ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 15

 1. యిస్రాయేలు మండలమున యరోబాము పరిపాలనకాలము పదునెనిమిదవ యేట అబీయాము యూదా మండలమునకు రాజయ్యెను.

2. అతడు యెరూషలేమున మూడేండ్లు పరిపాలించెను. అతని తల్లి అబ్షాలోము కుమార్తె మాకా.

3. అబీయాము తన తండ్రివలె దుష్కార్యములు చేసెను. దావీదు హృదయ మువలె అతని హృదయము ప్రభువు మీద లగ్నము కాదయ్యెను.

4. అయినను దావీదు ముఖముచూచి ప్రభువు అతనికొక కుమారుని ప్రసాదించెను. ఆ కుమారుడు అబీయాము తరువాత యెరూషలేము నుండి పరిపాలనచేసి ఆ నగరమును సుస్థిరము చేయవలయునని ప్రభువు తలంచెను.

5. దావీదు హిత్తీయుడైన ఊరియా విషయమున తప్ప యావే దృష్టికి నీతి యుక్తముగా ప్రవర్తించి అతని ఆజ్ఞలను పాటించెను గనుక ప్రభువట్లు చేసెను.

6. అబీయాము రాజ్యము చేసినంతకాలము అతనికిని, యరోబామునకును బద్దవైరముగా నుండెడిది.

7. అబీయాము జీవితములోని ఇతర అంశములన్నియు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.

8. అంతట అబీయాము తన పితరులతో నిద్రించగ అతనిని దావీదు నగరముననే పాతి పెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను.

9. యిస్రాయేలు దేశమున యరోబాము పరిపాలనకాలము ఇరువదియవయేట యూదా రాజ్య మున ఆసా రాజయ్యెను.

10. అతడు యెరూషలేము నుండి నలువదియేండ్లు పరిపాలించెను. అతని పితా మహి అబ్షాలోము కుమార్తెయైన మాకా.

11. ఆసా తన పితరుడైన దావీదువలె యావే దృష్టిలో నీతియుక్తముగా జీవించెను.

12. మరియు అతడు వేశ్యలవలె ప్రవర్తించు మగవారినందరిని తన రాజ్యమునుండి బహిష్కరించెను. తన పూర్వులు నెలకొల్పిన విగ్రహములను నాశనము చేసెను.

13. అతడు తన పితా మహి మాకా అషేరా దేవతకొక విగ్రహమును నెలకొల్పగా ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు చేసి కీద్రోను నది ఒడ్డున కాల్చివేసెను.

14. ఆసా ఉన్నత స్థలములను నిర్మూలింపకున్నను అతని హృదయము మాత్రము పూర్తిగా యావేమీదనే లగ్నమయ్యెను.

15. అతడు తన తండ్రియును, తానును ప్రభువునకు అర్పించిన వెండి బంగారములను, ఇతర పరికరములను కొని వచ్చి దేవాలయమునకు ఒప్పగించెను.

16. ఆసారాజును, యిస్రాయేలు మండలము నేలిన బాషారాజును జీవితకాలమంతయు పోరాడు కొనుచునే ఉండిరి.

17. బాషా యూదా వారికి విరోధియై యుండి, యూదా నుండి ఎవరు రాకుండగను, తన రాజ్యములోని వారెవ్వరును ఆసాయొద్దకు పోకుండగను రామా పట్టణమును ప్రాకారములతో సురక్షితము చేసెను. దానితో యూదా మండలమునకు రాకపోకలకు ఆటంకము కలిగెను.

18. కనుక ఆసా, రాజభవనమునను, దేవాలయమునను మిగిలియున్న వెండి బంగారములను చేకొని సేవకులద్వారా సిరియా రాజగు బెన్హ్-దదునకు కానుకగా పంపించెను. ఈ రాజు తబ్రిమ్మోను కుమారుడు, హెస్యోనునకు మనుమడు.

19. ఆసా “మన తండ్రులవలె మనమును స్నేహితులముగానుందము. నేను నీకు వెండి బంగారములను కానుకగా పంపితిని. ఇకమీదట నీవు యిస్రాయేలు రాజైన బాషాతో పొత్తు విడువుము. అతడు నా రాజ్యమునుండి తన సైన్యమును మరలించుకొనిపోవలయును” అని బెన్హ్-దదునకు వర్తమానమంపెను.

20. బెన్హదదు ఆసాతో సంధిచేసికొని యిస్రాయేలు పట్టణముల మీదికి సైన్యాధిపతులను పంపెను. వారు ఇయ్యోను, దాను, ఆబేల్బెత్మాకా పట్టణములను, కిన్నెరెతు, నఫ్తాలి మండలములను వశము చేసికొనిరి.

21. ఈ ఉదంతము విని బాషా రామా పట్టణమును సురక్షితము చేయుట మానివేసి తీర్సా నగరమునకు వెడలిపోయెను.

22. అపుడు ఆసా యూదా మండలములోని ప్రజలనెల్ల పిలిపించి రామా నగరమును సురక్షితము చేయుటకై బాషా కొనివచ్చిన రాళ్ళను, కలపను మోయించుకొనివచ్చెను. ఆ సామగ్రితో అతడు బెన్యామీను మండలములోని గెబా, మిస్పా నగరములను సురక్షితము చేసెను.

23. ఆసా జీవితములోని ఇతరాంశములు, అతడు చూపిన పరాక్రమము, అతడు చేసిన పనులు, కట్టించిన పట్టణములు, యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి. ఆసా రాజు ముసలితనమున పాదములలో జబ్బుతో బాధపడెను.

24. అంతట ఆసా తన పితరులతో నిద్రించి, తన పిత రుడైన దావీదు నగరముననే పాతిపెట్టబడెను. అతని తరువాత అతని కుమారుడు యెహోషాఫాత్తు రాజయ్యెను.

25. ఆసారాజు యూదా రాజ్యమును పరిపాలించిన కాలము రెండవయేట మరోబాము కుమా రుడైన నాదాబు యిస్రాయేలు రాష్ట్రమునకు రాజై రెండేండ్లు పరిపాలించెను.

26. అతడు తన తండ్రి వలె యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలనుకూడ పాపమునకు పురికొల్పెను.

27. యిస్సాఖారు తెగకు చెందిన అహియా పుత్రుడైన బాషా నాదాబుమీద కుట్రపన్నెను. నాదాబు తన సైన్యముతో ఫిలిస్తీయాలోని గిబ్బెతోను నగరమును ముట్టడించు చుండగా బాషా అతనిని చంపివేసెను.

28. ఆసా యూదా రాజ్యమును పరిపాలించిన కాలము మూడవ యేట ఈ సంఘటన జరిగెను. ఆ రీతిగా నాదాబును చంపి బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను.

29. రాజయిన వెంటనే బాషా యరోబాము వంశీయులనందరిని మట్టుపెట్టెను. ప్రభువు షిలో ప్రవక్తయైన అహీయా ద్వారా సెలవిచ్చినట్లే యరోబాము వంశమున ఒక్క పురుగుకూడ మిగులకుండ అందరు చచ్చిరి.

30. యరోబాము దుష్కార్యములు చేసి యిస్రాయేలీయులను కూడ పాపమునకు పురికొల్పి ప్రభుకోపమును రెచ్చగొట్టెను గనుక అతని వంశము మొదలంట నాశనమయ్యెను.

31. నాదాబు జీవితము లోని ఇతరాంశములు అతడుచేసిన పనులు, యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియేయున్నవి.

32. యూదా రాజగు ఆసా, యిస్రాయేలు రాజగు బాషా జీవితకాలమంతయు పోరాడుకొనుచునే యుండిరి.

33. ఆసా యూదా రాజ్యమున పరిపాలించిన కాలము మూడవయేట అహీయా కుమారుడగు బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను. అతడు తీర్సా పట్టణమునుండి ఇరువది నాలుగేండ్లు పరిపాలించెను.

34. యరోబామువలె అతడును యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడ పాపమునకు పురికొల్పెను.