ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 14

 1. ఒక మారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచట ఒక ఫిలిస్తీయ యువతిని చూచెను.

2. అతడు ఇంటికి తిరిగివచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి “తిమ్నాతున ఫిలిస్తీయుల పిల్లనొకతెను చూచితిని. ఆ బాలికను నాకు భార్యగా కొనిరండు” అని అడిగెను.

3. అందులకు తల్లిదండ్రులు సంసోనుతో “మన తెగయందుగాని, మన జాతిలోగాని నీకు పిల్లలు కరవైరా ఏమి? సున్నతి సంస్కారము లేని ఆ ఫిలిస్తీయుల పిల్లయే కావలసివచ్చినదా?" అనిరి. కాని సంసోను తండ్రితో “కాదు, ఆ బాలికనే కొనిరమ్ము, ఆమె నాకు నచ్చినది” అనెను.

4. కాని ఇది అంతయు యావే నిర్ణయమనియు, ప్రభువు ఫిలిస్తీయులను అణగదొక్కుటకు సమయము వెదకుచుండెననియు సంసోను తల్లిదండ్రులకు తెలియదు. ఆ కాలమున యిస్రాయేలీయులు ఫిలిస్తీయుల ఏలుబడిలోనుండిరి.

5. సంసోను తన తల్లిదండ్రులతో కూడ తిమ్నాతునకు వెళ్ళెను. అతడు నగరము చెంతగల ద్రాక్షతోటలను చేరగనే కొదమసింగమొకటి గర్జించుచు అతని మీదికి ఉరికెను.

6. వెంటనే యావే ఆత్మ సంసోనును ఆవేశించెను. అతడు చేతిలో ఆయుధమేమియు లేకున్నను సింగము మీదబడి మేకపిల్లను చీల్చివేసినట్లు చీల్చి వేసెను. కాని సంసోను జరిగిన సంగతిని తల్లిదండ్రులకు తెలియజేయలేదు.

7. అతడు నగరమునకు వెళ్ళి ఆ యువతితో మాట్లాడెను. ఆమె అతనికి నచ్చెను.

8. అనతికాలములోనే సంసోను ఆమెను పెండ్లియాడుటకు తిరిగివచ్చెను. అతడు సింహపు కళేబరము ఏమైనదో చూతమని త్రోవనుండి ప్రక్కకు తొలగెను. ఆ కళేబరములో తేనెపట్టు కన్పించెను. పట్టున తేనె కలదు.

9. సంసోను చేతితో తేనె తీసికొని త్రాగుచు వెడలిపోయెను. తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కూడ కొంచెము తేనెను ఈయగా వారును త్రాగిరి. కాని ఆ తేనెను సింగముడొక్కనుండి తీసితినని సంసోను వారితో చెప్పలేదు.

10. తర్వాత సంసోను తండ్రి ఆ యువతిని చూడబోయెను. అక్కడ సంసోను విందు చేసెను. అది ఆనాటి యువకుల ఆచారము.

11. పెండ్లికుమార్తె వైపువారు సంసోను యొద్దనుండుటకు ముప్పదిమంది మనుష్యులను తోడుగా తెచ్చిరి.

12. సంసోను ఆ ముప్పదిమందితో “మిమ్మొక పొడుపుకథ అడిగెదను. పెండ్లి విందు ఏడుదినములు ముగియకమునుపే కథ విప్పెదరేని మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానముగా నిత్తును.

13. విప్పలేరో, మీరును నాకు అదియే బహుమానముగానిండు. ఇది పందెము” అనెను. వారు "అడుగుము చూతము" అనిరి.

14. సంసోను “తినెడు దానినుండి తినబడునది వచ్చె, బలమైన దానినుండి తీయనిది వచ్చె” అని పొడుపు కథ వేసెను. మూడునాళ్ళు గడిచినను వారికి జవాబు దొరకలేదు.

15. నాలుగవరోజున వారు సంసోను భార్యతో “నీ భర్తను లాలించి పొడుపుకథ భావమేమో తెలిసికొనుము. లేదేని నిన్ను, నీ పుట్టింటివారిని నిలువున కాల్చివేసెదము. మమ్మును దోచుకోవలెనని ఈ పెండ్లికి ఆహ్వానించితిరి కాబోలు!" అనిరి.

16. సంసోను భార్య తన భర్తముందట ఏడ్చుచు “నేననిన నీకిష్టములేదు. అసలు నాపై నీకు ప్రేమలేదు. నీవు మా జనమును ఒక పొడుపుకథ అడిగితివి. దాని అర్థమేమో నాకును వివరింపవైతివి గదా!” అనెను. సంసోను “ఆ కథ మర్మము మా తల్లిదండ్రులకు గూడ చెప్పలేదు, నీకు చెప్పవలెనా!” అనెను.

17. కాని ఆమె పండుగ దినములన్నింటిలో అతని ముందట ఏడ్చుచునే యుండెను. సంసోను భార్యపోరు పడలేక ఏడవనాడు కథలోని మర్మమును చెప్పివేసెను. వెంటనే ఆమె తన జనమును పిలిచి కథభావమును తెలియ జెప్పెను.

18. ఏడవనాడు సంసోను పడుకటిల్లు ప్రవేశింపక ముందు నగరవాసులు అతనితో “తేనెకంటె తీపియేది? సింగముకంటె బలమైనదేది?” అని అడిగిరి. కాని సంసోను వారితో “మీరు నా పెయ్యతో దున్ననియెడల ఈ పొడుపుకథను విప్పియుండరు” అనెను.

19. అంతట యావే ఆత్మ సంసోనును ఆవహించెను. అతడు అష్కెలోనునకు వెళ్ళి ముప్పది మంది ఫిలిస్తీయులను చంపెను. వారి దుస్తులను గొనివచ్చి పొడుపుకథ విప్పిన వారికి ఇచ్చివేసి కోపముతో నిప్పులుక్రక్కుచు తండ్రి ఇంటికి వెడలిపోయెను.

20. అటుతరువాత సంసోను భార్యను అతని తోడి పెండ్లి కొడుకునకిచ్చి వివాహముచేసిరి.