ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 36

 1. యోసేపు పుత్రుల వంశములలో మాఖీరు కుమారుడును మనష్షే మనుమడైన గిలాదు కుటుంబపు పెద్దలు మోషేను ఇతర నాయకులను సమీపించి,

2. "ఈ నేలను చీట్లు వేసి యిస్రాయేలీయులకు పంచి యిమ్మని ప్రభువు మిమ్ము ఆపించేనుగదా! మా బంధువగు సెలోఫెహాదు ఆస్తిని అతని కుమార్తెలకు ఇమ్మనియు చెప్పెను గదా!

3. కాని ఈ స్త్రీలు ఇతర తెగలకు చెందిన పురుషులను వివాహము చేసికొనిన, వారి ఆస్తి ఆ తెగలకు చెందును. అప్పుడు మా తెగకు లభించిన ఆస్తి తగ్గిపోవును.

4. అమ్ముడువోయిన ఆస్తి మరల సొంతదారులకు చెందు సంవత్సరము వచ్చినపుడు ఈ ఆడుపిల్లల ఆస్తి వారు వివాహము చేసికొనిన తెగలకే శాశ్వతముగా దక్కును. కనుక మా తెగవారు ఆ ఆస్తిని శాశ్వతముగా కోల్పోవలసి వచ్చును” అని మొరపెట్టుకొనిరి.

5. కనుక మోషే ప్రభువు పక్షమున యిస్రాయేలీయులకు ఈ నియమము చేసెను: “మనష్షే తెగవారి మొర ధర్మబద్దమయినదే.

6. ఈ విషయమున దేవుని ఆజ్ఞ ఇది. సెలోఫెహాదు పుత్రికలు తమకిష్టమైన వారిని పరిణయమాడవచ్చును. కాని వారు తమ తెగకు చెందిన పురుషులను మాత్రమే పెండ్లి చేసికోవలెను.

7. యిస్రాయేలీయులలో ఏ తెగనకు చెందిన వారి ఆస్తి ఆ తెగలోనే నిలువవలెను.

8. కనుక యిస్రాయేలీయులలో ఏ తెగనకు చెందిన స్త్రీయైన పుట్టినింటి ఆస్తిని వారసత్వహక్కుగా పొందెనేని ఆమె తన తెగ వారిని మాత్రమే పెండ్లియాడవలెను. ఈ రీతిగా యిస్రాయేలీయులు తమ పితరులనుండి పొందిన ఆస్తిని నిలబెట్టుకొందురు.

9. వారి ఆస్తి ఒక తెగనుండి మరియొక తెగనకు దాటిపోదు. ప్రతి తెగ తన ఆస్తిని తాను దక్కించుకొనును.”

10-11. కనుక మోషేకు ప్రభువు ఆజ్ఞాపించినట్లే సెలోఫెహాదు కుమార్తెలగు మహ్లా, తీర్సా, హోగ్లా, మిల్కా, నోవా చేసిరి. వారు తమ తెగ వారినే పెండ్లి చేసికొనిరి.

12. ఆ స్త్రీలు యోసేపు కుమారుడైన మనష్షే వంశీయులను పెండ్లి చేసికొనగా వారి ఆస్తి వారి తెగననే నిలిచెను.

13. మోవాబు మైదానమున, యెరికో ఎదుట నున్న యోర్దాను తీరమున, ప్రభువు మోషేద్వారా యిస్రాయేలీయులకు ఇచ్చిన నియమములు, ఆజ్ఞలు ఇవియే.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services