ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 23

 1. రాజు యెరూషలేమునుండియు, యూదా నుండియు పెద్దలను పిలిపించెను.

2. అతడు యెరూషలేము పౌరులతో, యూదీయులతో యావే మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరును కలిగియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి యెదుట చదివి విన్పించెను.

3. యోషీయా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువు సన్నిధిని ఒడంబడిక చేసికొనెను. అతడు ప్రభువునకు విధేయుడనై యుందుననియు, ప్రభువు ఆజ్ఞలను పూర్ణ హృదయముతోను, పూర్ణఆత్మతోను ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటిని అనుసరింతుననియు ప్రమాణము చేసెను. ప్రజలందరు ఆ నిబంధనమునకు సమ్మతించిరి.

4. అంతట యోషీయా ప్రధాన యాజకుడైన హిల్కీయాను, అతనికి సహాయముచేయు తోటి యాజకులను, దేవాలయ ప్రవేశమున కావలికాయు రక్షకభటులను పిలిపించి బాలును, అషేరాను, నక్షత్రములను పూజించుటకువాడు ఉపకరణములన్నిటిని దేవాలయమునకు కొనిరండని ఆజ్ఞాపించెను. అతడు ఆ ఉపకరణములను పట్టణము వెలుపలికి కొని పోయి కీడ్రోను లోయలో తగులబెట్టించెను. వాని బూడిదను బేతేలునకు పంపించెను.

5. యెరూషలేము ప్రాంతమున, యూదాసీమలోని నగరములందుగల ఉన్నత స్థలములలో ధూపమువేయుటకై పూర్వపు యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బాలునకును, సూర్యచంద్రులకును, గ్రహములకును, నక్షత్రములకును ధూపమువేయు వారినేమి అతడు అందరిని నిలిపివేసెను.

6. అతడు యావే దేవాలయము నుండి అషేరా స్తంభమును వెలుపలికి గొనివచ్చి కీద్రోను నది లోయకు తీసికొనిపోయి అచట తగుల బెట్టించెను. దాని బూడిదను శ్మశానమున చల్లించెను.

7. దేవళ ములోని వేశ్యావృత్తినవలంభించిన పురుషుల గదులను కూలద్రోయించెను. అక్కడ వసించు స్త్రీలు అషేరా వనములలో అషీరాదేవతా క్షేత్రమునకు గుడారములు అల్లెడివారు.

8. అతడు యూదా రాజ్యములందలి యాజకుల నందరిని అవతలికి వెళ్ళగొట్టెను. గేబా నుండి బేర్షేబా వరకు యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అమంగళముచేసి, పట్టణపు ద్వారమునొద్ద ఎడమ వైపుననున్న పట్టణపు అధికారి అయిన యెహోషువా నిర్మించిన ద్వారము దగ్గరనుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను.

9. అయితే పై యాజకులకు యెరూషలేము దేవాలయమునందు యావే బలి పీఠమువద్ద అర్చనచేయు హక్కులేదు. కాని నగరము నందలి యాజకులకు లభించు పొంగనిరొట్టెలను మాత్రము వారు భుజింపవచ్చును.

10. రాజు హిన్నోము కుమారుల లోయలోని తో ఫెతు కొలిమిని గూడ అమంగళము గావించెను. అచటి దైవమైన మోలెకునకు తమ కొడుకులనుగాని, కూతుండ్రనుగాని ఎవరును దహనబలిగా సమర్పించుటకు వీలుపడనట్లు చేసెను.

11. యావే దేవళపు ప్రవేశమంటపమునొద్ద, సేవకుడైన నెతన్నెలకు యొక్క గది దగ్గర పూర్వము యూదా రాజులు సూర్యారాధనకు సమర్పించిన గుఱ్ఱములను తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములనన్నిటిని కాల్పించెను.

12. యూదా రాజులు ప్రాసాదమునకు పైభాగమున, ఆహాసురాజు నిర్మించిన బలిపీఠములను యోషీయా కూలద్రోయించెను. మనష్షే రాజు దేవాలయమునందలి రెండు ఆవరణములలో కట్టించిన బలిపీఠములకును ఇదే గతి పట్టెను. అతడు ఆ పీఠములను పొడిపొడి చేయించి కీద్రోను లోయలో చల్లించెను.

13. యెరూషలేమునకు తూర్పుననున్న భ్రష్టాచారపు కొండకు దక్షిణ దిశన సొలోమోను నికృష్టమైన దేవతా విగ్రహములకు ఉన్నత స్థలములు నిర్మించెను. అవి సీదోనీయులు కొలుచు అష్టారోతు, మోవాబీయులు కొలుచు కేమోషు, అమ్మోనీయులు కొలుచు మిల్కోము విగ్రహములు. ఆ ఉన్నత స్థలములను యోషీయా పడగొట్టించెను.

14. అతడు అషీరాదేవత ప్రతిమను, శిలాస్తంభములను ముక్కలు ముక్కలు చేయించెను. ఆ దేవత పేర నాటించిన కొయ్య స్తంభములనుగూడ నరికించెను. ఆ తావును మనుష్యుల ఎముకలతో నింపెను.

15. యోషీయా బేతేలునందలి బలిపీఠమును, ఉన్నత స్థలమును అనగా యిస్రాయేలు ప్రజలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యరోబాము కట్టించిన ఆ ఉన్నతస్థలమును పడగొట్టించి, కాల్చి దాని రాళ్ళను పిండిచేయించెను. అషీరాదేవతకు నెలకొల్పిన ప్రతిమనుగూడ తగుల బెట్టించెను.

16. యోషీయా అటునిటు పారజూడగా ఉన్నత స్థలములో కొన్ని సమాధులు కనిపించెను. అతడు సమాధులలోని ఎముకలను తెప్పించి బలిపీఠము మీద కాల్పించి దానిని అమంగళపరచెను. పూర్వము యరోబాము ఉత్సవసమయమున ఈ బలిపీఠము చెంత నిలిచియున్నపుడు దైవభక్తుడు పలికిన ప్రవచనము ఈరీతిగా నెరవేరెను. రాజు మరల చుట్టుపట్ల పారజూడగా పై ప్రవచనము పలికిన దైవభక్తుని సమాధి కూడ కనిపించెను.

17. అతడు ఆ సమాధి ఎవరిదని ప్రశ్నింపగా బేతేలు పౌరులు “నాడు యూదా రాజ్యము నుండి వచ్చి ఇప్పుడు నీవు ఈ బలిపీఠమును కూలద్రోయించిన విధానమునంతటిని ముందుగనే ప్రవచించిన దైవభక్తుని సమాధి అదియే” అని చెప్పిరి.

18. అందుకు రాజు “ఆ సమాధిని అట్లే ఉండనిండు. అతని ఎముకలను తొలగింపవద్దు” అనెను. కనుక ఆ అస్థికలను ఎవరు ముట్టుకోలేదు. ఆ రీతిగనే సమరియా నుండి వచ్చిన ప్రవక్త అస్థికలనుకూడ ఎవరు అంటుకోలేదు.

19. సమరియా నగరములందలి ఉన్నత స్థలములలోని మందిరములనెల్ల యోషీయా నిర్మూలించెను. పూర్వము యిస్రాయేలు రాజులు ఈ మందిరములను నిర్మించి యావే కోపమును రెచ్చగొట్టిరి. ఆ మందిరములలోని బలిపీఠములకు కూడ బేతేలు బలిపీఠమునకు పట్టినగతియే పట్టెను.

20. అతడు ఉన్నతస్థలమునకు నియమింపబడిన యాజకులను అందలి బలిపీఠముల మీదనే వధించెను. ప్రతి పీఠముమీద ఎముకలను కూడ కాల్పించెను. అటుపిమ్మట రాజు యెరూషలేమునకు వెడలిపోయెను.

21. నిబంధన గ్రంథమున వ్రాయబడియున్నట్లే ప్రభువు పేర పాస్కబలిని జరుపుడని రాజు ప్రజలను ఆజ్ఞాపించెను.

22. న్యాయాధిపతుల పరిపాలనకాలము నుండియు యిస్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పాస్క ఉత్సవమును ఇంత వైభవముగా జరిపియుండలేదు.

23. యోషీయా రాజు ఏలుబడి పదునెన్మిదియవ యేట యెరూషలేమున పాస్క ఉత్సవము జరిగెను.

24. ప్రధానయాజకుడైన హిల్కీయా దేవాలయమున కనుగొనిన గ్రంథమునందలి ఆజ్ఞలను పాటించుటకై యోషీయా యెరూషలేమునుండి, యూదానుండి జ్యోతిష్కులను, చనిపోయినవారిని ఆవాహనముచేయు మాంత్రికులను వెళ్ళగొట్టించెను. గృహదేవతల విగ్రహములను, అన్య దేవతారాధనయందు వాడు పరికరములను నిర్మూలించెను.

25. యోషీయా వలె మోషే ఆజ్ఞలన్నిటిని పాటించి పూర్ణహృదయముతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో ప్రభువును కొలిచినవాడు అతనికి పూర్వపు రాజులలో ఒక్కడునులేడు. అతని తరువాత వచ్చిన రాజులలోను ఎవడునులేడు.

26. అయినను మనష్షే చేసిన దుష్కార్యములవలన ప్రభువు కోపము యూదామీద ముమ్మరముగా రగుల్కొనెను.

27. కనుక అతడు “నేను యిస్రాయేలీయులను వలె యూదా ప్రజలనుగూడ నా సమక్షమునుండి వెడలగొట్టెదను. నేనెన్నుకొనిన యెరూషలేము నగరమును, నా నామమున ఎన్నుకొనిన దేవళమును పరిత్యజింతును”అనెను.

28. యోషీయా చేసిన ఇతర కార్యములు యూదా రాజులచరితమున లిఖింపబడియేఉన్నవి.

29. అతడు రాజుగా ఉన్న కాలమున ఐగుప్తురాజైన నెకో అస్పిరియా రాజునకు తోడ్పడుటకై సైన్యముతో యూఫ్రటీసునది వద్దకు వెళ్ళుచుండగ యోషీయా ఐగుప్తు సైన్యమును ఆపదలచి మెగిద్ధో వద్ద దానిని ఎదిరించెను. ఆ యుద్ధమున అతడు ప్రాణములు కోల్పోయెను.

30. రాజోద్యోగులు అతని శవమును రథము మీద యెరూషలేమునకు కొనిపోయి అతని సమాధియందు పాతిపెట్టిరి. యూదీయులు యోషీయా కుమారుడు యెహోవాహాసును రాజుగా ఎన్నుకొని అభిషేకించిరి.

31. రాజగునాటికి యెహోవాహాసునకు ఇరువది మూడేండ్లు. అతడు యెరూషలేమునుండి మూడునెలలు మాత్రము పరిపాలించెను. లిబ్నానగరపు యిర్మియా పుత్రిక హమూతలు అతని తల్లి.

32. అతడును తన పితరులవలెనె యావే సహించని దుష్కార్యములు చేసెను.

33. ఐగుప్తురాజగు ఫరో నెకో హమాతు మండలములోని రిబ్లా నగరమున యెహోవాహాసును బందీనిచేసెను. యూదా సీమకు నాలుగువందల వీసముల వెండిని, నాలుగు వీసముల బంగారమును పన్ను విధించెను.

34. ఫరో నెకోరాజు, యోషీయా కుమారుడు ఎల్యాకీమును తండ్రికి బదులుగా రాజును చేసెను. అతని పేరును మార్చి యెహోయాకీము అని క్రొత్త పేరు పెట్టెను. ఫరో నెకో యెహోవాహాసును ఐగుప్తునకు బందీగా కొనిపోగా అతడచ్చటనే మరణించెను.

35. ఐగుప్తురాజు విధించిన కప్పములను చెల్లించుటకై యెహోయాకీము ప్రజలనుండి వారివారికి నిర్ణీతమైన పన్నులు వసూలుచేసెను.

36. యెహోయాకీము రాజగునప్పటికి ఇరువది ఐదేండ్ల ఈడువాడు. అతడు యెరూషలేము నుండి పదునొకండేండ్లు పరిపాలించెను. రూమా నగరవాసి పెదాయా పుత్రిక సెబిదా అతని తల్లి.

37. ఆ రాజు కూడ తన పూర్వులవలె యావే సహించని దుష్కార్య ములు చేసెను.