ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 21

 1. యెస్రెయేలు నగరమున నాబోతు అనువానికి ఒక ద్రాక్షతోట కలదు. అది అహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండేను.

2. ఒకనాడు రాజు అతనితో “నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది. కనుక దానిని నాకిచ్చివేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటె మంచి ద్రాక్షతోటని ఇంకొక దానిని నీకిత్తును. లేదా నీకు అనుకూలమైన యెడల దాని వెలయైన ఇత్తును” అనెను.

3. కాని నాబోతు “అయ్యా! ఇది నా పిత్రార్జితమైన నేల. యావే జీవముతోడు, ఈ తోటను నేను అమ్మను” అని పలికెను.

4. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్న బుచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పరుండి ఆవలివైపు ముఖము త్రిప్పుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను.

5. అహాబు భార్య యెసెబెలు అతనిని సమీపించి “నీవింతగా విచా రించుచు, అన్నము మానివేయవలసినంత ఆపద ఏమి వచ్చినది?” అని అడిగెను.

6. అతడు ఆమెతో “నేను నాబోతును ద్రాక్షతోట అమ్ముమని అడిగితిని. దాని వెలగాని లేదా దానికి బదులు మరియొక తోటగాని ఇచ్చెదనంటిని. కాని అతడు ఆ ద్రాక్షతోటను అమ్మ ననెను” అని చెప్పెను.

7. ఆమె అతనితో “యిస్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడకమీదినుండి లేచి భోజనముచేసి ఉత్సాహము తెచ్చుకొనుము. నాబోతు తోటను నేనే నీకిప్పించెదను” అని అనెను.

8. ఆమె అహాబు పేరుతో జాబులు వ్రాసి వాని మీద రాజముద్ర వేసెను. జాబులను యెస్రెయేలు నందలి అధికారులకును, పెద్దలకును పంపించెను.

9. ఆ జాబులలో “మీరు ఉపవాసదినమును ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగుచేయుడు. నాబోతును ప్రజల ఎదుటికి కొనిరండు.

10. అతడు దేవుని, రాజును దూషించెనని ఇద్దరు దుర్మార్గులచేత కూటసాక్ష్యము చెప్పింపుడు. అటుపిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టి చంపింపుడు” అని వ్రాసెను.

11. యెస్రెయేలు నగరపు అధికారులు, పెద్దలు యెసెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి.

12. వారు ఉప వాసదినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందునిల్పిరి.

13. ఇద్దరు దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని, రాజును దూషించెనని అబద్దసాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టిచంపిరి.

14. అటుపిమ్మట వారు నాబోతును రాళ్ళతో కొట్టి చంపితిమని యెసెబెలునకు వార్త పంపిరి.

15. ఆ వార్తను అందుకొనగనే యెసెబెలు అహాబుతో “నీవు వెళ్ళి నాబోతు అమ్మననిన తోటను స్వాధీనము చేసికొనుము. అతడు ప్రాణములు విడిచెను” అని చెప్పెను.

16. నాబోతు చనిపోయెనని తెలిసికొని అహాబు తోటను స్వాధీనము చేసికొనుటకు యెస్రెయేలునకు వెళ్ళెను.

17-18. అంతట ప్రభువు వాణి తిప్పీయుడగు ఏలీయా ప్రవక్తతో “నీవు సమరియా రాజు అహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్షతోటను స్వాధీనము చేసికొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలిసికొనుము,

19. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము 'నీవొక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురును కూడ కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి' అని చెప్పుము” అనెను.

20. ఏలీయా కనబడగానే అహాబు అతనితో “నీవు నాకు శత్రుడవు. నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా?” అనెను. ఏలీయా “అవును. నీవు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి.

21. ప్రభువు పలుకులు వినుము. నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరిని రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరిని పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసితీరుదును.

22. నీ కుటుంబము నెబాతు కుమారుడగు యరోబాము రాజ కుటుంబమువలెను, అహీయా కుమారుడగు బాషా రాజు కుటుంబమువలెను పూర్తిగా కానరాకుండ పోవును. నీవు యిస్రాయేలును పాపమునకు పురికొల్పితివి. నా కోపమును రగుల్కొల్పితివి.

23. మరియు యెసెబెలునుగూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు. యెస్రెయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకు కొని తినును.

24. నీ బంధువులెవరైన పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైన పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయును” అని పలికెను.

25. అహాబువలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడులేడు. అతడు తన భార్య యెసెబెలు ప్రోద్బలము వలన కానిపనులు చేసెను.

26. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలినపనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి యిస్రాయేలీయుల ఎదుట నిలువకుండ తరిమి వేసెను.

27. ఏలీయా ఇట్లు పలుకగా అహాబు బట్టలు చించుకొని గోనెకట్టుకొనెను. ఉపవాసము ఉండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను.

28-29. అంతట ప్రభువు వాణి ఏలీయా ప్రవక్తతో “చూచితివా! అహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. అహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవితకాలమున శిక్షింపను, కాని అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదును” అని చెప్పెను.