ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 23

 1. ఏడవసంవత్సరమున యెహోయాదా బలమును చేకూర్చుకొనెను. అతడు ఐదుగురు సైన్యాధిపతులతో ఒప్పందము కుదుర్చుకొనెను. వారు యెరోహాము కుమారుడైన అజర్యా, యెహోనాను కుమారుడైన యిష్మాయేలు, ఓబేదు కుమారుడైన అజర్యా, అదాయా పుత్రుడైన మాసేయా, సిక్రి తనయుడైన యెలీషాఫాత్తు.

2. వారు యూదా పట్టణములందెల్ల సంచరించి లేవీయులను ఆయా తెగల పెద్దలను యెరూషలేమునకు తీసికొని వచ్చిరి.

3. వారెల్లరును దేవాలయమున ప్రోగై రాజకుమారుడైన యోవాషుతో ఒడంబడిక చేసికొనిరి. అప్పుడు యెహోయాదా “రాజ కుమారుడు ఇతడే. ప్రభువు దావీదు వంశజులు రాజులగుదురని నుడివినట్లే ఇప్పుడితడు రాజపదవిని చేపట్టునుగాక!

4. మీరిట్లుచేయుడు, విశ్రాంతిదినమున యాజకులును, లేవీయులును అర్చనకు వచ్చినప్పుడు వారు మూడు భాగములై, వారిలో ఒకభాగము దేవాలయ ద్వారము చెంతను,

5. రెండవ భాగము రాజప్రాసాదద్వారము చెంతను మిగిలిన భాగము పునాది ద్వారముచెంతను కావలి నుండవలయును. ప్రజలెల్లరును దేవాలయ ప్రాంగణమున ప్రోగుకావలయును.

6. అర్చన చేయు యాజకులను, లేవీయులను తప్ప మరియెవ్వరిని దేవాలయమున ప్రవేశింపనీయరాదు, వారు శుద్ధిని పొందిరి కనుక దేవాలయ ప్రవేశము చేయవచ్చును. మిగిలిన ప్రజలెల్లరును ప్రభుని ఆజ్ఞకు బద్దులై వెలుపలనే యుండవలయును.

7. లేవీయులు ఆయుధములు తాల్చి రాజును చుట్టి ఉండి రక్షించుచుండ వలయును. రాజు ఎటు కదలిన వారు కూడ అతనితో పోవలయును. దేవాలయమున మరి ఎవరైనను ప్రవేశించిన వారిని పట్టి వధింపవలయును" అని చెప్పెను.

8. లేవీయులును, యూదీయులును యెహోయాదా ఆజ్ఞలను పాటించిరి. వారు విశ్రాంతిదినమున పని చాలించినవారిని వెళ్ళిపోనీయరైరి. కనుక విరమించిన వారును, పనిలో చేరువారునుగూడ సైన్యాధిపతులకు లభ్యమైరి.

9. యెహోయాదా సైన్యాధిపతులకు ఈటెలు, కవచములిచ్చెను. అవి దావీదు కాలము నాటివి. అంతవరకు వానిని దేవాలయమున భద్రపరచి యుంచిరి.

10. అతడు కత్తి పట్టినవారిని దేవాలయమునకు కుడి ఎడమలందును, బలిపీఠముచెంతను కావలి పెట్టగా వారెల్లరుు రాజును అపాయము నుండి కాపాడుచుండిరి.

11. అంతట యెహోయాదా యోవాషను వెలుపలికి కొనివచ్చి అతని శిరస్సుపై కిరీటము పెట్టెను. అతని చేతికి ధర్మశాస్త్ర గ్రంథమును అందించెను. ప్రజలతనిని రాజుగా ప్రకటించిరి. యెహోయాదా మరియు అతని తనయులు యోవాషునకు అభిషేకము చేసిరి. ఎల్లరును రాజునకు దీర్ఘాయువని కేకలు పెట్టిరి.

12. ప్రజలు రాజు చెంతకు పరుగెత్తుకొని వచ్చి సంతోషముతో నినాదములు చేయుచుండగా అతల్యా ఆ ధ్వని వినెను. ఆమె దేవళము చెంత ప్రజలు గుమిగూడియున్న తావునకు గబగబ నడచి వచ్చెను.

13. దేవాలయ ప్రవేశ స్థలమున రాజులు నిలుచుండు స్తంభముచెంత రాజు నిలుచుండి ఉండుటచూచెను. సైన్యాధిపతులు బాకాలనూదువారు అతని చుట్టు ప్రోగైయుండిరి. ప్రజలెల్లరు చుట్టు గుమిగూడి ఆనందముతో బాకాలు ఊదుచుండిరి. దేవాలయ గాయకులు వాద్యములు మీటుచు ప్రజలచే పాటలు పాడించు చుండిరి. అతల్యా బట్టలుచించుకొని “ద్రోహము, ద్రోహము” అని అరచెను.

14. యెహోయాదా దేవాలయము చుట్టుపట్టులలో అతల్యాను వధింపకూడదని తలంచెను. కనుక అతడు సైన్యాధిపతులను పిలిచి “మీరామెను సైనికుల వరుసలగుండ వెలుపలికి కొని పొండు. ఆమెను రక్షింపబూనిన వానిని కత్తికి బలిచేయుడు” అని చెప్పెను.

15. వారు అతల్యాకు దారినిచ్చి ఆమె రాజప్రాసాదమువద్దనున్న అశ్వ ద్వారముచెంత చేరగనే వధించిరి.

16. యెహోయాదా జనులందరు యావేవారై ఉండవలయునని జనులతోను, రాజుతోను నిబంధనము చేయించెను.

17. పిమ్మట ప్రజలెల్లరును బాలు మందిరమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. బలి పీఠములను విగ్రహములను ధ్వంసము చేసిరి. బాలు పూజారి మత్తనుని బలిపీఠము ముందటనే సంహరించిరి.

18. యెహోయాదా యాజకులను, లేవీయులను దేవాలయ సేవకు వినియోగించెను. వారు దావీదు నియమించిన ఊడిగములెల్ల చేయవలయును. మోషే ధర్మశాస్త్రమును అనుసరించి బలులు సమర్పింపవలయును. సంగీతము పాడుచు ఉత్సాహముతో ఆరాధనము చెల్లింపవలయును.

19. అతడు దేవాలయమునకు ద్వారపాలకులను నియమించి శుద్ధి చేసికొననివారిని లోనికి రానీయవలదని ఆజ్ఞాపించెను.

20. అంతట యెహోయాదా, సైన్యాధిపతులు, పుర ప్రముఖులు, ఉద్యోగులు, పౌరులందరును కూడి రాజును దేవాలయమునుండి ప్రాసాదమునకు కొనిపోయిరి. ఎల్లరును సింహద్వారమువెంట ప్రాసాద మును ప్రవేశించిరి. అచట రాజును సింహాసనాసీనుని జేసిరి.

21. ప్రజలెల్లరు మిగులసంతసించిరి. అతల్యా గతించెను గనుక నగరమున ఎట్టి కలకలము పుట్టదయ్యెను.