ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 20

 1. ఆ రోజులలో హిజ్కియారాజు జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అపుడు ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా రాజును చూడబోయి “ప్రభువు సందేశమిది. నీవిక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము” అని చెప్పెను.

2. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి,

3. "ప్రభూ! ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని. నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని" అని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను.

4. యెషయా రాజును వీడ్కొని రాజప్రాసాద మధ్య భాగమును దాటిపోకమునుపే ప్రభువు వాణి యెషయాతో “నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను ఏలు హిజ్కియాతో ఇట్లు చెప్పుము:

5. ప్రభువు సందేశమిది. నీ పితరుడు దావీదు దేవుడను, ప్రభుడనైన నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్ళను నా కన్నులార జూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. నీవు మూడుదినములలో దేవాలయమునకు పోవుదువు.

6. నేను నీ ఆయువును ఇంకను పదునైదేండ్లు పొడిగింతును. అస్సిరియారాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును. నా గౌరవార్థము, నా సేవకుడగు దావీదు నిమిత్తము, నేను ఈ నగరమును రక్షింతును” అని చెప్పెను.

7. అంతట యెషయా "అత్తి పండ్ల గుజ్జును తెండు. రాజు వ్రణముపై ఉంచుడు. అతనికి ఆరోగ్యము చేకూరును” అనెను.

8. హిజ్కియా “ప్రభువు నావ్యాధిని నయము చేయుననుటకును, మూడు రోజులపిదప నేను దేవాలయమునకు పోవుదుననుటకును గుర్తు ఏమిటి?” అని ప్రవక్త నడిగెను.

9. యెషయా “ప్రభువు తన మాట నిలబెట్టుకొనును. దానికి గుర్తిది. సూర్యుని నీడను పదిమెట్లు ముందుకు జరుపమందువా లేక పదిమెట్లు వెనుకకు జరుపమందువా?” అని అడిగెను.

10. హిజ్కియా "పదిమెట్లు ముందుకు జరుపుట సులభమేగదా! కనుక పదిమెట్లు వెనుకకు జరిపిన చాలును” అనెను.

11. అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యుని నీడ ఆహాసు మెట్లపై పదిమెట్లు వెనుకకు పోయెను.

12. అదే కాలమున బబులోనియా రాజును బలదానుకుమారుడునగు మెరోదక్బలదాను హిజ్కియా రాజు జబ్బుపడెనని విని అతనికొక లేఖ వ్రాసి బహుమతి పంపెను.

13. హిజ్కియా ఆనందముతో ఆ రాజదూతలను ఆహ్వానించి వారికి తన కోశాగార మందలి వెండి బంగారములను, సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను, రక్షణాయుధములను చూపించెను. తన ప్రాసాదమునగాని, రాజ్యమునగాని హిజ్కియా వారికి చూపింపని వస్తువులేదు.

14. అంతట యెషయా హిజ్కియా రాజునొద్దకు వెళ్ళి "వీరు ఎచ్చటినుండి వచ్చిరి? నీతో ఏమి చెప్పిరి?” అని అడిగెను. హిజ్కియా “వారు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరి” అని జవాబు చెప్పెను.

15. “వారు నీ ప్రాసాదమున ఏమేమి చూచిరి?” అని యెషయా అడిగెను. రాజు “అంతయు చూచిరి. కోశాగారమున నేను వారికి చూపని వస్తువు ఒక్కటియు లేదు” అనెను.

16. యెషయా “అయినచో ప్రభువువాక్కు వినుము.

17. మీ ఇంటనున్న వస్తువులన్నింటిని నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టిన వస్తుసామగ్రినంతటిని బబులోనియాకు కొనిపోయెదరు. ఇక నీకేమియు మిగులదు.

18. నీ వంశజులను గూడ బబులోనియాకు తీసికొనిపోయెదరు. అచట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతుకుదురు” అని పలికెను.

19. కాని హిజ్కియా తన పరిపాలన కాలమున శాంతిభద్రతలు నెలకొనియుండిన అదియే చాలును అనుకొనెను. కనుక అతడు ప్రవక్తతో “ప్రభువు సందేశము మంచిదే” అని అనెను.

20. హిజ్కియా చేసిన ఇతర కార్యములు అతని సాహస కృత్యములు, అతడు చెరువును, సొరంగమును త్రవ్వించి పట్టణమునకు మంచినీటిని సరఫరా చేయించుట మొదలగునవి అవన్నియు యూదారాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.

21. హిజ్కియా తన పితరులతో నిద్రించగా అతని కుమారుడు మనష్షే రాజయ్యెను.