ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 27

 1. రాజగునప్పటికి యోతామునకు ఇరువది యైదేండ్లు. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలన చేసెను. అతని తల్లి, సాదోకు కుమార్తెయైన యెరూషా.

2. యోతాము తన తండ్రి ఉజ్జీయావలె ప్రభువునకు ప్రీతిగలిగించు కార్యములు చేసెను. అయినను అతడు దేవాలయములోనికి అడుగు పెట్టలేదు. ప్రజలు మాత్రము పాపము మూటగట్టు కొనుచునే యుండిరి.

3. దేవాలయపు ఉత్తర ద్వారమును నిర్మించినది యోతామే. ఓఫెలుచెంత యెరూషలేము ప్రాకారమును పొడిగించినది కూడ అతడే.

4. ఇంకను అతడు యూదా మన్యమున పట్టణములు నిర్మించెను. అరణ్య సీమలో కోటలు బురుజులు కట్టించెను.

5. యోతాము అమ్మోనీయుల రాజుతో పోరాడి వారిని ఓడించెను. వారు మూడేండ్లపాటు ఏటేట రెండువందల మణుగుల వెండి, పదివేల కుంచముల గోధుమలు, పదివేల కుంచముల యవలు కప్పము కట్టుటకు అంగీకరించిరి.

6. అతడు ప్రభుని యాజ్ఞలు పాటించెను గనుక మహా బలసంపన్నుడయ్యెను.

7. యోతాము పరిపాలనలోని ఇతరాంశములు, అతడు చేసిన యుద్ధములు, అనుసరించిన పద్ధతులు అన్నియుయిస్రాయేలు యూదారాజులచరితమున లిఖింప బడియేయున్నవి.

8. రాజు అగునప్పటికి యోతాము నకు ఇరువది ఐదేండ్లు, అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను.

9. యోతాము తన పితరులతో నిద్రించగా అతనిని దావీదు నగరమున పాతిపెట్టిరి. అటుతరువాత అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services