ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 18

 1. కరువు ప్రారంభమైన మూడవ యేట ప్రభువువాణి ఏలీయాతో “నీవు వెళ్ళి అహాబును కలిసికొనుము. నేను దేశమున వాన కురియింతును” అని చెప్పెను.

2. కనుక ఏలీయా అహాబును చూడబోయెను. ఆ రోజులలో సమరియా దేశమున కరువు దారుణముగా నుండెను.

3. అహాబు ఓబద్యాను పిలిపించెను. ఇతడు రాజభవంతి రక్షకుడు, యావేయందు భయభక్తులు గలవాడు.

4. యెసెబెలు రాణి యావే ప్రవక్తలను చంపించుచుండగా, ఈ ఓబద్యా నూరు గురు ప్రవక్తలను, ఏబదిమంది ఏబదిమంది చొప్పున, కొండగుహలలో దాచియుంచి వారిని అన్నపానీయములతో పోషించుచువచ్చెను.

5. రాజు ఓబద్యాతో “మన దేశమునగల చెలమలను, వాగులను పరిశీలించి వచ్చెదము రమ్ము. మన గుఱ్ఱములకు, గాడిదలకు గడ్డి చాలినంత దొరకునో లేదో తెలిసికొందము. మేతచాలదేని మన పశువులను కొన్నిటిని పోగొట్టు కొనవలసియుండును” అనెను.

6. వారిరువురు దేశమును. చెరియొక భాగముచొప్పున పంచుకొని ఎవరి భాగమును వారు పరిశీలింపబోయిరి.

7. మార్గమున ఏలీయా ఓబద్యాను కలిసికొనెను. ఓబద్యా ప్రవక్తను గుర్తుపట్టి నమస్కారముచేసి “నీవు ఏలీయావే గదా!" అని అడిగెను.

8. ప్రవక్త అతనితో “అవును, నేను ఏలీయానే. నీవు వెళ్ళి మీ రాజుకు నా సమాచారము తెల్పుము” అనెను.

9. ఓబద్యా అతనితో “అహాబు కోపమునకు గురియై నేను ప్రాణములు కోల్పోవలసి వచ్చును. అంతటి అపరాధమును నేనేమి చేసితిని?

10. సజీవుడైన యావే తోడు. రాజు నీ కొరకు ప్రతి దేశమును వెదకించెను. ఏ దేశీయులైన నీవు కన్పింపలేదని చెప్పగా ఆ మాట నిజమోకాదో అని రాజు వారిచే ప్రమాణముకూడ చేయించెడివాడు.

11. ఇపుడు నేను వెళ్ళి రాజునకు నీ సమాచారము ఎరిగింపవలెనా?

12. నేను వెళ్ళగనే దేవుని ఆత్మ నిన్నెక్కడికో కొనిపోవును. నేనుపోయి అహాబుతో నీవిక్కడ ఉన్నావని చెప్పగా, అటుపిమ్మట నీవిక్కడ కన్పింపక పోగా, అతడు నన్ను తప్పక చంపివేయును. నేను చిన్ననాటినుండి ప్రభువునే సేవించితినిగదా!

13. యెసెబెలు ప్రభువు ప్రవక్తలను చంపించుచుండగా నేను నూరుగురు ప్రవక్తలను ఏబదిమంది ఏబది మంది చొప్పున కొండగుహలలో దాచియుంచి అన్నపానీయములతో పోషించితినని నీవెరుగుదువు.

14. మరి ఇప్పుడు నీ నోటితో 'నీవు వెళ్ళి అహాబునకు నా సమాచారము ఎరిగింపుము' అని పలుకుదువా? అతడు నన్ను తప్పక చంపితీరును” అని అనెను.

15. ఏలీయా అతనితో “యిస్రాయేలు దేవుడైన యావే సన్నిధిని నేను నిలబడుచున్నాను. మహోన్నతుడైన యావే జీవముతోడు. ఈ దినము నేనే వెళ్ళి స్వయముగా రాజునకు కన్పింతును” అనెను.

16. ఓబద్యా అహాబును కలసికొని ఏలీయా ఉదంతమును ఎరిగించెను. రాజు ఏలీయాను చూడ బోయెను.

17. ఏలీయా తన కంటబడగనే అహాబు “యిస్రాయేలు దేశమునకు నీ పీడపట్టినది” అనెను.

18. కాని ఏలీయా (ప్రవక్త) అతనితో “యిస్రాయేలును పట్టి పీడించునది నీవును, నీ కుటుంబమేగాని నేను గాదు. నీవు దేవుని ఆజ్ఞ మీరి బాలుదేవతను కొలుచు చుంటివిగదా?

19. ఇక వినుము. యిస్రాయేలీయుల అందరిని కర్మెలు కొండమీద నన్ను కలిసికొమ్మని చెప్పుము. యెసెబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలు నాలుగువందలఏబదిమందిని, అషేరా ప్రవక్తలు 'నాలుగువందలమందిని ఆ చోటికి తోడ్కొనిరమ్ము" అని పలికెను.

20. అహాబు యిస్రాయేలీయులందరిని, బాలు ప్రవక్తలను కర్మెలు కొండమీద ప్రోగుజేసెను.

21. అప్పుడు ఏలీయా ముందుకు వచ్చి “ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? యావే దేవుడేని అతనిని పూజింపుడు. బాలు దేవుడేని అతనిని పూజింపుడు” అని పలికెను. కాని ప్రజలొక్క పలుకైన పలుకరైరి.

22. ఏలీయా మరల “ప్రభువు ప్రవక్తలలో మిగిలియున్నవాడను నేనొక్కడనే. కాని బాలు ప్రవక్తలు నాలుగువందలయేబది మంది ఉన్నారు.

23. మాకు రెండెడుల నిప్పింపుడు. వారినొక ఎద్దును తీసికొమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెలమీద పేర్చవలెను. నిప్పుమాత్రము అంటింపరాదు. నేను తీసికొన్న రెండవ ఎద్దునుకూడ అట్లే కట్టెలమీద పేర్చెదను గాని నిప్పంటింపను.

24. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుని ప్రార్థింతురు. నేను యావేను ప్రార్థింతును. ఆ ప్రార్ధనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు” అనెను. ఆ సవాలుకు ప్రజలందరు సరియే అనిరి.

25. ఏలీయా బాలు ప్రవక్తలతో “మీరు చాలమందియున్నారు. కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు. మీ దేవతను ప్రార్థింపుడు. నిప్పు మాత్రము అంటింపకుడు” అని పలికెను.

26. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటినుండి మధ్యాహ్నము వరకు బాలు దేవత పేర ప్రార్థనచేసిరి. “బాలూ! మా మొర వినుము" అని అరచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టు తిరిగి చిందులు తొక్కిరి. అయినను వారి దేవత పలుకలేదు.

27. మధ్యాహ్నమైన పిమ్మట ఏలీయా వారిని వేళాకోళము చేయుచు “మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు. పాపము! అతడేదో ఆలోచనలో పడియుండవచ్చును. లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును. ఒకవేళ ఎక్కడికైన ప్రయాణము కట్టి యుండవచ్చును లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులు ఆలకించి మేల్కొనునులే!” అనెను.

28. ఆ మాటలువిని బాలు ప్రవక్తలింకను పెద్దగా కేకలువేయుచూ, తమ ఆచారముచొప్పున నెత్తురు కారువరకు కత్తులతో, బాకులతో శరీరము కోసికొనిరి.

29. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల నైవేద్యమర్పించు సమయమువరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలుకలేదు. జవాబీయలేదు.

30. అంతట ఏలీయా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరు అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయియున్న యావే బలిపీఠమును మరమ్మతు చేయించెను.

31. యాకోబు కుమారులు పండ్రెండుమంది తెగనాయకుల పేరు మీదిగా పండ్రెండు రాళ్ళను ప్రోగుజేసికొనెను. ఈ యాకోబునకే ప్రభువు యిస్రాయేలని పేరు పెట్టెను.

32. ప్రభువు నామమున ఒక బలిపీఠమును నిర్మించి, దానిచుట్టు రెండుకడవల నీళ్ళుపట్టు కందకము త్రవ్వించెను.

33. అటుపిమ్మట బలిపీఠముమీద కట్టెలుపరచి వానిమీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండెములను పేర్చెను.

34. అటుతరువాత నాలుగు కడవల నీళ్ళు తెచ్చి కట్టెలమీదను, మాంసపుముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలనాజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలీయా రెండవసారి మూడవసారికూడ ప్రజలచే అట్లే నీళ్ళు పోయించెను.

35. నీళ్ళు బలిపీఠము మీది నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను.

36. సాయంకాల నైవేద్యము అర్పించు సమయమున ఏలీయా బలిపీఠమును సమీపించి “అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడవైన ప్రభూ! నీవు యిస్రాయేలు దేవుడవనియు, నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైననే ఈ పనులన్నిటిని చేసితిననియు ఇప్పుడు వెల్లడి చేయుము. 

37. ప్రభూ! నా మొరాలింపుము. నీవే దేవుడవు అనియు, వీరిని మరల తిరిగి నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట ఋజువు చేయుము” అని ప్రార్థించెను.

38. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని బలిపీఠము పైకి దిగివచ్చి పీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించెను.

39. ఆ అగ్నిని చూచి ప్రజలందరు నేలమీద బోరగిలపడి దండము పెట్టి “యావేయే దేవుడు. యావే ఒక్కడే దేవుడు” అని పలికిరి.

40. ఏలీయా “బాలు ప్రవక్తలను పట్టుకొనుడు. ఎవరిని తప్పించుకొని పోనీయకుడు” అనెను. ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొనగా ఏలీయా వారినందరిని కీషోను వాగువద్దకు నడిపించుకొనిపోయి అక్కడ వధించెను.

41. ఏలీయా అహాబుతో “నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము. నాకు వర్షధ్వని వినిపించుచున్నది” అనెను.

42. అహాబు భోజనము చేయబోగా ఏలీయా కర్మెలు కొండమీదికి ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను రెండు మోకాళ్ళమధ్య పెట్టుకొనెను.

43. తరువాత సేవకునితో “నీవు వెళ్ళి సముద్రమువైపు పారజూడుము” అని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగివచ్చి నాకేమియు కనిపింపలేదని పలికెను. ఏలీయా అతనిని ఏడు పర్యాయములు అట్లే పంపెను.

44. కాని సేవకుడు ఏడవసారి తిరిగివచ్చి “సముద్రము మీదినుండి మూరెడంత మబ్బు పైకి లేచుచున్నది” అని చెప్పెను. ఏలీయా అతనితో “నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని అహాబుతో చెప్పుము” అనెను.

45. వెంటనే ఆకాశమున కారుమబ్బులు క్రమ్మి గాలి వీచెను. పెద్దవాన కురిసెను. అహాబు రథమునెక్కి యెఫ్రాయేలునకు వెళ్ళిపోయెను.

46. అప్పుడు యావే హస్తము ఏలీయాను కదలింపగా అతడు నడుము బిగించుకొని అహాబు రథమునకంటె ముందుగా ఉరికి యెస్రెయేలు ప్రాకారమును చేరుకొనెను.