ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 21

 1. యిస్రాయేలీయులు మిస్పావద్ద ప్రోగై “మన పిల్లలను బెన్యామీనీయులకు ఈయవద్దు” అని ప్రమాణము చేసికొనిరి.

2. వారు బేతేలునకు వచ్చి యావే ముందట సాయంకాలము వరకు మిక్కిలి విలపించిరి.

3. “యిస్రాయేలు దేవుడైన యావే! నేడు యిస్రాయేలున ఒక తెగతక్కువైపోయినది కదా!” అని పరితపించిరి.

4. మరునాడు వేకువనే లేచి దేవునికి బలిపీఠముకట్టి సమాధానబలులు, దహనబలులు సమర్పించిరి.

5. యిస్రాయేలు తెగలందు నేడు యావే సన్నిధికి రానివారె వరైనా ఉన్నారా అని విచారించి చూచిరి. మిస్పా నగరమున యావే సన్నిధికి రానివారిని ప్రాణములతో బ్రతుకనీయరాదని ముందే బాసచేసికొనిరి.

6.  యిస్రాయేలీయులు బెన్యామీనీయులను తలచుకొని విచారపడిరి. “నేడు యిస్రాయేలున ఒక తెగ అంతరించినది గదా!

7. ఆ తెగలో మిగిలినవారికి పెండ్లి చేయుటయెట్లు? వారికి మన పిల్లలను ఈయరాదని యావే పేరుమీద బాసచేసితిమి గదా!" అని అనుకొనిరి.

8. మిస్పానగరమున యావేసన్నిధికి రానివారు ఎవరా అని విచారించిచూడగా యాబేషు గిలాదు నుండి ఎవ్వరు రాలేదని తెలియవచ్చెను.

9. వచ్చిన వారినందరను జాగ్రత్తగా లెక్కించిచూచిరిగాని యాబేషు గిలాదు పౌరులు ఎవ్వరును అట కనిపింపలేదు.

10-11. కనుక యిస్రాయేలీయులు పండ్రెండువేలమంది పరాక్రమశాలులను ఎన్నుకొని “పోయి యాబేషు గిలాదు నివాసులను స్త్రీలనక, శిశువులనక అందరిని చంపివేయుడు. ప్రతి పురుషుని, మగనితో కాపురము చేయు ప్రతి స్త్రీని శాపముపాలు చేయుడు. మగపోడిమి ఎరుగని కన్నెలను మాత్రము వదలివేయుడు” అని ఆజ్ఞాపించిరి. వారు అటులనే చేసిరి.

12. ఆ నగరమున మగపోడిమి ఎరుగని ఎలప్రాయపు కన్నెలు నాలుగువందల మంది కలరు. వారినందరిని షిలో నగరమున గుమిగూడిన యిస్రాయేలు సమాజము నొద్దకు కొనివచ్చిరి. ఈ షిలో నగరము కనాను మండలమున గలదు.

13. అంతట ఆ సమాజము రిమ్మోనుతిప్ప యందు వసించు బెన్యామీనీయులకు శాంతి వార్తలను ఎరిగించుటకై దూతలనంపెను.

14. బెన్యామీనీయులు తిప్పనుండి తిరిగివచ్చిరి. యాబేషుగిలాదు నుండి కొనివచ్చిన కన్నెలను వారికి అర్పించిరి. కాని బెన్యామీనీయుల కందరికి వధువులు సరిపోలేదు.

15. యిస్రాయేలీయులు బెన్యామీనీయులను తలంచుకొని విచారపడిరి. యావే ఒక తెగవారిని నాశనము చేసెనుగదా!

16. యిప్రాయేలు సమాజపు పెద్దలందరు ప్రోగై “బెన్యామీను స్త్రీలందరును చనిపోయిరి. ఇక ఆ తెగలో మిగిలియున్న మగవారికి పెండ్లి అగుట ఎట్లు?

17. బెన్యామీనీయులకు సంతానము కలిగించుటెట్లు? యిస్రాయేలున ఏ తెగయును అణగారిపోరాదుగదా!

18. మన పిల్లలనా వారికి ఈయరాదు. మరి ఏమి చేయుదము?” అని వితర్కించుకొనిరి. అంతకుముందే వారు “బెన్యామీనీయులకు పిల్లలనిచ్చినవారు శాపమువలన మగ్గిపోవుదురు గాక!” అని బాసచేసికొనియుండిరి.

19. యిస్రాయేలీయులు తమలో తాము మథనపడి “ఏటేట షిలోనగరమున యావే ఉత్సవము జరుగునుగదా!” అనుకొనిరి. (ఈ నగరము బేతేలు నకు ఉత్తరమున, బేతేలు నుండి షెకెమునకు పోవు రాచబాటకు తూర్పున, లెబోనాకు దక్షిణమున గలదు.)

20. కనుక వారు బెన్యామీనీయులతో “మీరు షిలో చెంతగల ద్రాక్షతోటలలో పొంచి, కనిపెట్టియుండుడు.

21. షిలో కుమార్తెలు నాట్యబృందముతో కలసి నాట్యము చేయవత్తురు. అపుడు మీరు ద్రాక్షతోటల నుండి వెలువడి పెండ్లియాడుటకు ఒక్కొక్కరు ఒక్కొక్క యువతిని భార్యగా పట్టుకొని మీ మండలమునకు పారిపొండు.

22. వారి తండ్రులు, సోదరులు వచ్చి తగవు పెట్టుకొందురేని “మీరు వారిని క్షమింపవలయును. యుద్ధమున యోధులు స్త్రీలను చేకొనినట్లే ఈ బెన్యామీనీయులు ఒక్కొక్కరు ఒక్కొక్క యువతిని భార్యగా గైకొనిరి. అంతేకదా! మీ అంతట మీరే వారికి యువతులను ఇచ్చియుందురేని శపథము మీరి పాపము కట్టుకొనియుందురు అని వారిని ఒప్పింతము” అనిచెప్పిరి.

23. అయితే బెన్యామీనీయులు ఆ ఉపదేశమును పాటించిరి. నాట్యమాడ వచ్చిన స్త్రీల నుండి తమకు కావలసినంతమందిని భార్యలుగా తీసుకొని పారిపోయిరి. వారు తమ దేశములకు వెడలిపోయి తమ నగరములను తిరిగి నిర్మించుకొని వానిలో కాపురముండిరి.

24. ఆ పిమ్మట యిస్రాయేలీయులలో ప్రతి ఒక్కడు అక్కడనుండి తమ తమ తెగల స్థానములకును, కుటుంబములకును పోయిరి. అందరును వారి వారి స్వాస్థ్యములకు చేరుకొనిరి.

25. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజు లేడు. కనుక ఎవరి ఇష్టము వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి.