ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 24

 1. యోవాషు తన యేడవయేట రాజై నలువది యేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి బేర్షెబా నగరమునకు చెందిన సిబ్యా.

2. ఆ రాజు యెహోయాదా జీవించినంతకాలము ప్రభువునకు ప్రీతిపాత్రుడుగనే మెలిగెను.

3. యెహోయాదా రాజునకు ఇద్దరు పడతుల నిచ్చి పెండ్లి చేసెను. వారివలన యోవాషు కుమారులను కుమార్తెలను కనెను.

4. అటుపిమ్మట రాజు దేవాలయమును బాగుచేయింప నిశ్చయించుకొనెను.

5. అతడు యాజకులు, లేవీయులు యూదా నగరములకు వెళ్ళి ప్రజలనుండి పన్ను వసూలుచేసి, ఆ సొమ్ముతో ఏటేట గుడిని మరమ్మతు చేయవలెననియు ఆజ్ఞాపించెను. అతడు ఆ కార్యమును సత్వరమే ప్రారంభింపవలెనని చెప్పినను లేవీయులు జాగుచేసిరి.

6. కనుక రాజు లేవీయుల నాయకుడైన యెహోయాదాను పిలువనంపి “నీవు లేవీయులనంపి యూదీయుల నుండియు యెరూషలేము పౌరుల నుండియు పన్ను వసూలు చేయింపవైతివేల? ప్రభు భక్తుడైన మోషే సాన్నిధ్యగుడారమును సంరక్షించుటకు ప్రజల నుండి పన్ను వసూలు చేయింపలేదా?” అని అడిగెను.

7. అతల్యా మరియు ఆమెవలన చెడిపోయిన ఆమె అనుచరులు దేవాలయమును పాడుచేసిరి. పవిత్రమైన దేవాలయ పరికరములను బాలు ఆరాధనకు వినియోగించిరి.

8. రాజు ఒక పెట్టెను చేయించి దేవాలయ ప్రవేశద్వారమునొద్ద పెట్టుడని లేవీయులను ఆజ్ఞాపించెను.

9. ప్రభుభక్తుడైన మోషే ఎడారిలో ప్రజలనుండి వసూలు చేసిన పన్నునే యిస్రాయేలీ యులు ప్రభు మందిరమునకు కొనిరావలెనని యూదాలోను, యెరూషలేములోను చాటింపు చేయించెను.

10. ఫలితముగా ప్రజా నాయకులును, ప్రజలును సంతసముతో పన్నులు కొనివచ్చి కానుకల పెట్టెను నింపిరి.

11. ప్రతిదినము లేవీయులు ఆ కానుకల పెట్టెను రాజాధికారియొదకు కొనిపోయెడివారు. పెట్టే నిండినపుడెల్ల రాజోద్యోగియు, ప్రధానయాజకుని ప్రతి నిధి కలిసి సొమ్ము బయటికి తీసి దానిని మరల యథా స్థానమునకు పంపెడివారు. ఆ రీతిగా వారు పెద్ద మొత్తము ప్రోగుజేసిరి.

12. రాజును, యెహోయాదాయును ఆ పైకమును మరమ్మతులు చేయువారికి ఇచ్చెడివాడు. వారు వడ్రంగులను, ఇనుప పరికరములను చేసెడి వారిని, రాతిపని వారిని వినియోగించి, దేవళమును బాగుచేయించెడి వారు.

13. ఆ పనివారెల్లరును కష్టపడి కృషిచేసి దేవాలయమును పూర్వస్థితికి కొనివచ్చిరి. అది భద్రమైన కట్టడముగా రూపొందెను

14. మరమ్మతు ఖర్చులకుపోగా మిగిలిన సొమ్మును యెహోయాదా కును, రాజునకును ముట్టజెప్పిరి. వారు ఆ సొమ్ముతో మందిర పరిచర్య సమయము నందును, బలులు అర్పించునపుడును వాడు పాత్రలను, సాంబ్రాణి కలశములను, వెండి బంగారపు పరికరములను చేయించిరి. యెహోయాదా బ్రతికియున్నంత కాలము క్రమము చొప్పున దేవళమున బలులర్పించిరి.

15. అతడు పండు వంటి నిండుజీవితము గడపి నూట ముప్పదియవయేట మరణించెను.

16. ఆ యాజకుడు దేవునికిని, దేవళమునకును, ప్రజలకును చేసిన సేవలకు గుర్తింపుగా అతనిని దావీదునగరమున రాజసమాధులలో పాతి పెట్టిరి.

17. యెహోయాదా మరణానంతరము యూదా నాయకులు యోవాసునకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలిడెను.

18. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవళమును విడనాడి విగ్రహములను, అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపమునకుగాను ప్రభువు యూదామీదను యెరూషలేముమీదను కినుక పూనెను.

19. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకోజూచెను. గాని వారు వారి హెచ్చరికలను పెడచెవినిబెట్టిరి.

20. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తయిన తావున నిలుచుండి “ప్రభువు వాక్కిది, మీరు దేవుని విడనాడి వినాశనము తెచ్చుకోనేల? మీరు ప్రభువును పరిత్యజించితిరి. కనుక అతడు మిమ్ము పరిత్యజించెను” అని నుడివెను.

21. ప్రజలు జెకర్యాపై కుట్రపన్నిరి. రాజు అనుమతిపై అతనిని యావే మందిర ప్రాంగణముననే రాళ్ళతో కొట్టి చంపిరి.

22. యోవాసు రాజు తనకు యెహోయాదా చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడగు జెకర్యాను చంపించెను. జెకర్యా ప్రాణములు విడుచుచు “ప్రభువు నీ చెయిదమును గుర్తించి నిన్ను శిక్షించు గాక!” అని పలికెను.

23. ఆ మరుసటి సంవత్సరము అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను, యెరూషలేమును ముట్టడించి ప్రజానాయకులనెల్ల చంపిరి. దమస్కుననున్న తమ రాజునకు అపారమైన కొల్లసొమ్మును పంపిరి.

24. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాల పెద్దదియగు యూదయా సైన్యమును వారికి లొంగి పోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడినందుచే ఆ రీతిగా యోవాషు శిక్షననుభవించెను.

25. అరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరచి వెళ్ళిపోయిరి. ఇక ఇద్దరు రాజోద్యోగులు యోవాసుపై కుట్రపన్ని అతనిని పడకమీదనే హత్య చేసిరి. యోవాసును దావీదు నగరముననే పాతి పెట్టిరి గాని రాచసమాధులలో మాత్రముకాదు.

26. కుట్ర పన్నినవారు అమ్మోనీయురాలగు షిమాతు కుమారుడైన సాబాదు మరియు మోవాబీయురాలగు షిమ్రీతు కుమారుడైన యెహోసాబాదు.

27. యూదారాజుల చరిత్రకు వివరణ చెప్పు గ్రంథమున యోవాసు కుమారుల కథలు, యోవాసు వినాశనమును గూర్చిన ప్రవచనములు, అతడు దేవాలయమును పునర్నిర్మా ణము చేసిన ఉదంతము లిఖింపబడియేయున్నవి. అటుతరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services