ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 13

 1. యూదారాజ్యమున అహస్యా కుమారుడు యోవాడు ఏలుబడి ఇరువది మూడవయేట, యిస్రాయేలున యెహూ కుమారుడగు యెహోవాహాసు రాజై సమరియా నగరమునుండి పదునేడేండ్లు పరిపాలించెను.

2. పూర్వము యరోబాము రాజువలె యెహోవాహాసు కూడ దుష్కార్యములు చేసి ప్రజలను పాపమునకు ప్రేరేపించెను. అతడు జీవితాంతము వరకు పాపకార్యములు చేయుట మానడయ్యెను.

3. కనుక ప్రభువు యిస్రాయేలు మీద కోపించెను. సిరియా రాజు హసాయేలును, అతని కుమారుడు బెన్హ్-దదును పదేపదే యిస్రాయేలును ఓడించునట్లు చేసెను.

4. యెహోవాహాసు ప్రభువునకు మనవి చేసికొనెను. ప్రభువు సిరియారాజు యిస్రాయేలును దారుణముగా పీడించుట చూచి మనసు కరగి యెహోవాహాసు మొర ఆలించెను.

5. ప్రభువు యిస్రాయేలునకు ఒక విమోచకుని ప్రసాదింపగా అతడు సిరియనుల గర్వమణచెను. యిస్రాయేలీయులు మునుపటివలెనే శాంతిభద్రతలతో జీవించిరి.

6. అయినను వారు నాడు యరోబాము యిస్రాయేలీయులచే చేయించిన పాపకార్యములను ఎంతమాత్రమును మానరైరి. సమరియా యందు అషేరా దేవత విగ్రహమునకు పూజలర్పించిరి.

7. యెహోవాహాసు సైన్యములో మిగిలినవారు ఏబదిమంది రౌతులు, పదిరథములు, పదివేలమంది కాల్బలము మాత్రమే. మిగిలిన సైన్యమునంతటిని సిరియా రాజు కాలిక్రింది ధూళివలె అణగదొక్కెను.

8. యెహోవాహాసు చేసిన ఇతర కార్యములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

9. యెహోవాహాసు తన పితరులతో నిద్రించి, సమరియాలో పాతి పెట్ట బడెను. అటుతరువాత అతని కుమారుడు యెహోవాసు రాజయ్యెను.

10. యూదా రాజ్యమున యోవాసు ఏలుబడి ముప్పది యేడవయేట యెహోవాహాసు కుమారుడగు యెహోవాసు యిస్రాయేలు సీమకు రాజై సమరియా నుండి పదునారేండ్లు పరిపాలించెను.

11. ఇతడు కూడ యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన యరోబామువలె కానిపనులు చేసెను.

12. అతడు చేసిన ఇతర కార్యములు, యూదా రాజగు అమస్యాతో నడచిన యుద్ధమున అతడు చూపిన పరాక్రమము యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే యున్నవి.

13. యెహోవాసు తన పితరులతో నిద్రించగా అతనిని సమరియాయందు పాతి పెట్టిరి. అటుపిమ్మట అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.

14. ఎలీషా ప్రవక్త మరణాపాయకరమైన వ్యాధికి గురియై మంచము పట్టియుండగా యిస్రాయేలు రాజైన యెహోవాసు అతనిని చూడబోయెను. అతడు “ఓ నా తండ్రీ! ఓ నా తండ్రీ! యిస్రాయేలునకు రథమును రాజులు రెండవ గ్రంథం దాని సారధియు నీవే!” అని అంగలార్చెను.

15. ప్రవక్త విల్లు బాణములు తీసికొనిరమ్మని ఆజ్ఞాపింపగా రాజు వానిని కొనివచ్చెను.

16. ఎలీషా విల్లెక్కు పెట్టుమనగా రాజు ఎక్కుపెట్టెను. ప్రవక్త వింటిపైన పెట్టిన రాజు చేతులమీద తన చేతులు మోపెను.

17. అతడు తూర్పుదిక్కుననున్న కిటికీ తెరువుమనగా రాజు అట్లే తెరచెను. ప్రవక్త కిటికీగుండ బాణము విడువుమనగా రాజు విడిచెను. అప్పుడు ఎలీషా యెహోవాసుతో “ఇది ప్రభువు సంరక్షణ బాణము. నీ ద్వారా ప్రభువు సిరియాను ఓడించును. నీవు ఆఫెకు చెంత సిరియనులతో పోరాడి వారిని గెలుతువు” అని నుడివెను.

18. అటుపిమ్మట ఎలీషా రాజుతో “మిగిలిన బాణములతో నేలను కొట్టుము” అనెను. రాజు మూడు సారులు నేలను బాణములతో కొట్టి అంతటితో ఆగి పోయెను.

19. ఎలీషా రాజుమీద కోపపడి “నీవు అయిదారుసార్లు నేలను కొట్టవలసినది. అప్పుడు సిరియాను పూర్తిగా అణగదొక్క గలిగెడివాడవుగదా! ఇప్పుడు నీవు ఆ దేశమును మూడుసార్లు మాత్రమే ఓడింపగలవు” అనెను.

20. తరువాత ఎలీషా చనిపోగా అతని శవమును సమాధిలో పాతి పెట్టిరి. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతియేడు యిస్రాయేలుపై దాడిచేసెడివి.

21. ఒక పర్యాయము యిస్రాయేలీయులు ఒక శవమును పాతిపెట్టబోవుచుండగా మోవాబుదండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడ వేసి వేగముగ పారిపోయిరి. కాని ఆ ప్రేతము ఎలీషా అస్థికలకు తగులగనే జీవముతో లేచి నిలుచుండెను.

22. యెహోవాహాసు పరిపాలన కాలమందంతట హసాయేలు యిస్రాయేలీయులను పీడించి పిప్పిచేసెను.

23. కాని ప్రభువు కరుణామయుడు కనుక వారిని నాశనము కానీయలేదు. తాను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొని యిస్రాయేలీయులకు తోడ్పడెనేగాని, వారిని చేయివిడువ లేదు.

24. హసాయేలు తరువాత అతని కుమారుడు బెన్హ్-దదు సిరియాకు రాజయ్యెను.

25. యెహోవాషు బెన్హ్-దదును మూడుసార్లు జయించెను. తన తండ్రి యెహోవాహాసు కాలమున బెన్హ్-దదు ఆక్రమించుకొనిన నగరములను మరల స్వాధీనము చేసికొనెను.