1. కొంతకాలమైన తరువాత గోధుమ పంట కాలమున సంసోను భార్యను చూడబోయెను. ఆమె కొరకు ఒక మేకపిల్లను బహుమానముగా కొనిపోయెను. అతడు “నా భార్యగదికి వెళ్ళెదను” అనెను. కాని ఆమె తండ్రి సంసోనునకు అడ్డుపడి,
2. “నీకు ఆ యువతిపె అయిష్టము కలిగినదనుకొని ఆమెను నీ స్నేహితునికిచ్చి పెండ్లి చేసితిని. అయినను ఆ బాలిక కంటె ఆమె చెల్లెలు అందగత్తె. ఆ పిల్లకు బదులుగా ఈ పిల్లను నీకిత్తుము” అనెను.
3. సంసోను “ఈ ఫిలిస్తీయుల పీచమణచి తీరవలయును. వీరింత పనిచేసిరి. ఇక నేనేమి చేసినను తప్పుగాదు” అనుకొనెను.
4. అతడు పొలమునకు వెళ్ళి మూడువందల గుంటనక్కలను పట్టుకొనెను. రెండేసి గుంటనక్కల తోకలను ఒకదానితోనొకటి ముడివేసి ప్రతిముడిలోను ఒక కొరవిని దోపెను.
5. ఆ కొరవులకు నిప్పంటించి గుంటనక్కలను ఫిలిస్తీయుల పొలముల మీదికి తోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలుకట్టిన పంట, ద్రాక్షతోటలు, ఓలివుతోటలు అన్ని నిప్పంటుకొని కాలిపోయెను.
6. ఫిలిస్తీయులు ఆ అపకారము చేసినది ఎవరాయని విచారింపగా సంసోనని తెలిసిపోయెను. సంసోను తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లియాడెననియు, తండ్రి వధువును మరల సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేసెననియు, అందులకే అతడు ఈ పనిచేసి ననియు వినిరి. వారు సంసోను భార్యను ఆమె పుట్టినింటి వారిని నిలువునకాల్చి చంపిరి.
7. ఆ సంగతివిని సంసోను వారితో "మీరంతటి పాడుపనికి తలపడితిరి గనుక మీపై పగతీర్చుకొని తీరెదను” అనెను.
8. అతడు ఫిలిస్తీయుల మీదబడి చిక్కినవారిని చిక్కినట్లు చీల్చి చెండాడెను. అటుపిమ్మట ఏతాము కొండగుహకు వెడలిపోయి అచట వసించెను.
9. అపుడు ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహినగరమును ముట్టడించిరి.
10. యూదీయులు ఫిలినీయులను చూచి “మీరు మాపై ఇట్లు దాడిచేయనేల?” అని అడిగిరి. వారు “మేము సంసోనును పట్టుకొనవచ్చితిమి. అతడు మాకు చేసిన కీడుకు ప్రతీకారము చేసితీరెదము" అనిరి.
11. అపుడు మూడువేలమంది యూదీయులు ఏతాము కొండస్థావరమునకు వెళ్ళి సంసోనుతో “ఫిలిస్తీయులు మన ఏలికలని నీకు తెలియదా? నీవు మాకెంతటి ముప్పు తెచ్చి పెట్టితివి” అని అనిరి. అతడు వారితో “ఫిలిస్తీయులు నాకు ద్రోహము తలపెట్టిరి కనుక నేను వారికి శాస్తి చేసితిని” అనెను.
12. యూదీయులు అతనితో “మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిస్తీయులకు అప్పగించెదము” అని పలికిరి. సంసోను “మీరు నన్ను చంపము అని ప్రమాణము చేయుడు” అనెను.
13. యూదీయులు అతనితో “మేము నిన్ను చంపదలచుకోలేదు. నిన్ను బంధించి ఫిలిస్తీయుల చేతికి అప్పగించెదము” అని పలికిరి. అంతట యూదీయులు అతనిని రెండు క్రొత్త త్రాళ్ళతో బంధించి కొండగుహ నుండి వెలుపలికి కొనివచ్చిరి.
14. సంసోను లేహి పట్టణమునకు రాగానే ఫిలిస్తీయులు అతనిని చూచి పొంగిపోయి వెట్టి కేకలు వేసిరి. అంతట యావే ఆత్మ సంసోనును ఆవహింపగా అతని బంధములన్నియు నిప్పంటుకొనిన నార త్రాళ్ళ వలె నయ్యెను. త్రాటికట్టులన్నియు సడలిపోయెను.
15. అచ్చట పచ్చిపచ్చిగానున్న గాడిద దవడ ఎముక యొకటి సంసోను కంటబడెను. అతడు చేయిచాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను వేయిమందిని చంపెను.
16. అతడు “గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీయులను గాడిదలను కొట్టినట్లుగా కొట్టితిని, గాడిద దవడ ఎముకతో వేయిమందిని పడగొట్టితిని” అనెను.
17. ఆ మాటలతో సంసోను చేతిలోని దవడ ఎముకను విసరిపారవేసెను. కనుకనే ఆ తావునకు రామత్-లేహి' అని పేరువచ్చెను.
18. అపుడు సంసోను దప్పికగొని యావేకు మొర పెట్టెను. “ప్రభూ! నీ దాసునికి ఈ మహావిజయము ప్రసాదించినవాడవు నీవే. నేనిపుడు దప్పికతో చావవలసినదేనా? సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుల చేతికి చిక్కవలసిన దేనా?” అని వేడుకొనెను.
19. ఆ వేడుకోలువిని యావే నేలను బద్దలుచేసి గోయి ఏర్పడునట్లు చేసెను. నేడు లేహి పట్టణమున ఉన్న గొయ్యి అదియే. ఆ గోతి నుండి నీళ్ళు పైకి ఉబికివచ్చెను. సంసోను నీళ్ళు త్రాగి సేదదీర్చుకొనెను. అతనికి మరల సత్తువకలిగెను. కనుకనే ఆ ఊటకు ఎనోహక్కోరే' అని పేరు వచ్చెను. లేహి చెంత నేటికిని ఆ చెలమను చూడవచ్చును.
20. ఫిలిస్తీయుల కాలమున సంసోను ఇరువది ఏండ్లపాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా నుండెను.