ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 2

 1. అర్తహషస్త పరిపాలనకాలమున ఇరువదియవ యేట నీసాను నెలలో ఒకనాడు రాజు భోజనము చేయుచుండగా నేనతనికి ద్రాక్షసారాయము అందించితిని. అంతకు ముందెన్నడు నేను రాజునెదుట విచారముగా కన్పించి యెరుగను.

2. కనుక అతడు నన్ను చూచి “ఓయి, నీ విచారమునకు కారణమేమి? నీకు వ్యాధియేమియున్నట్లు లేదు. కనుక ఏదియో మనస్తాపము నిన్ను పీడించుచుండవలెను” అనెను. రాజు మాటలకు నేను మిగుల భయపడితిని.

3. నేనతనితో “ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక! మా పితరులను పాతిపెట్టిన నగరము నేలమట్టమై ఉన్నది. దాని ద్వారములు మంటలో కాలి బుగ్గియైపోయినవి. నాకు విచారముకాక మరియేమి కలుగును?” అంటిని.

4. రాజు “ఇప్పుడు నీ కోరికయేమి?" అని నన్ను ప్రశ్నించెను. నేను ఆకాశమునందున్న ప్రభువును ప్రార్ధించితిని.

5. అటుపిమ్మట రాజుతో “ప్రభువులవారి చిత్తమైనచో, తమకు నా మీద దయపుట్టినచో, నన్ను మా పితరులను పాతిపెట్టిన యూదాసీమకు వెళ్ళిపోనిండు. మా నగరమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇండు” అంటిని.

6. అప్పుడు రాణి కూడ రాజు ప్రక్కనే కూర్చుండియుండెను. అతడు “నీ ప్రయాణము ఎన్నాళ్ళు పట్టును? నీవు మరల ఎప్పుడు తిరిగి వత్తువు?” అని నన్ను ప్రశ్నించెను. నేనొక తేదీని నిర్ణయించి చెప్పగా ప్రభువు నా కోరిక అంగీకరించెను.

7. నేను యూదా దేశమునకు ప్రయాణము చేయుటకు అనుమతి ఈయవలసినదని పశ్చిమ యూఫ్రటీసు అధిపతులకు లేఖలు వ్రాసియిండని రాజును వేడుకొంటిని.

8. మరియు రాజు ఆధీనములోని అరణ్యములకు అధిపతియైన ఆసాపునకు కూడ లేఖ నొసగుడని అడిగితిని. దేవాలయము ఎదుటనున్న కోట బురుజులకును, నగరప్రాకారద్వారములకును, నేను వసించు గృహమునకును వలసినంత కలపను ఇప్పింపవలసినదని ఆ లేఖలో వ్రాయించితిని. ప్రభువు నన్ను కరుణించెను గనుక రాజు నేనడిగినదంతయు దయచేసెను.

9. రాజు కొందరు సైనికులను, రౌతులను నాకు రక్షణగా పంపెను. నేను పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము చేరుకొని అచటి పాలకులకు రాజులేఖలను అందించితిని.

10. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన తోబియా అను దాసుడును యిస్రాయేలీయులను ఆదుకొనుటకు ఎవరో వచ్చిరని విని బహు దుఃఖాక్రాంతులైరి.

11. నేను యెరూషలేము చేరుకొని మూడు దినములు అట వసించితిని.

12. నేను మధ్యరాత్రి యందు లేచి కొందరు మిత్రులను తోడు తీసికొని బయలుదేరితిని. ప్రభువు ప్రేరణను పొంది యెరూషలేమున నేను చేయదలచిన కార్యములున్నవి. కాని వానిని ఇంకను ఎవరితోను చెప్పనైతిని. నేనెక్కిన గాడిద తప్ప మరి ఏ జంతువు మా వెంటరాలేదు. 

13. అట్లు రాత్రి బయలుదేరి లోయద్వారము గుండ వెడలి, సర్పబావి దాటి, పేడద్వారము చేరితిని. పోవుచు పోవుచు పడిపోయిన యెరూషలేము ప్రాకారములను, కాలిపోయిన ద్వారములను పరిశీలించి చూచితిని.

14. అటుపిమ్మట జలధార ద్వారము వరకును రాజు మడుగు వరకును వెళ్ళితిని. ఆ మీదట నేనెక్కిన గాడిద పోవుటకు దారిలేదు.

15. కనుక ఆ రాత్రి క్రింది లోయలోనికి దిగి గోడను పరిశీలించుచు ముందుకు సాగిపోతిని. ఆ మీదట నేను వచ్చిన త్రోవవెంటనే నడకసాగించి లోయద్వారముగుండనే పట్టణమున ప్రవేశించితిని.

16. నేను ఎక్కడికి వెళ్ళినది ఏమి చేసినది స్థానిక ఉద్యోగులకు తెలియదు. అంతవరకు నేను యూదులతో గాని, యాజకులతో గాని, నాయకులతో గాని, ఉద్యోగులతో గాని, పనిలో పాల్గొను వారితో గాని ఒక్క మాట గూడ చెప్పలేదు.

17. అటు తరువాత నేను వారితో “మీరు మన బాధలను గుర్తించితిరిగదా! యెరూషలేము నేలమట్టమయినది. ప్రాకారద్వారములు అగ్ని జ్వాలలలో ధ్వంసమయినవి. కనుక నగరప్రాకారములు పునర్నిర్మించి మనకు కలిగిన అవమానమును తీర్చుకొందము” అంటిని.

18. మరియు ప్రభువు నాకు బాసటగా నుండెనని, రాజు గూడ నాకు తోడ్పడెనని నేను చెప్పితిని. నా మాటలు విని వారు కూడ “రండి, ప్రాకారములు నిర్మింతము” అనిరి. ఆ రీతిగా వారు గోడమీద పనిచేయుటకు తమను తాము అంకితము చేసికొనిరి.

19. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన తోబియా అను దాసుడు, అరబ్బీయుడగు గేషెము మా యత్నములను హేళన చేసిరి. మమ్ములను చిన్నచూపు చూచి, “ఈ పనిని తలపెట్టుటలో మీ భావమేమిటి? మీరు రాజుమీద తిరుగుబాటు చేయుటలేదు గదా?"అని వారు అడిగిరి.

20. నేను “ఆకాశమునందున్న దేవుడే మాకు విజయము ప్రసాదించును. ఆయన దాసులమైన మేము ప్రాకారములు నిర్మింప పూనుకొంటిమి. కాని యెరూషలేము పునర్నిర్మాణమున మీకు భాగముగాని, హక్కుగాని ఉండదు. మీ పేరు కూడ స్మరింపబడదు” అని చెప్పితిని.