ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 15

 1. యిస్రాయేలున యరోబాము పరిపాలనా కాలము ఇరువదియేడవ యేట, అమస్యా కుమారుడైన అజర్యా యూదా రాజ్యమునకు రాజు అయ్యెను.

2. అప్పటికి అతనికి పదునారేండ్లు. అతడు యెరూషలేము నుండి ఏబది రెండేండ్లు పరిపాలించెను. యెరూషలేము నివాసి యెకోల్యా అతని తల్లి.

3. అతడు తన తండ్రి అమస్యావలెనే ధర్మబద్దముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను.

4. కానీ అజర్యా ఉన్నత స్థలములను మాత్రము తొలగింపలేదు. ప్రజలు అచట బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునేయుండిరి.

5. ప్రభువు అజర్యాకు కుష్ఠువ్యాధితో పీడ కల్పించెను. జీవితాంతము వరకు ఆ రోగము అతనిని వదలలేదు. అందుచేత అతడొక ప్రత్యేక భవనమున వసించెను. అతని కుమారుడు యోతాము రాజ్యభారము వహించి దేశమును పరిపా లించెను.

6. అజర్యా చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

7. అంతట అజర్యా తన పితరులతో నిద్రించి దావీదు నగరమున రాజ సమాధులలో పాతి పెట్టబడెను. అటుతరువాత అతని కుమారుడు యోతాము రాజయ్యెను.

8. యూదాసీమ యందు అజర్యా పరిపాలనా కాలము ముప్పది ఎనిమిదవయేట, యరోబాము కుమారుడు జెకర్యా యిస్రాయేలునకు రాజై సమరియా నగరమునుండి ఆరునెలలు పరిపాలించెను.

9. ఆ రాజుకూడ తన పూర్వులవలె యావే మెచ్చని దుష్కార్య ములు చేసెను. పూర్వము యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె అతడును కానిపనులు చేసెను.

10. యాబేషు కుమారుడగు షల్లూము జెకర్యామీద కుట్రపన్ని ఈబ్లేయాము వద్ద అతనిని వధించి తాను రాజయ్యెను.

11. జెకర్యా చేసిన ఇతర కార్యములు యిస్రాయేలు రాజులచరితమున లిఖింపబడియేయున్నవి.

12. “నీ కుమారులు నాలుగవతరమువరకు సింహాసనముమీద కూర్చుందురు” అని ప్రభువు యెహూకు మాటయిచ్చెను గనుక ఆ మాట చొప్పుననే అంతయు జరిగినది.

13. యూదా రాజ్యమున ఉజ్జీయా పరిపాలనా కాలము ముప్పది తొమ్మిదవయేట, యాబేషు కుమా రుడు షల్లూము యిస్రాయేలునకు రాజై సమరియా నుండి ఒక్కనెల మాత్రమే పరిపాలించెను.

14. గాదీ కుమారుడు మెనహేము తీర్సానుండి సమరియాకు వెళ్ళి షల్లూమును హత్యచేసి తాను రాజయ్యెను.

15. షల్లూము చేసిన ఇతర కార్యములు, అతడు పన్నిన కుట్ర, యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

16. ఈ సమయముననే మెనహేము తపువా పట్టణమును, దానిలోని పౌరులను దాని పరిసర ప్రాంతములను మొదలంట నాశనము చేసెను. ఎందుకనగా ఆ నగరము అతనికి లొంగలేదు. అతడు పట్టణమునందలి చూలాండ్ర కడుపులుగూడ చీల్చివేసెను.

17. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ముప్పది తొమ్మిదవయేట గాదీ కుమారుడు మెనహేము యిస్రాయేలునకు రాజై సమరియానుండి పదియేండ్లు పరిపాలించెను.

18. పూర్వము నెబాతు కుమారుడు యరోబాము జీవితాంతమువరకు యిస్రాయేలీయులచే పాపము చేయించెనుగదా! మెనహేము కూడ అతనిమార్గమునే అనుసరించెను.

19. అతని కాలమున అస్సిరియా ప్రభువు తిగ్లత్-పిలేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చెను. మెనహేము అతనికి ముప్పది ఎనిమిది బారువులవెండి సమర్పించుకొని యిస్రాయేలు మీద తన అధికారమును సుస్థిరము చేసికొనెను.

20. అతడు ఆ సొమ్ముకొరకై తన దేశమునందలి ధనవంతులందరు ఒక్కొక్కరు ఏబది వెండినాణెములు చెల్లించునట్లు నిర్బంధముచేసెను. తిగ్లత్-పిలేసెరు ఆ సొమ్ముపుచ్చుకొని తన దేశమునకు వెడలిపోయెను.

21. మెనహేముచేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

22. మెనహేము తనపితరులతో నిద్రించగా, అతని కుమారుడు పెకహ్యా రాజయ్యెను.

23. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ఏబదియవ ఏట మెనహేము కుమారుడు పెకహ్యా యిస్రాయేలునకు రాజై సమరియానుండి రెండుయేండ్లు పరిపాలించెను.

24. యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

25. పెకహ్య సేనానాయకుడును, రెమల్యా కుమారుడునగు పెక, ఏబదిమంది గిలాదీయులతో కలిసి రాజుపై కుట్రపన్ని అతనిని సమరియా యందలి రాజసౌధపు అంతర్భాగమున హత్యచేసెను.

26. పెకహ్యా చేసిన ఇతర కార్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

27. యూదారాజైన అజర్యా పరిపాలనాకాలము ఏబది రెండవయేట రెమల్యా కుమారుడగు పెక యిస్రాయేలునకు రాజై సమరియానుండి ఇరువదేండ్లు పరిపాలించెను.

28. ఇతడు కూడ యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

29. పేక పరిపాలన కాలముననే అస్పిరియా ప్రభువు తిగ్లత్-పిలేసెరు దండెత్తివచ్చి ఇయోను, ఆబెల్బెత్మాకా, యనోవా, కేదేషు, హాసోరు నగరములను గిలాదు, గలిలీ, నఫ్తాలి సీమలను జయించి అచటనున్న యిస్రాయేలీయులను అస్సిరియాకు బందీలుగా కొనిపోయెను.

30. యూదా రాజ్యమున ఉజ్జీయా కుమారుడు యోతాము పరిపాలనాకాలము ఇరువదియవయేట ఏలా కుమారుడైన హోషేయ పెక మీద కుట్రపన్ని అతనిని హత్యచేసి తాను రాజయ్యెను.

31. పెక చేసిన ఇతర కార్యములు యిస్రా యేలు రాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

32. యిస్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెక పరిపాలనాకాలము రెండవయేట ఉజ్జీయా కుమారుడు యోతాము తన ఇరువది ఐదవ యేట యూదాకు రాజయ్యెను.

33. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను. అతని తల్లి సాదోకు కుమార్తెయగు యెరూషా.

34. అతడు తన తండ్రి ఉజ్జియావలె ధర్మబద్దముగా జీవించి యావే దృష్టికి నీతిగా ప్రవర్తించెను.

35. అయినను అతడు ఉన్నత స్థలములను పడగొట్టింపలేదు. ప్రజలు అచట బలులుఅర్పించి సాంబ్రాణిపొగ వేయుచునేయుండిరి. దేవాలయపు ఎత్తైనద్వారమును నిర్మించినది ఈ యోతామే.

36. యోతాము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

37. అతడు రాజుగానున్న కాలమున ప్రభువు సిరియా రాజగు రెసీనును, యిస్రాయేలు రాజగు పెకను యూదా మీదికి దండెత్త పంపనారంభించెను.

38. యోతాము తన పితరులతో నిద్రించి దావీదు నగరమున తన పితరుల సమాధులలో పాతిపెట్టబడెను. అతని అనంత రము అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.