ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 20

 1. అటుతరువాత మోవాబీయులు, అమ్మోనీయులు, మెయూనీయులు యెహోషాఫాత్తు మీదికి దాడి చేసిరి.

2. దూతలు "మృతసముద్రపు ఆవలి తీరమున ఉన్న ఎదోమునుండి పెద్ద సైన్యము నీ మీదికి దండెత్తివచ్చుచున్నది. ఆ దండు హజజో మారు అను ఎంగడీ సీమను ఆక్రమించుకొనినది” అని రాజునకు వార్త పంపిరి.

3. యెహోషాఫాత్తు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగెను. యూద రాజ్యమంతట ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించెను.

4. రాజ్యములోని ప్రతి పట్టణము నుండి వచ్చిన ప్రజలెల్లరును యెరూషలేమున ప్రోగై ప్రభువును సలహా అడిగిరి.

5-6. ఆ ప్రజలును, యెరూషలేము పౌరులును దేవాలయపు నూతన ప్రాంగణమునకు ముందట సమావేశమైరి. అప్పుడు యెహోషాఫాత్తు ఆ జనుల ముందట నిలుచుండి “మా పితరుల దేవుడైన ప్రభూ! నీవు ఆకాశము నుండి ఈ నేలమీది జాతులనెల్ల ఏలు దేవుడవు. నీవు అనంత శక్తి సామర్థ్యములు కలవాడవు. కనుక ఏ నరుడును నిన్నెదిరింపజాలడు.

7. నీవే మా దేవుడవు. నీవు ఈ దేశవాసులను తరిమివేసి ఈ భూమిని నీ మిత్రుడైన అబ్రహాము సంతతికి శాశ్వతముగా భుక్తము చేసితివి.

8. నీ ప్రజలు ఇచట వసించి నిన్ను కొలుచుటకు ఒక ఆలయమును కట్టిరి.

9. ఏదైనా యుద్ధము, శిక్ష, అంటురోగము, కాటకము సంభవించెనేని నీ నామమునకు నివాస స్థానమైన ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను శరణు వేడవచ్చునని ఈ జనులకు తెలియును. వారు తమ గోడును నీకు విన్నవించుకొనగా నీవు వారి మొరాలించి వారిని ఆదుకొందువు.

10. ఇప్పుడు అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయులు మా మీదికెత్తి వచ్చిరి. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినప్పుడు, నీవు వారిని ఈ జాతుల రాజ్యములమీదుగా పయనము చేయనీయవైతివి. వారు వీరి రాజ్యములకు ఆవలి వైపుగా నడచివచ్చిరి కనుక వారిని నాడే మట్టుపెట్టరైరి.

11. కనుకనే వారు నేడు మాకిట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. నీవు మాకిచ్చిన ఈ నేలమీదినుండి వారు మమ్ము తరిమివేయ చూచుచున్నారు.

12. ఇంతటి మహాసైన్యము మా మీదికి రాగా మాకు వారి నెదుర్కొను సత్తువలేదు. మాకేమి చేయవలయునో గూడ తోచుటలేదు. మేము నిన్నే నమ్ముకొంటిమి. కనుక నీవే వారిని శిక్షింపుము” అని మొరపెట్టెను.

13. యూదీయులెల్లరు తమ భార్యలతో బిడ్డలతో దేవాలయమున నిలుచుండిరి.

14. అప్పుడు దేవుని యాత్మ ఆ ప్రజలలోనున్న యహసీయేలు అను లేవీయుని ఆవేశించెను. అతడు అసాపు వంశీయుడు, జెకర్యా కుమారుడు. అతని వంశకర్తలు క్రమముగా బెనయా, యెహీయేలు, మతన్యా.

15. ఆ లేవీయుడు “రాజా! యెరూషలేము పౌరులారా! యూదీయులారా! మీరెల్లరును ప్రభువు వాక్కునాలింపుడు. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు. నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీదికాదు, ప్రభువుది.

16. రేపు వారు సీసు కనుమ మీదుగా వచ్చినపుడు మీరు వారిని ఎదిరింపుడు. యెరూవేలు ఎడారి ముందటనున్న లోయ కొనయందు మీరు వారిని చూతురు.

17. మీరసలు యుద్ధము చేయనక్కర లేదు. మీ సేనలను యుద్ధమునకు మోహరింపుడు, చాలును. ప్రభువే మీకు విజయము దయచేయును. యూదీయులారా! యెరూషలేము పౌరులారా! భయపడకుడు, నిరుత్సాహము చెందకుడు. మీరు రేపు శత్రువుల మీదికి పొండు, ప్రభువు మీకు బాసటగా నుండును” అని ప్రవచించెను.

18. అప్పుడు యెహోషాఫాత్తు సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రజలెల్లరు అతనితో పాటు భూమి మీదికి వంగి ప్రభువును ఆరాధించిరి.

19. అంతట లేవీయులైన కోహాతు, కోరా సంతతి వారు లేచి నిలుచుండి పెద్ద నాదముతో యిస్రాయేలు దేవుని స్తుతించిరి.

20. మరునాటి ఉదయము వారెల్లరును పెందల కడనే లేచి తెకోవా ఎడారికి వెళ్ళిరి. ఆ ప్రజలు పయనమగుచుండగా యెహోషాఫాత్తు “యూదీయులారా! యెరూషలేము పౌరులారా! మన దేవుడైన ప్రభువును నమ్మినచో మీకెట్టి ఆపదయు కలుగదు. ప్రభువు ప్రవక్తల సందేశమును నమ్ముడు. మీకు విజయము సిద్దించును” అని నుడివెను.

21. అతడు ప్రజలతో సంప్రతించిన పిదప, కొందరు సంగీతకారులు పవిత్ర అలంకారములు ధరించి సైన్యము ముందునడుచుచు “ప్రభువును స్తుతింపుడు. అతని కృప శాశ్వతముగా నుండును” అని పాడవలయునని ఆజ్ఞాపించెను.

22. వారట్లు స్తుతిగీతము పాడుచుండగా ప్రభువు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిన శత్రుప్రజలకు కలవరముపుట్టించి వారిని చిందరవందరచేసెను.

23. అమ్మోనీయులు, మోవాబీయులు ఇరువురును కలసి ఎదోమీయుల మీద ఆకస్మికదాడి జరిపి వారిని సర్వనాశనము చేసిరి. అటుపిమ్మట ఆ ఇరుతెగల వారుకూడ ఒకరినొకరు ఎదుర్కొని పరస్పరము చంపుకొనిరి.

24. యూదా సైన్యము ఎడారిలోని బురుజు చెంతకు వచ్చి చూడగా శత్రుసైన్యములు చచ్చి నేలమీద పడియుండెను. వారిలో ఒక్కడును తప్పించుకొని పోలేదు.

25. యెహోషాఫాత్తు అతని సైనికులు కొల్లసొమ్ము దోచుకొనుటకురాగా చాల పశువులు, వస్తువులు, విలువగల ఆభరణములు కనిపించెను. ఆ సొత్తు విస్తారముగా నున్నందున మూడుదినములు ప్రోగుజేసికొనినను ఇంకను మిగిలిపోయెను.

26. సైనికులెల్లరు నాలుగవదినమున బెరాకా లోయలో ప్రోగై ప్రభువును స్తుతించిరి. కనుకనే నేటి వరకు ఆ లోయకు బెరాకా' అను పేరు మారలేదు.

27. ప్రభువు శత్రువులను ఓడించెను కనుక యూదీయులు, బెన్యా మీనీయులు విజయోత్సాహముతో యెహోషాషాత్తు నాయ కత్వమున యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

28. స్వరమండలము, సితారా, బాకాలసంగీతము మారుమ్రోగుచుండగా సైన్యములు పట్టణము చేరుకొని దేవాలయమును సందర్శించెను.

29. ప్రభువు యిస్రాయేలు శత్రువులను ఓడించెనని విని అన్యజాతు లెల్ల గడగడ వణికిపోయెను.

30. యెహోషాఫాత్తు రాజ్యమున శాంతి నెలకొనెను. ప్రభువు అతనికి ఎల్ల దిశలందును భద్రత చేకూరునట్లు చేసెను.

31. యెహోషాఫొత్తు తన ముప్పది ఐదవయేట యూదాకు రాజయ్యెను. అతడు ఇరువది ఐదుఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి షిల్హీ‌ కుమార్తెయైన అసూబా.

32. ఆ రాజు తన తండ్రి ఆసావలె ప్రభువునకు ప్రియము కలిగించు ధర్మ మార్గమున నడచెను.

33. అయినను ఉన్నత స్థలములను తీసివేయలేదు. ప్రజలును తమ పితరుల దేవుడైన ప్రభువును స్థిరహృదయముతో పూజింపరైరి.

34. యెహోషాపాతు తన పరిపాలనాకాలము ఆద్యంతముల వరకు చేసిన ఇతర కార్యములెల్ల హనానీ కుమారుడైన యెహూ రచించిన చరితమున లిఖింపబడియేయున్నవి. ఈ చరితము యిస్రాయేలు రాజులచరిత్రలో చేర్చబడినది.

35. ఒకమారు యెహోషాపాత్తు దుష్టకార్యములు చేసిన యిస్రాయేలురాజు అహస్యాతో చేతులు కలిపెను.

36. వారిరువురును కలిసి సముద్రయానము కొరకు అనగా తర్షీషు పట్టణమునకు పయనించుటకు ఏసోనెబేరు వద్ద ఓడలు నిర్మించిరి.

37. కాని దోదావాహు కుమారుడును, మరేషా నివాసియైన ఎలియెజెరు “నీవు అహస్యాతో చేతులు కలిపితివి కనుక ప్రభువు నీ ఓడలను ధ్వంసము చేయును” అని ప్రవచించెను. యెహోషాఫాత్తు నావలు అటులనే నాశనమయ్యెను గనుక అవి తర్షీషునకు సముద్రయానము చేయనే లేదు.