ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 18

 1. యెహోషాఫాత్తు విస్తారమైన సిరి సంపదల తోను, కీర్తి ప్రతిష్ఠలతోను వెలుగొందుచు అహాబు రాజుతో వియ్యమందెను.

2. కొన్ని యేండ్ల తర్వాత అతడు సమరియాలోని అహాబురాజును సందర్శింప బోయెను. అహాబు చాల గొఱ్ఱెలను, ఎడ్లను కోయించి ఆ రాజునకును అతని పరిచారకులకును విందు చేయించెను. అతడు తనతోగూడి గిలాదునందలి రామోతును ముట్టడించుటకు యెహోషాఫాత్తును పురి కొల్పెను.

3. అహాబు “నీవు నాతోగూడ రామోతు మీదికి యుద్ధమునకు వత్తువా” అని అడిగెను. యెహోషాఫాత్తు “నేనును నీవలె యుద్ధమునకు సిద్ధముగనే యున్నాను. నా సైనికులును నీ సైనికులవలె పోరునకు తయారుగనే యున్నారు. మేము నీ పక్షమున పోరాడుదుము” అనెను.

4. మరియు అతడు “మనము మొదట యావేను సంప్రదింతుము” అని పలికెను.

5. కనుక అహాబు తన ప్రవక్తలను నాలుగు వందలమందిని పిలిపించి “నేను రామోతు మీదికి దాడి చేయవచ్చునా, చేయకూడదా?” అని ప్రశ్నించెను. వారెల్లరును “దాడి చేయుము. ప్రభువు ఆ నగరమును నీ చేతి కప్పగించును” అని పలికిరి.

6. కాని యెహోషాపాత్తు “ప్రభువును సంప్రతించుటకు ఇచట మరియొక ప్రవక్త ఎవరును లేరా?” అని ప్రశ్నించెను.

7. అహాబు “ఇమ్లా కుమారుడైన మీకాయా అనువాడు ఉన్నాడు. కాని అతడనిన నాకు ఇష్టములేదు. అతడెప్పుడును నాకు అశుభమునేగాని శుభసందేశ మును విన్పింపడు” అని చెప్పెను. యూదారాజు “రాజు ఆలాగు అనవలదు” అని పలికెను.

8. అంతట యిస్రాయేలు రాజు ఒక సేవకుని పంపి మీకాయాను శీఘ్రముగా తోడ్కొని రమ్మని ఆదేశించెను.

9. ఆ ఇరువురు రాజులు రాజవస్త్రములు ధరించి సమరియా నగర ద్వారము చెంతగల కళ్ళము వద్ద సింహాసనాసీనులై యుండిరి. ప్రవక్త లెల్లరు వారి ముందట ప్రోగై ప్రవచనములు చెప్పుచుండిరి.

10. కెనానా కుమారుడైన సిద్కియా ప్రవక్త ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చెను. అతడు అహాబు రాజుతో “ప్రభువు వాక్కిది. నీవు ఈ కొమ్ములతో సిరియనులను పొడిచి వారిని ఓడింతువు"అని పలికెను.

11. ఇతర ప్రవక్తలును అటులనే ప్రవచించిరి. “నీవు రామోతు మీదికి దండెత్తి దానిని జయింపుము. ప్రభువు ఆ నగరమును నీ వశము చేయును” అని చెప్పిరి.

12. మీకాయాను పిలువబోయిన సేవకుడు అతనితో “ప్రవక్తలెల్లరును ఏకకంఠముతో రాజునకు విజయము కలుగునని చెప్పిరి. నీవుకూడ రాజునకు విజయము కలుగునని చెప్పుము” అని పలికెను.

13. కాని మీకాయా “యావే జీవముతోడు. నేను ప్రభువు చెప్పుమనిన మాటలే చెప్పెదను” అనెను.

14. ప్రవక్త అహాబు నొద్దకు రాగానే ఆ రాజు “ఓయి! మమ్ము రామోతు మీదికి దండెత్తుమందువా, వలదందువా?" అని ప్రశ్నించెను. మీకాయా “దండెత్తుడు. మీకు తప్పక విజయము కలుగును. ప్రభువు ఆ నగరమును మీ పరము చేయునులే” అనెను.

15. ఆ మాటలకు రాజు “ఓయీ! ప్రభువు పేరు మీదుగా మాటాలాడు నపుడు నాతో నిజమునే చెప్పవలెనని నిన్ను ఎన్ని మారులు మందలింపలేదు?” అనెను.

16. అప్పుడు మీకాయా “యిస్రాయేలీయులెల్లరును కాపరిలేని మందవలె కొండలమీద చెల్లాచెదరగుటను నేను చూచితిని. ఈ ప్రజలకు నాయకుడు లేడు కనుక వారు నిశ్చింతగా తమ ఇండ్లకు వెళ్లిపోవచ్చునని ప్రభువు నుడివెను” అని చెప్పెను.

17. అహాబు యెహోషాఫాత్తుతో “ఇతడు నా అపజయమునే గాని విజయమునెరిగించు ప్రవచనము చెప్పడని నేను నీతో ముందుగనే వచింపలేదా?" అని పలికెను.

18. మీకాయా అహాబుతో “దేవుని మాట వినుము. ప్రభువు ఆకాశమున సింహాసనముపై ఆసీనుడై యుండగా నేను చూచితిని. పరమండల సైన్యము ఆయనకు కుడిఎడమల బారులుతీరి నిలువబడి యుండుట చూచితిని.

19. 'అహాబును మభ్యపెట్టి రామోతునకు పంపి అచట అతడు ప్రాణములు కోల్పోవునట్లు ఎవరు ప్రేరేపింపగలరు?' అని ప్రభువు ప్రశ్నించగా, ఒకరు ఒకరీతిగను, మరియొకరు ఇంకొక రీతిగాను ప్రత్యుత్తరము ఇచ్చిరి.

20. అప్పుడొక ఆత్మ ప్రభువు ఎదుటికి వచ్చి 'నేనతనిని మభ్య పెట్టుదును' అని పలికెను. 'ఏ రీతిని మభ్యపెట్టుదువు' అని ప్రభువు అడిగెను.

21. ఆ ఆత్మ 'నేను వెళ్ళి అహాబు ప్రవక్తల చేత అబద్దములు చెప్పింతును' అని పలికెను. 'సరియే వెళ్ళి నీవు చెప్పినట్లే చేయుము. నీవు ఆహాబును మభ్యపెట్టగలవు' అని ప్రభువు నుడివెను.

22. ఇప్పుడు ప్రభువు నీ ప్రవక్తలగు వీరినోట అబద్దములు చెప్పు ఆత్మను ఉంచియున్నాడు. కాని ప్రభువు మాత్రము నిక్కముగా నిన్ను నాశనము చేయనెంచెను” అని పలికెను.

23. అప్పుడు కెనాను కుమారుడగు సిద్కియా మీకాయా మీదికి వచ్చి అతని చెంపమీద కొట్టి “ప్రభువు ఆత్మ నన్ను విడనాడి నీతో మాటలాడ మొదలిడినది ఎప్పటినుండి?” అని యడిగెను.

24. మీకాయా అతనితో “నీవు ఇంటిలోపలి గదిలోనికి పరుగిడి దాగుకొనునపుడు నీకే తెలియును పొమ్ము” అనెను.

25-26. అహాబు తన ఉద్యోగిని ఒకనిని పిలిచి “మీకాయాను బంధించి నగరపాలకుడైన ఆమోనునకును, యువరాజగు యోవాసునకును అప్పగింపుము. ఇతనిని చెరలో త్రోయవలయుననియు నేను రణము నుండి సురక్షితముగా తిరిగి వచ్చువరకు ఇతని ఆహార పానీయముల విషయములో కఠినముగా వ్యవహరింపవలెననియు” అని ఆజ్ఞాపించెను.

27. కాని మీకాయా “నీవు సురక్షితముగా తిరిగివత్తువేని ప్రభువు నాద్వారా మాట్లాడలేదు అనుకొనుము. ఇచట వారెల్లరును నా పలుకులు ఆలింతురు గాక!” అనెను.

28. యిస్రాయేలు రాజగు అహాబు, యూదా రాజగు యెహోషాఫాత్తు గిలాదునందలి రామోతు మీదికి దండెత్తిపోయిరి.

29. అహాబు యెహోషాఫాత్తుతో “నేను మారువేషమున వత్తును. నీవు రాజవస్త్రములు ధరించియే రమ్ము" అని చెప్పెను. అహాబు మారువేషమున రాగా వారిరువురు యుద్ధరంగమునకు పోయిరి.

30. యిస్రాయేలు రాజును తప్ప మరియెవరిని పట్టుకోవలదని సిరియారాజు తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను.

31. కాని ఆ రథాధిపతులు యెహోషాపాతును చూచి అతడే యిస్రాయేలు రాజని భ్రాంతిచెంది అతని వెంటబడిరి. యెహోషాఫాత్తు మొట్టపెట్టినందున ప్రభువు అతనిని ఆదుకొనెను. కనుక యెహోషాఫాత్తును వెన్నాడువారు అతనిని విడనాడి వెళ్ళిపోయిరి.

32. రథాధిపతులు అతడు యిస్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదలివేసిరి.

33. అప్పుడు సిరియా సైనికుడొకడు గురిచూడకయే యాదృచ్చికముగా బాణమును విడువగా అది అహాబు కవచము అతుకుల మధ్య తగిలి అతని ఒడలిలోనికి గ్రుచ్చుకొనిపోయెను. ఆ రాజు తన రథమును తోలువానితో “నాకు గాయము తగిలినది. రథమును యుద్ధభూమినుండి వెలుపలికి తోలుము” అని చెప్పెను.

34. యుద్ధము కొనసాగుచుండగా అహాబు సిరియా సైన్యమువైపు మళ్ళి రథమునందు నిలుచుండెను. ప్రొద్దుక్రుంకు నపుడు అతడు కన్నుమూసెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services