ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 19

 1. వారి మాటలు విని హిజ్కియా విచారముతో బట్టలుచించుకొని గోనెపట్టను తాల్చి ప్రభుమందిర మున ప్రవేశించెను.

2. అతడు ప్రాసాదరక్షకుడు ఎల్యాకీమును, రాజలేఖకుడు షెబ్నాను, వృద్ధులైన యాజకులను ఆమోసు కుమారుడగు యెషయా ప్రవక్త వద్దకు పంపెను. వారందరు గోనెలను తాల్చియే వెళ్ళిరి.

3. రాజు యెషయాకు పంపిన సందేశమిది: “ఈనాడు మనకు ఇక్కట్టులు చుట్టుకొన్నవి. శత్రువులు మనలను శిక్షించి అవమానముపాలు చేయుచున్నారు. ప్రసవకాలమువచ్చి, బలములేక బిడ్డలను కనజాలని గర్బిణివలె మనము ఉన్నాము.

4. అస్సిరియా రాజు పంపిన రబ్షాకె సజీవుడైన ప్రభువును తూలనాడెను. నీవు కొలుచు ప్రభువు ఈ నిందావాక్యములను ఆలించుగాక! వానిని పలికినవారిని శిక్షించుగాక! నీవు మాత్రము శేషముగా మిగిలియున్నవారిని కరుణింపుము అని ప్రభువునకు మనవిచేయుము.”

5. యెషయా ఆ సందేశము విని రాజునకు ఈ ప్రతిసందేశము పంపెను:

6. "ప్రభువుసందేశమిది. అస్సిరియా రాజు సేవకులు నన్ను దూషించి పలికిన మాటలు విని నీవు భయపడవలదు.

7. నేను ఆ రాజునకు దుష్టప్రేరణము కలిగింతును. అతడొక వదంతివిని తన దేశమునకు మరలిపోవును. తన దేశముననే కత్తివాదరకు ఎరయగును. ఇది అంతయు నా వలన జరుగును.”

8. అస్సిరియా ప్రతినిధి రబ్షాకె తన రాజు లాకీషు నుండి వెడలిపోయి లిబ్నా నగరమును ముట్టడించు చున్నాడని వినెను. కనుక అతడు రాజును సంప్రదించుటకై అచటికి వెళ్ళెను.

9. అంతలోనే ఇతియోపియా రాజు తిర్హకా అస్సిరియా మీదికి దండెత్తి వచ్చుచున్నా డని వార్త వచ్చెను. ఆ వార్త అందినపిమ్మట అస్సిరియా రాజు మరల దూతలనంపి యూదారాజు హిజ్కియాను ఇట్లు ఆజ్ఞాపించెను:

10. “నీవు నమ్ముకున్న యావే ప్రభువు యెరూషలేము నా వశముకాదని నుడువుచున్నాడు అను మాటలు నమ్మి నీవు మోసపోవలదు.

11. ఇంతవరకు అస్సిరియా రాజులు నానారాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా?

12. మా పూర్వులు గోషాను, హారాను, రెసెపు పట్టణములను నాశనము చేసిరి. తెలాస్సారున వసించుచున్న బేతేదేను ప్రజలను సంహరించిరి. వారి దైవములు వారిని రక్షింపగలిగిరా?

13. హమాతు, అర్పాదు, సెఫర్వాయీము, హెనా, ఇవ్వారాజులు ఇప్పుడేమైరి?" ,

14. హిజ్కియా రాజు దూతలనుండి ఆ జాబు నందుకొని చదివెను. అంతట అతడు దేవాలయమునకు వెళ్ళి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్ధించెను:

15. “యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై యుందువు. నీవొక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటిని ఏలువాడవు నీవే. భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే.

16. ప్రభూ! వీనులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవ దేవుడవైన నిన్ను కించపరచుటకు సన్హారీబు పలికిన పలుకులు ఆలింపుము.

17. అస్సిరియా రాజులు నానాజాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరనుట నిజమే.

18. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములా? నరులు మలిచిన రాతి ప్రతిమలును, కొయ్యబొమ్మలే కదా!

19. కనుక ప్రభూ! ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా రాజు దాడినుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును.”

20. అంతట ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి 'అస్సిరియారాజు నుండి కాపాడుమని నీవు పెట్టిన మొరను ప్రభువు అలించెను' అని చెప్పెను.

21. అస్సిరియా రాజు సన్హరీబునుగూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి: “ఓయి! యెరూషలేము కన్య నిన్నుచూచి నవ్వుచున్నది. నిన్ను చిన్నచూపు చూచుచున్నది. తలాడించుచున్నది.

22. నీవెవరిని అవమానించి దూషించితివో గుర్తించితివా? కన్నుమిన్ను గానకెవరిని నిందించితివో తెలిసికొంటివా? నీవు నీ దూతలతో ప్రభువును గేలిచేసితివి. యిస్రాయేలు పరిశుద్ధదేవుడనైన నన్నే తృణీకరించితివి.

23. 'నా రథములతో నేను ఎత్తయిన కొండలనెక్కితిని. లెబానోనును అధిరోహించితిని. అచటి దేవదారులను, తమాల వృక్షములను నరికించితిని. ఆ అడవుల అంచులవరకు వెళ్ళితిని.

24. అన్యదేశములలో  బావులు త్రవ్వించి నీళ్ళు త్రాగితిని. నా సైన్యముల పాద తొక్కుడులవలన ఐగుప్తునదులు ఎండిపోయినవి' అని నీవు నా యెదుట ప్రగల్భములాడితివి.

25. కాని ఈ విజయములన్నిటిని నేను పూర్వమే నిర్ణయించితిని. ఇప్పుడు క్రియాపూర్వకముగా నిర్వహించితిని. నీవు సాధనమాత్రుడవై సురక్షిత పట్టణములను కూలద్రోసితివి. '

26. ఆ పట్టణములందలి జనులు భయపడి నిశ్చేష్టులైరి. వారు తూర్పుగాలికి సోలిపోవు పొలములోని పైరువలె, బీళ్లలోను, మిద్దెలమీద నెదుగు గడ్డివలె గడగడలాడిరి.

27. నిన్ను గూర్చి నాకు బాగుగా తెలియును. నీ రాకపోకలు, నీ చేతలు నేనెరుగుదును. నీవు నామీద రంకెలువేయుట నేను గుర్తించితిని.

28. నేను నీ అహంకారమును గూర్చి వింటిని. నేను నీకు ముక్కుత్రాడు వేయింతును. నీ నోటికి కళ్ళెము వేయింతును. నీవు వచ్చిన త్రోవనే వెడలిపోయెదవు.

29. హిజ్కియా! నీవు ఈ గురుతును గమనింపుము. ఈ యేడు రాబోవు యేడుగూడ మీకు దానంతటది పడి మొలిచిన ధాన్యమే లభించును. కాని మూడవయేడు మీరు పైరువేసి కోతకోయుదురు. ద్రాక్షలు పెంచి పండ్లు కోసికొందురు.

30. యూదా రాజ్యమున తప్పించుకొనిన శేషము నేలలోనికి వ్రేళ్ళు జొన్ని, మీద పండ్లుకాయు వృక్షమువలె వృద్ధి చెందుదురు.

31. శేషిత ప్రజలు యెరూషలేమున నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను.

32. అస్సిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు. దాని మీద ఒక్క బాణమునైనను వదలజాలడు. డాలుతో దానిచెంతకు రాజాలడు. దానిచుట్టు ముట్టడికి మట్టిదిబ్బలు పోయజాలడు.

33. అతడు తాను వచ్చిన త్రోవపట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంతమాత్రమును ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి.

34. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును.”

35. ఆ రాత్రి ప్రభువుదూత అస్సిరియా శిబిరమునకు పోయి లక్ష ఎనుబది ఐదు వేలమంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరు చచ్చి పడియుండిరి.

36. అంతట అస్సిరియా రాజు సైన్యమును తరలించుకొని నీనెవెకు మరలిపోయెను.

37. అచట ఒకనాడు సన్హరీబు తన దేవత నిస్రోకుకు మ్రొక్కుచుండగా అతని కుమారులు అద్రెమ్మెలెకు, షరెసేరు అతనిని కత్తితో వధించి అరారాతు దేశమునకు పారి పోయిరి. అటుపిమ్మట అతని మరియొక పుత్రుడు ఏసర్హద్ధోను తండ్రికి బదులుగా రాజయ్యెను.