంట త్వరపడిరండు. యావే శత్రుప్రజలైన మోవాబీయులను మీ వశము చేసెను” అనెను. కనుక యిస్రాయేలీయులు అతని వెంట నడచిరి. వారు మోవాబు ప్రక్కనున్న యోర్దాను రేవును వశపరచుకొని యెవ్వరిని నది దాటనీయకుండ అడ్డుపడిరి.

29. నాడు మోవాబీయులను పదివేలమందిని చంపిరి. హతులైన వారందరు మెరికలవంటి యోధులు. వారిలో ఒక్కడును తప్పించుకోలేదు.

30. ఆ దినమున మోవాబు మరల లొంగిపోయెను. మరల యెనుబది ఏండ్ల వరకు యిస్రాయేలీయులు కడుపులో చల్ల కదలకుండ బ్రతికిరి.

31. అటు తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యెను. అతడు ములుకోలతో ఆరు వందలమంది ఫిలిస్తీయులను మట్టుపెట్టెను. షమ్గరు కూడ యిస్రాయేలీయులను రక్షించెను.