ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 1

 1. అహాబు మరణానంతరము మోవాబు మండలము యిస్రాయేలుపై తిరుగబడెను.

2. అహస్యా రాజు సమరియాలోని తన ప్రాసాదముమీది వసారానుండి క్రిందపడి గాయపడెను. అతడు ఫిలిస్తీయా దేశములోని ఎక్రోను నగరమందలి బాల్సెబూబు దేవతను సంప్రదించి తనకు ఆరోగ్యము చేకూరునో లేదో తెలిసికొనిరండని దూతలనంపెను.

3. కాని ప్రభువు దూత తిష్బియుడగు ఏలీయా ప్రవక్త వద్దకు వచ్చి “నీవు పోయి అహస్యా దూతలను కలిసికొని 'మీరు ఎక్రోను దేవత బాల్సెబూబును సంప్రదింప పోనేల? యిస్రాయేలు దేశమున దేవుడు లేడనియా?

4. ప్రభువు మీ రాజునకిట్లు సెలవిచ్చుచున్నాడు. నీవు పడకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చత్తువని చెప్పుము' " అని పలికెను. ఏలీయా దేవదూత చెప్పినట్లే చేసెను.

5. దూతలు అహస్యా వద్దకు తిరిగిరాగా అతడు “మీరేల మరలి వచ్చితిరి?” అని అడిగెను.

6. వారు అహాస్యాతో “మేము త్రోవలో ఒకనిని కలిసికొంటిమి. అతడు మమ్ముచూచి మీ రాజు వద్దకు వెళ్ళి ప్రభువు పలుకులుగా ఇట్లు తెలియజేయుడు 'నీవు ఎక్రోను దేవత బాల్సెబూబును సంప్రదింపపోనేల? యిస్రాయేలు దేశమున దేవుడు లేడనియా? నీవు పడకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చతువు అని పలికెను' ” అని చెప్పగా

7. “మీకు కనిపించిన వాని వాలకమెట్టిది?” అని రాజు దూతలను ప్రశ్నించెను.

8. వారు "అతడు గొంగళి కప్పుకొని, తోలు నడికట్టు కట్టుకొనియుండెను” అని చెప్పిరి. ఆ మాటలకు రాజు “అతడు ఏలీయాయై ఉండును” అని పలికెను.

9. రాజు ఏలీయాను కట్టి తెచ్చుటకై ఏబదిమంది బంటులతో సేనాపతిని పంపెను. వారు వచ్చునప్పటికి ఏలియా ఒక కొండపై కూర్చుండియుండగా, సేనాపతి ఎక్కి అతనిని సమీపించి “దైవభక్తుడా! రాజు నిన్ను క్రిందికి దిగిరమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అని అనెను.

10. ఏలీయా అతనితో “నేను దైవభక్తుడనేని మింటి నుండి నిప్పు దిగివచ్చి నిన్ను, నీ ఏబదిబంటులను కాల్చివేయునుగాక!” అని పలికెను. వెంటనే నిప్పు దిగి వచ్చి సైన్యాధిపతిని అతని బంటులను కాల్చివేసెను.

11. “అంతట రాజు ఏబదిమంది బంటులతో మరొక సైన్యాధిపతిని పంపెను. అతడు ఏలీయావద్దకు వెళ్ళి “దైవభక్తుడా! రాజు నిన్ను వెంటనే క్రిందికి దిగిరమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అనెను.

12. కాని ఏలీయా “నేను దైవభక్తుడనేని మింటినుండి నిప్పు దిగివచ్చి నిన్ను, నీ ఏబదిమంది బంటులను కాల్చివేయును గాక!" అని పలికెను. వెంటనే నిప్పు దిగివచ్చి సైన్యాధిపతిని అతని బంటులను కాల్చివేసెను.

13. రాజు మరల ఏబదిమంది బంటులతో వేరొక సైన్యాధిపతిని పంపగా, ఏబదిమందిమీద అధిపతియైన ఆ మూడవ వాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్ళూని, “దైవ భక్తుడా! మమ్ము కరుణించి మా ప్రాణములు కాపా డుము.

14. ముందు వచ్చిన ఇద్దరు సైన్యాధిపతులను, వారి బంటులను ఆకాశమునుండి వచ్చిన నిప్పు కాల్చివేసెను. కావున నీవు మా ప్రాణములను కాపాడవలెను” అని వేడుకొనెను.

15. అప్పుడు ప్రభువుదూత ఏలీయాతో “నీవు భయపడక ఇతనితో వెళ్ళుము” అని చెప్పెను. ఏలీయా సైన్యాధిపతితో రాజు వద్దకు వెళ్ళేను.

16. అతడు రాజుతో “ప్రభువు సందేశమిది. యిస్రాయేలు దేశమున దేవుడు లేడో అన్నట్లు నీవు ఎకోను దేవత బాల్సెబూబును సంప్రదించుటకు దూతలనంపితివి. కనుక నీవు పడుకనుండి క్రిందికి దిగజాలవు. నీవు తప్పక చత్తువు” అని పలికెను.

17. ప్రభువు ఏలీయా ద్వార నుడివినట్లే రాజు మరణించెను. అహస్యాకు కుమారులు లేరు. కనుక అతని తమ్ముడు యెహోరాము రాజయ్యెను. యూదా రాజ్యమున యెహోషాఫాత్తు కుమారుడు యెహోరాము పరిపాలన కాలమున రెండవయేట ఈ సంఘటన జరిగెను.

18. అహస్యాను గూర్చి ఇతరాంశములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే యున్నవి.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services