ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 17

 1. రాజు తాకీదు అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినమున అమలులోనికి వచ్చెను. యూదుల శత్రువులు ఆ దినమున వారిని నాశనము చేయవచ్చును గదా అనుకొనిరి. కాని అనుకొనకుండ ఆనాడు యూదులే తమ శత్రువులను అణగదొక్కిరి.

2. ఆయా సంస్థానములోను, పట్టణములలోను వసించు యూదులు ఎక్కడివారు అక్కడే ప్రోగై, తమకు హానితలపెట్టిన వారిమీదపడిరి. ఎల్లరును వారికి భయపడుటచే, ఎవరును వారిని ఎదిరింపజాలరైరి.

3. అధిపతులు, అధికారులు మొదలైన ప్రభుత్వోద్యోగులెల్లరును మొర్దెకయికి జడిసి, యూదులకు సాయపడిరి.

4. రాజప్రాసాదమున మొర్దెకయి పలుకుబడి కలవాడని సంస్థానములందు ఎల్లెడల వెల్లడి ఆయెను. నానాటికి అతని పలుకుబడి హెచ్చుచుండెను.

5. కనుక యూదులు కత్తులు చేపట్టి తమ శత్రువులను చీల్చిచెండాడిరి. విరోధులనెల్ల తమఇష్టము వచ్చినట్లు చేసిరి.

6. ఒక్క షూషను దుర్గముననే ఐదువందల మందిని సంహరించిరి.

7-10. ఆ చచ్చినవారిలో యూదుల శత్రువు హమ్మెదాతా కుమారుడు హామానుని తనయులు పది మంది యుండిరి. వారి పేర్లివి: పర్షందాతా, డల్పోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్మష్టా, అరీసయి, అరీదయి, వైసాతా. అయినను యూదులు శత్రువుల సొమ్మును దోచుకొనలేదు.

11. షూషను దుర్గమున చనిపోయినవారి సంఖ్యను ఆ దినమే రాజునకు తెలియజేసిరి.

12. అతడు ఎస్తేరు రాణితో “ఒక్క షూషను దుర్గముననే యూదులు ఐదువందల మందిని మట్టుబెట్టిరి. హామాను పుత్రులు పదిమందినిగూడ చంపిరి. ఇక వారు మన సంస్థానములలో ఎట్టి కార్యములు చేసిరో! అయినను ఇపుడు నీకేమి కావలయునో చెప్పుము. ఇంకా నీవేమి కోరుకొందువో తెలియజేయుము. నీ కోర్కె తప్పక తీర్చెదను” అనెను.

13. ఎస్తేరు “ప్రభువుల వారికి సమ్మతమగునేని షూషను దుర్గమునందలి యూదులు, నేటి రాజశాసనమును రేపు కూడ అమలులో పెట్టుటకు అనుమతినిండు. హామానుని పదిమంది కొడుకుల శవములను కంబములపై వ్రేలాడదీయింపుడు” అనెను.

14. రాజట్లే జరిగింప ఆజ్ఞ ఇచ్చెను. రాజాజ్ఞను షూషను దుర్గమున ప్రకటించిరి. పదిమంది హామాను కుమారుల శవములను బహిరంగముగా వ్రేలాడదీసిరి.

15. షూషను నందలి యూదులు అదారు నెల పదునాల్గవ దినమున మరల గుమిగూడి మూడువందల మందిని తెగటార్చిరి. అయినను వారు మృతుల ఆస్తిపాస్తులను దోచుకొనలేదు.

16. ఇతర సంస్థానములలోని యూదులు ఎక్కడి వారు అక్కడే ఏకముగా గుమిగూడి ఆత్మరక్షణ చేసికొనిరి. వారు తమ విరోధులను డెబ్బది యైదువేల మందిని చంపి శత్రుపీడనను వదలించుకొనిరి. అయి నను వారు ఆ శత్రువుల సొత్తును దోచుకోలేదు.

17. ఈ సంఘటన అదారు నెల పదుమూడవనాడు జరిగెను. వారు పదునాలుగవనాడు శత్రువులను చంపుట చాలించి ఆనందముతో పండుగ చేసికొనిరి.

18. కాని షూషనునందలి యూదులు మాత్రము పద మూడు, పదునాలుగు తేదీలలో శత్రువులను వధించి పదునైదవ దినమున విశ్రాంతి తీసికొనిరి. ఆనాడు ఆనందముతో ఉత్సవముచేసికొనిరి.

19. కనుకనే అరక్షితములైయున్న చిన్న ఊళ్లలో జీవించు యూదులు అదారు నెల పదునాలుగవ దినమున సెలవు తీసికొని ఆనందముతో ఉత్సవము చేసికొందురు. ఒకరి యింటికొకరు భోజన పదార్దములు పంపుకొందురు. కాని పెద్ద నగరములలో వసించు యూదులు మాత్రము అదారు నెల పదునైదవ దినమున పండుగ చేసికొని ఒకరి యింటికొకరు వంటకములు పంపుకొందురు.

20. మొర్దెకయి జరిగిన సంఘటనలన్నిటిని లిఖించియుంచెను. అహష్వేరోషు రాజుపాలిత ప్రాంతాలలో నివసిస్తున్న యూదులందరికిని, దగ్గరివారికిని దూరపువారికి గూడ లేఖలు పంపెను.

21. అదారు నెలలోని పదునాలుగు, పదునైదవ దినములను ఏటేట సెలవురోజులనుగా నిర్ణయించెను.

22. ఇవి యూదులు శత్రుపీడనను వదిలించుకొనిన దినములు. ఈ నెలలో వారి దుఃఖము సంతోషముగను, వారి విలాపము ఉత్సవముగను మారిపోయెను గదా! కనుక మొర్దెకయి ఈ దినములు ఆనందముతో కూడిన ఉత్సవ దినములు కావలెనని ఆజ్ఞాపించెను. ఈ దినములందు యూదులు ఒకరి ఇంటికొకరు వంటకములు పంపుకోవలెననియు పేదలకు దానధర్మములు చేయవలెననియు అతడు కట్టడ చేసెను.

23. యూదులు మొర్దెకయి లేఖను శిరసావహించి ఈ ఉత్సవమును జరుపుకొను ఆచారమును ప్రారంభించిరి. ఏటేట దానిని కొనసాగించుచువచ్చిరి.

24. అగాగు వంశజుడును హమ్మెదాతా కుమారుడును, యూదుల శత్రువైన హమాను యూదులను మట్టుపెట్టు దినమును నిర్ణయించుటకు ఓట్లు వేసెను కదా! ఆ చీట్లకు “పూరు” అని పేరు.

25. కాని ఎస్తేరు రాజును సందర్శింపగా అతడు లిఖితపూర్వకమైన శాసనమును చేసి హామాను యూదులకొరకు త్రవ్విన గోతిలో తానే పడిపోవునట్లు చేసెను. అతనిని, అతని కుమారులను ఉరి తీయించెను.

26-27. కనుక ఈ ఉత్సవమునకు "పూరీము” అని పేరు వచ్చెను. “పూరు” అనగా చీట్లుకదా! మొర్దెకయి తమకిట్టి జాబు వ్రాయుటవలనను, తమకు జరిగిన ఈ సంఘటనలనెల్ల వారు కన్నులార చూచి అనుభవమునకు తెచ్చుకొనుటవలనను, యూదులు తామును, తమ సంతతియును, తమలో చేరిపోవు అన్యజాతి ప్రజలును, ప్రతియేడును నిర్ణీతకాలమున ఈ రెండు రోజులను ఉత్సవదినములుగా పాటింపవలెనని నిర్ణయము చేసికొనిరి.

28. ప్రతి సంస్థానమున ప్రతి నగరమున, ప్రతి తరమున ప్రతి యుదా కుటుంబమున ఈ పూరీము ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొని, వైభవోపేతముగా కొనియాడవలెననియు, ఆ పండుగను ఏనాడును విస్మరింపరాదనియు నిర్ణయము చేసి కొనిరి.

29. అబీహాయిలు పుత్రిక అయిన ఎస్తేరు రాణికూడ పూరీమును గూర్చి మొర్దెకయి వ్రాసిన లేఖను అధికారపూర్వకముగా సమర్థించుచు ఒక లేఖ వ్రాసెను.

30. ఆమె దానిని పారశీకమునందలి నూట యిరువది ఏడు సంస్థానములలో వసించు యూదులందరికి పంపించెను. ఆ లేఖయందు ఇట్లున్నది: “యూదులకు శాంతిభద్రతలు సిద్ధించునుగాక!

31. మొర్దెకయి ఎస్తేరురాణి ఆజ్ఞాపించినట్లే యూదులును, వారి వంశజులును నిర్ణీత కాలమున, నిర్ణీత పద్దతిలో పూరీము ఉత్సవము చేసికొనవలెను. ఈ ఉత్సవముతోపాటు ఉపవాసములను, విలాపములను గూడ పాటింపవలెను.”

32. ఎస్తేరు చేసిన ఈ ఆజ్ఞ పూరీము విధిని దృఢపరచెను. యూదులు ఆమె ఆజ్ఞను గ్రంథమున లిఖించి భద్రపరచిరి.