ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 18

 1. యిస్రాయేలునందు ఏలా కుమారుడు హోషేయ పరిపాలనాకాలమున మూడవయేట, అహాసు కుమారుడు హిజ్కియా యూదా రాజ్యమునకు రాజయ్యెను.

2. అతడు ఇరువదియైదవ యేట రాజ్యమునకు వచ్చెను. యెరూషలేమునుండి ఇరువది తొమ్మిదియేండ్లు పరిపాలించెను. అతని తల్లి జెకర్యా కుమార్తె అబీ.

3. అతడు తన పితరుడు దావీదువలె ధర్మబద్దముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను.

4. ఆ రాజు ఉన్నత స్థలములమీది మందిరములను తొలగించెను. విగ్రహములను నిర్మూలించెను. అషెరా దేవతావృక్షములను నరికించెను. మోషే చేయించిన కంచుసర్పమును గూడ ముక్కముక్కలు గావించెను. దాని పేరు నెహుష్టాను. అంతవరకును యిస్రాయేలీయులు దానికి ధూపమువేయుచునే యుండిరి.

5. హిజ్కియా యిస్రాయేలు దేవుడు యావేను నమ్మెను, యూదాను ఏలిన రాజులలో అతనికి ముందుగాని, అతనికి వెనుకగాని అతని వంటివారు లేరు.

6. అతడు ప్రభువునకు అనుచరుడయ్యెను. ప్రభువు మోషేద్వారా  ప్రసాదించిన ఆజ్ఞలను పూర్తిగా పాటించెను.

7. యావే హిజ్కియాకు బాసటయై ఉండెను గనుక అతడు తల పెట్టిన కార్యములన్నియు సఫలమయ్యెను. ఆ రాజు అస్సిరియారాజుమీద తిరుగబడి అతనికి కప్పము కట్టడయ్యెను.

8. ఫిలిస్తీయులను ఓడించి వారి గ్రామములను, పట్టణములను జయించెను. గాజాను, దాని పరిసరప్రాంతములనుగూడ వశము చేసికొనెను.

9. హిజ్కియా యేలుబడి నాలుగవయేట, అనగా యిస్రాయేలున హోషేయ యేలుబడి ఏడవయేట, అస్సిరియారాజైన షల్మనే సెరు యిస్రాయేలుమీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించెను.

10. ముట్టడి మూడవయేట సమరియా ఓడిపోయెను. ఇది హిజ్కియా పరిపాలనమున ఆరవయేడు, హోషేయ పరిపాలనమున తొమ్మిదవయేడు.

11. అస్సిరియా రాజు యిస్రాయేలీయులను తన దేశమునకు బందీలనుగా కొనిపోయెను. వారిలో కొందరికి హాల నగరమునను, కొందరికి గోషాను మండలములోని హాబోరు నదీప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను.

12. యిప్రాయేలీయులు ప్రభువు మాటను పాటింపరైరి. అతని నిబంధనమును మీరిరి. ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞలను ధిక్క రించిరి. వారు ఆ ఆజ్ఞలను విననూ లేదు, పాటింపనూ లేదు, కనుకనే సమరియా నాశనమయ్యెను.

13. హిజ్కియా యేలుబడి పదునాలుగవ యేట అస్సిరియా రాజు సన్హారీబు యూదా రాజ్యములోని సురక్షిత పట్టణములను ముట్టడించి జయించెను.

14. హిజ్కియా లాకీషున నున్న సన్హారీబునొద్దకు దూతల నంపి “నేను తప్పుచేసితిని. నీ దాడి చాలింపుము. నేను నీవు విధించిన పన్ను చెల్లింతును" అని చెప్పించెను. అస్సిరియా రాజు హిజ్కియాను పది బారువుల వెండిని, ఒక బారువు బంగారమును చెల్లింపుమని కోరెను.

15. యూదారాజు దేవాలయ కోశాగారమునను, ప్రాసాద కోశాగారమున ఉన్న వెండిని ప్రోగుజేసి పంపించెను.

16. దేవాలయ ద్వారములకును, ద్వారబంధములకును పొదిగిన బంగారమునుగూడ ఒలిపించి అస్సిరియా రాజునకు పంపెను.

17. అస్సిరియారాజు యెరూషలేమును ముట్టడించుటకై లాకీషునుండి తన ప్రతినిధులు తర్తాను, రబ్సారీసు, రబ్షాకె అనువారికి జతగా పెద్ద సైన్యమును పంపెను. వారు యెరూషలేము చేరుకొని, మీది చెరువు నుండి వచ్చిన నీరు నిలుచు కోనేటివద్ద విడిదిచేసిరి. అచ్చటనే చాకిరేవును కలదు.

18. అచటినుండి వారు రాజును పిలిపించిరి. కాని హిజ్కియాకు మారుగా రాజోద్యోగులు ముగ్గురు వారి వద్దకు వెళ్ళిరి. వారు రాజప్రాసాద పాలకుడును, హిల్కియా కుమారుడునగు ఎల్యాకీము, ధర్మశాస్త్ర బోధకుడగు షెబ్నా, రాజు లేఖకుడైన ఆసాపు కుమారుడగు యోవా.

19. అపుడు రబ్షాకె వారితో ఇట్లనెను “అస్సీరియా మహాప్రభువు మీ రాజుతో ఇట్లు చెప్పుమనుచున్నాడు. 'ఓయి! నీవు ఏమి చూచుకొని ఇంత మదించితివి?

20. యుద్ధము చేయుటకు బలముండవలెనుగాని వట్టిమాటలతో ఏమి లాభము? నీవు ఎవరిని నమ్ముకొని మామీద తిరుగ బడితివి?

21. ఐగుప్తు నీకు తోడ్పడుననుకొంటివి కాబోలు. ఆ దేశమును నమ్ముకొనుట రెల్లుకాడను ఊతకఱ్ఱగా వాడుకోగోరుటయే. ఆ కాడ విరిగి చేతిలో గ్రుచ్చుకొనును. ఐగుప్తు ఫరోను నమ్ముకొనువారికి చేకూరు ఫలితమును అంతే.

22. ఒకవేళ మీరు మీ దేవుడైన యావే ప్రభువును నమ్ముకొంటిమని మీరు నాతో చెప్పుదురేమో! యూదా వాసులును, యెరూషలేము పౌరులును ఇకమీదట యెరూషలేముననే ప్రభువుని ఆరాధింపవలయునని ఆజ్ఞాపించి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యావే!'

23. మా రాజు తరపున నేను మీతో పందెము వేయుచున్నాను, వినుడు. నేను మీకు రెండువేల గుఱ్ఱములను ఉచితముగా ఇత్తును. కాని వానిని ఎక్కుటకు మీకు రెండువేలమంది రౌతులు మీ వద్ద కలరా?

24. అటుల కానియెడల మీరు మా యజమానుని అత్యల్పులలో అధిపతి అయిన ఒకనిని ఎట్లు ఎదిరింపగలరు? అయినను ఐగుప్తు మీకు రథములు, గుఱ్ఱములు పంపునని కాచుకొని యున్నారు. ఎంత వెఱ్ఱి!

25. నేను మీ దేవుని అనుమతి లేకయే మీ దేశము మీదికి దండెత్తి వచ్చితినను కొంటిరా! యావే ప్రభువు నన్ను మీ దేశముపై దండెత్తి మిమ్ము నాశనము చేయుమని చెప్పెను” అని పలికెను.

26. అప్పుడు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవా అతనితో "అయ్యా! నీవు మాతో అరమాయికు భాషలో మాటలాడుము. మాకు ఆ భాష తెలియును. నీవు హీబ్రూభాషలో మాటలాడెద వేని ప్రాకారముమీదనున్న జనులెల్లరు అర్థము చేసికొందురు” అనిరి.

27. కాని అతడు వారితో “మీతోను మీ రాజుతోను మాత్రమే మాట్లాడుటకు మా ప్రభువు నన్నిటకు పంపెననుకొంటిరా? నేను ఆ ప్రాకారము మీద కూర్చున్నవారితో గూడ మాట్లాడవలయును. మీ వలె వారును అనతికాలములోనే తమ మలమూత్రములను తినవలసివచ్చును” అనెను.

28. అంతట రబ్షాకె లేచి నిలుచుండి జనులందరు వినునట్లు హీబ్రూ భాషలో పెద్దగా ఇట్లు పలికెను: “ప్రజలారా! అస్సిరియా మహాప్రభువు పలుకులు వినుడు!

29. ఈ హిజ్కియా రాజు మిమ్ము మోసగించుచున్నాడు. అతడు ఏ విధమునైనను మా రాజు దాడినుండి మిమ్ము కాపాడలేడు.

30. ఈ పట్టణము అస్సిరియనుల చేజిక్కకయుండునట్లు యావే మనలను రక్షించునను మాటలతో హిజ్కియా మిమ్ము నమ్మించుచున్నాడు.

31. మీరు హిజ్కియా మాట వినవద్దు. మా రాజు వచనములాలింపుడు. నాతో సంధికి నగరము వీడివచ్చి అస్సిరియా రాజునకు లొంగిపొండు. అప్పుడు మీరు మీ ద్రాక్షతోటలలో కాసిన పండ్లను భుజింతురు. మీ అంజూరముల మీద ఫలించిన పండ్లను తిందురు. మీ బావులలోని నీళ్ళు త్రాగుదురు.

32. అటుపిమ్మట మా రాజువచ్చి మిమ్ము మరొక దేశమునకు కొనిపోయి అచట స్థిర నివాసము కల్పించును. ఆ భూమికూడ మీ నేల వంటిదే. ఇక్కడివలె అక్కడను ద్రాక్షలు కాయును. గోధుమ పండును. ఓలివు తోటలు పెరుగును. తేనె లభించును. మా రాజు మాట పాటింతురేని మీరు సుఖముగా జీవింతురేకాని నాశనముకారు. హిజ్కియా పలుకులాలించి యావే మిమ్ము రక్షించునని నమ్మి మోసపోకుడు.

33. లోకములో ఇన్ని జాతులున్నవి కదా! మీరే చెప్పుడు, ఆ జాతులు కొలుచుదైవములు మా రాజు బారినుండి వారి దేశములను కాపాడగల్గిరా?

34. హమాతు, అర్పాదు దైవములేరి? సెఫర్వాయీము, హెనా, ఇవ్వా అనువారి దైవములెక్కడ? ఇంత ఎందులకు? మారాజు దాడినుండి సమరియాను ఏ దైవము రక్షించెను?

35. ఈ దేశముల దైవములలో ఎవరైన మారాజు దాడినుండి తమ రాజ్యములను కాపాడు కోగళారా? మరి యావే నేడు మీ యెరూషలేమును మాత్రమెట్లు కాపాడగలడు?"

36. ప్రజలు అస్పిరియా వాని మాటలకు జవాబు చెప్పలేదు. హిజ్కియా వారిని నోరు మెదపవద్దని ముందుగనే ఆఙ్ఞాపించియుండెను.

37. ఎల్యాకీము, షెబ్నా, యోవా శత్రువు మాటలువిని బట్టలు చించుకొనిరి. తమ రాజువద్దకు వెళ్ళి రబ్షాకె పలికిన పలుకులు విన్పించిరి.