ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 31

 1-2. ప్రభువు మోషేతో “నాడు మిద్యానీయులు యిస్రాయేలీయులకు చేసిన అపరాధమునకై వారికి ప్రతిదండనచేయుము. అటుపిమ్మట నీవు, నీ పితరులను చేరుకొందువు” అని చెప్పెను.

3. కనుక మోషే యిస్రాయేలీయులతో “మీరు యుద్ధమునకు సన్నాహములు చేయుడు. మిద్యానీయులకు ప్రభువు విధించిన ప్రతిదండననుచేయ వారి మీదికి పొండు.

4. ఒక్కొక్క తెగనుండి వేయిమందిని యుద్ధమునకు పంపుడు” అని చెప్పెను.

5. కనుక యిస్రాయేలీయులు ఒక్కొక్క తెగనుండి వెయ్యిమందిని ఎన్నుకొనగా మొత్తము పండ్రెండు వేలమంది యుద్ధమునకు సంసిద్ధులైరి.

6. యాజకుడగు ఎలియెజెరు కుమారుడు ఫీనెహాసు నాయకత్వమున మోషే వారినందరిని యుద్ధమునకు పంపెను. పరిశుద్ధపాత్రములును, యుద్ధమున ఊదు బాకాలును ఫీనెహాసు వశమున ఉండెను.

7. వారు ప్రభువు ఆజ్ఞాపించినట్లే మిద్యానీయులను ముట్టడించి వారి పురుషులనందరిని చంపివేసిరి.

8. వారి ఐదుగురు రాజులగు ఎవి, రేకెము, సూరు, హూరు, రేబా అనువారిని గూడ సంహరించిరి. బెయోరు కుమారుడగు బిలామును గూడ కత్తితో వధించిరి.

10. వారి పట్టణములను, శిబిరములను, ఊళ్ళను బూడిద చేసిరి.

9. యిస్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను బిడ్డలను చెరగొనిరి. వారి పశువులను, మందలను వారికి కలిగిన యావత్తును స్వాధీనము చేసికొనిరి. వారి సొత్తును కొల్లగొట్టిరి.

10. వారి పట్టణములను, శిబిరములను, ఊళ్ళను బూడిద చేసిరి.

11. ఆ రీతిగా యిస్రాయేలు యోధులు చేతికి చిక్కిన కొల్లసొమ్మును అనగా స్త్రీలనేమి, పురుషులనేమి, పశువులనేమి మిద్యానీయుల సొత్తు నంతటిని కొల్లగొట్టిరి.

12. వారు యెరికో చెంత యోర్దానునకు ఎదుట మోవాబు మైదానమున విడిది చేసియున్న మోషేవద్దకును, ఎలియెజెరు వద్దకును, యిస్రాయేలు సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని ఆ కొల్లసొమ్ముతో తీసుకొని వచ్చిరి.

13. మోషే, యాజకుడగు ఎలియెజెరు, సమాజ నాయకులు శిబిరమునుండి వెడలివచ్చి యుద్ధవీరులకు ఎదురువోయిరి.

14. కాని వారి సహస్రాధిపతులునగు, శతాధిపతులునగు సైనికాధికారులను చూచి మోషే మండిపడెను.

15. “మీరు ఈ స్త్రీలను ప్రాణములతో బ్రతుకనిచ్చితిరా? 

16. బిలాము దుర్బోధలకు లొంగి, నాడు పెయోరునొద్ద మన ప్రజలు ప్రభువును విడనాడునట్లు చేసినది ఈ స్త్రీలే కదా? నాడు యిస్రాయేలీయుల అరిష్టమునకు, నాశనమగుటకు ఆ సంఘటనమే కారణముగదా!

17. కనుక ఇపుడు ఈ చిన్నపిల్లలలో మగపిల్లలనందరిని, ఈ స్త్రీలలో పురుషులతో కాపురము చేసినవారినందరిని వధింపుడు.

18. కాని కాపురమునకు రాని కన్నెలను మాత్రము చంపక మీరు స్వీకరింపుడు.

19. యుద్ధమున శత్రువులను వధించినవారుగాని, శవములను అంటుకొనినవారుగాని ఏడుదినములు శిబిరము వెలుపల వసింపుడు. మూడవనాడు, ఏడవనాడు మిమ్మును, మీరు చెరపట్టినవారును శుద్ధిచేసికొనుడు.

20. మీ బట్టలను, తోలుతోగాని మేకవెంట్రుకలతో గాని కొయ్యతోగాని చేసిన మీ పరికరములనుగూడ శుద్ధి చేసికొనుడు” అని చెప్పెను.

21. యాజకుడగు ఎలియెజెరు యుద్ధము చేసి వచ్చిన వీరులతో “ప్రభువు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలివి:

22-23. నిప్పునకు లొంగని బంగారము, వెండి, కంచు, ఇనుము, తగరము, సీసము మొదలగు లోహములను అగ్నితో శుద్ధి చేయవలెను. కాని వానిని శుద్ధీకరణ జలముతోగూడ శుద్ధి చేయవలెను. అగ్నిచేత చెడునట్టి మిగిలినవస్తువులను నీళ్ళలో శుద్ధిచేసిన చాలును.

24. ఏడవదినమున మీ బట్టలను శుద్ధిచేసి కొనుడు. అప్పుడు మీరు శుద్ధినిపొందుదురు. గనుక శిబిరమునకు తిరిగిరావచ్చును” అనెను.

25-26. ప్రభువు మోషేతో “నీవును, యాజకుడైన ఎలియెజెరును, సమాజనాయకులును కూడి కొల్లసొమ్మును లెక్కింపుడు. చెరజిక్కిన వారిని పశువులను గూడ లెక్కపెట్టుడు.

27. కొల్లసొమ్ము సగము యుద్ధము చేసిన సైనికులకును, సగము సమాజమునకును లభించును.

28. సైనికులకు లభించిన సగము సొమ్ము నుండి ప్రతి ఐదువందల ఎడ్లకు, గాడిదలకు, గొఱ్ఱెలకు ఒకదానిని, చెరజిక్కిన ప్రతి ఐదువందలమందికి ఒకరిని గైకొని ప్రభువునకు అర్పింపుడు. అది ప్రభువునకు కానుక సొమ్ము.

29. ఈ సొమ్ము ప్రభువునకు ముట్టుటకై యాజకుడైన ఎలియెజెరునకు అప్పగింపుడు.

30. ఇక, సమాజమునకు లభించిన కొల్ల సొమ్ము నుండి ప్రతి ఏబది ఎడ్లకు, గాడిదలకు, గొఱ్ఱెలకు, మేకలకు ఒకదానిని, చెరజిక్కిన ప్రతి ఏబది మందికి ఒకరిని గైకొని ప్రభుమందిరమునకు పరిచర్య చేయు లేవీయుల కిండు” అని చెప్పెను.

31. మోషే, ఎలియెజెరులు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

32. యిస్రాయేలు సైనికులు కొనివచ్చిన కొల్ల సొమ్ము వివరములివి:

33. ఆరులక్షల డెబ్బది ఐదు వేల గొఱ్ఱెలు;

34. డెబ్బది రెండువేల పశువులు; అరువది ఒక్కవేయి గాడిదలు;

35. ముప్పది రెండు వేలమంది పురుషుని కూడని కన్యలు.

36. సైనికులకు లభించిన సగభాగము సొమ్మున మూడు లక్షల ముప్పది ఏడువేల ఐదువందల గొఱ్ఱెలు కలవు. వీనిలో ప్రభువువంతు ఆరువందల డెబ్బది ఐదు.

37. వారికి లభించిన పశువులు ముప్పది ఆరువేలు. వీనిలో ప్రభువువంతు డెబ్బదిరెండు.

38. వారికి లభించిన గాడిదలు ముప్పదివేల ఐదువందలు.

39. దీనిలో ప్రభువువంతు అరువది ఒకటి.

40. వారికి లభించిన వ్యక్తులు పదహారువేలమంది, దీనిలో ప్రభువువంతు ముప్పదిఇద్దరు.

41. కొల్లసొమ్ములో ప్రభువునకు ప్రతిష్ణార్పణముగా చెల్లింపవలసినవంతును మోషే యాజకుడైన ఎలియెజెరునకు అప్పగించెను.

42. సైనికులయొద్దనుండి మోషే తీసుకొని యిస్రాయేలు సమాజమునకు ఇచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చినవి:

43. మూడులక్షల ముప్పది ఏడువేల ఐదు వందల గొఱ్ఱెలు.

44. ముప్పది ఆరువేల పశువులు; ముప్పదివేల ఐదు వందల గాడిదలు;

45. పదునారు వేలమంది మనుష్యులును కలరు.

46. యిస్రాయేలు సమాజమునకు వచ్చిన ఈ సగము నుండి మనుష్యులలోను, పశువులలోను

47. ఏబదికి ఒకటి చొప్పున మోషే వేరుచేసి ప్రభువు ఆజ్ఞాపించినట్లు ప్రభుమందిరమున పరిచర్యచేయు లేవీయులకిచ్చెను.

48-49. యిస్రాయేలు సైన్యమున సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే యొద్దకు వచ్చి “మేము మా సైనికులనందరిని లెక్కించిచూచితిమి. వారిలో ఒక్కడును హతుడు కాలేదు.

50. యుద్ధమున మాకు లభించిన బంగారు నగలు, కడియములు, మురుగులు, ఉంగరములు, చెవిపోగులు, దండలు ప్రభువునకు కానుకగా కొనివచ్చితిమి. ఇక మాకు ప్రాయశ్చిత్తము చేయింపుడు” అనిరి.

51. మోషే, యాజకుడైన ఎలియెజెరులు వారు కొనివచ్చిన బంగారమును, ఆభరణములను స్వీకరించిరి.

52. ఆ అధికారులు కొనివచ్చిన సొమ్ము 16,750 తులములు తూగెను.

53. ప్రతి సైనికుడు తాను కొల్లగొట్టిన సొమ్ము తానే ఉంచుకొనెను.

54. కాని సైనికాధికారులు అప్పగించిన సొమ్మును మాత్రము మోషే యాజకుడైన ఎలియెజెరులు ప్రభు సన్నిధిన యిస్రాయేలీయులకు జ్ఞాపకార్ధముగా సమావేశగుడారమున ఉంచిరి.