ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 13

 1. యరోబాము బేతేలు బలిపీఠము పై సాంబ్రాణి అర్పింపబోవుచుండగా ప్రభువు పిలుపుపై యూదానుండి దైవభక్తుడొకడు అచటికివచ్చెను. ప్రభువు అనుమతిపై అతడు యరోబాము బలి పీఠమును తెగనాడుచు,

2. “ఓ బలిపీఠమా! బలి పీఠమా! వినుము. దావీదు వంశమున యోషీయా అను బిడ్డడు పుట్టును. అతడు నీపైన ధూపమువేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను పట్టి, నీ మీదనే బలియిచ్చును. అతడు నీమీద నరుల ఎముకలను కాల్చివేయును” అనెను.

3. ఆ భక్తుడు ఇంకను “వినుడు! ప్రభువు నా ద్వారా మాట్లాడెననుటకు మీకిదే గురుతు. ఈ బలిపీఠము బద్దలైపోవును. దాని మీది బూడిద నేలలో కలసిపోవును” అని పలికెను.

4. ఆ రీతిగా దైవభక్తుడు బలిపీఠమునుగూర్చి తెలిపిన తెగనాడుట చూచి యరోబామురాజు అతనివైపు చేయి చాచి “ఇతనిని పట్టుకొనుడు” అని ఆజ్ఞాపించెను. వెంటనే రాజుచేయి చాచినది చాచినట్లుగనే కొయ్య బారిపోయెను. అతడు దానిని మరల ముడుచుకోలేక పోయెను.

5. దైవభక్తుడు దేవుని పేరుమీదుగా గురుతు నిచ్చినట్లే బలిపీఠము బద్దలైపోయెను. దానిమీది బూడిద క్రిందబడిపోయెను.

6. అపుడు రాజు “నీ దేవునికి మనవిచేసి నా చేతిని నయముచేయుము” అని ప్రవక్తను వేడుకొనెను. దైవభక్తుడు దేవునికి మనవి చేయగా రాజు చేయి యథాపూర్వకముగా ఆయెను.

7. రాజు అతనితో “నీవు మా ఇంటికి వచ్చి భోజనము చేయుము. నేను నిన్ను సత్కరించి పంపెదను” అనెను.

8. కాని దైవభక్తుడు రాజుతో “నీ సంపదలో సగము ఇచ్చినను నేను నీ వెంటరాను. మీ ఇంట అన్నపానీయములు ముట్టుకొనను.

9. ప్రభువు నేనిచట కూడునీళ్ళు ముట్టుకొనకూడదనియు, నేను వచ్చిన త్రోవవెంట తిరిగి వెళ్ళకూడదనియు ఆజ్ఞాపించెను” అని చెప్పెను.

10. అంతట అతడు తాను వచ్చిన త్రోవనువిడనాడి మరియొక త్రోవవెంట వెడలిపోయెను.

11. బేతేలున ఒక వృద్ధప్రవక్త కలడు. అతని కుమారులు ఆ రోజు బేతేలున దైవభక్తుడు ఏమి చేసి నది, అతడు రాజుతో ఏమి చెప్పినది తమ తండ్రికి తెలియ జేసిరి.

12. అతడు ఏ త్రోవలో పోయెనని తండ్రి కుమారులను అడిగెను. దైవభక్తుడు వెడలిన త్రోవను వారు తండ్రికి తెలియజెప్పిరి.

13. అతడు కుమారులచే గాడిదమీద జీనువేయించుకొని దానిపై ఎక్కిపోయెను.

14. ప్రవక్త దైవభక్తుని వెదకుచుపోయి, ఒకచోట అతడు సింధూరవృక్షము క్రింద కూర్చుండి యుండగా చూచెను. ప్రవక్త “యూదానుండి వచ్చిన దైవభక్తుడవు నీవేనా?” అని అడుగగా అతడు 'నేనే' అని చెప్పెను.

15. నీవు మా ఇంటికివచ్చి భోజనము చేయుమని ప్రవక్త అతనిని ఆహ్వానించెను.

16. అతడు “నేను నీ వెంట రాకూడదు. ఈ తావున కూడు నీళ్ళు ముట్టుకోగూడదు.

17. ప్రభువు నేనిక్కడ కూడునీళ్ళు ముట్టుకొనకూడదనియు, నేను వచ్చిన త్రోవవెంట తిరిగిపోకూడదనియు ఆజ్ఞాపించెను” అని పలికెను.

18. ప్రవక్త  దైవభక్తునితో “నేనును నీవలె ప్రవక్తనే. ప్రభువు ఆజ్ఞపై అతని దూత నిన్ను మా ఇంటికి కొని వచ్చి ఆతిథ్యమిమ్మని నాతో చెప్పెను” అని పలికెను. కాని అతడు అబద్దమాడెను.

19. అయితే దైవభక్తుడు ప్రవక్తతో వెనుదిరిగిపోయి అతని ఇంట అన్నపానీయములు పుచ్చుకొనెను.

20. వారు భోజనమునకు కూర్చుండియుండగా ప్రభువు దివ్యవాణి ప్రవక్తను ప్రేరేపించెను.

21. అతడు యూదానుండి వచ్చిన దైవభక్తునితో “నీవు దేవునిమాట మీరితివి. ఆయన ఆజ్ఞను పాటింపవైతివి.

22. నా వెంట వెనుదిరిగివచ్చి ప్రభువు వద్దన్నచోట అన్నపానీయములు పుచ్చుకొంటివి. ఇందుకుగాను నీ శవము మీ పితరుల సమాధిని చేరబోదు” అని పలి కెను.

23. దైవభక్తుడు భోజనముచేసిన తరువాత ప్రవక్త గాడిదపై జీనువేసెను.

24. భక్తుడు దానినెక్కి వెడలిపోవుచుండగా త్రోవలో ఒక సింహము అతనిని చంపివేసెను. అతని శవము త్రోవలో పడియుండెను. గాడిద, సింహము పీనుగ ప్రక్కనే నిలుచుండియుండెను.

25. ఆ దారినబోవు జనులు ప్రేతమును, దాని ప్రక్కన నిలుచుండియున్న సింహమునుచూచి ఊరిలోనికి వచ్చి వృద్ధప్రవక్తకు చెప్పిరి.

26. అతడు ఆ సంగతివిని “ఆ దైవభక్తుడు ప్రభువుమాట పాటింపడయ్యెను. దేవుడు అతనిని సింహము వాతపడవేసెను. ప్రభువు నుడివినట్లే సింహము అతనిని ముక్కలు ముక్కలుగా చీల్చి చంపివేసినది కాబోలు” అనెను.

27. అతడు వెంటనే కుమారులచేత గాడిదకు జీను కట్టించెను.

28. దానిపై ఎక్కిపోయి త్రోవలో పడియున్న శవమును దాని ప్రక్కనే నిలిచియున్న గాడిదను, సింహమును చూచెను. సింహము శవ మును తినలేదు. గాడిదను అంటుకోలేదు.

29. ప్రవక్త దైవభక్తుని ప్రేతమును గాడిదపై నిడుకొని ఇంటికి కొనివచ్చెను. అతడు భక్తునికొరకు శోకించి శవమును పూడ్చి పెట్టుదుననుకొనెను.

30. ప్రవక్త తన కుటుంబ సమాధిలోనే భక్తుని శవమును పూడ్చిపెట్టెను. అతడు, అతని కుమారులు “హా సోదరా! హా సోదరా!”అనుచు భక్తునికొరకు పెద్దగా విలపించిరి.

31. అతనిని ఖననము చేసిన తరువాత ప్రవక్త తన కుమారులతో “నేను చనిపోయిన తరువాత నన్నుకూడ ఈ సమాధిలోనే పూడ్చి పెట్టుడు. నా ఎముకలను అతని అస్థికల ప్రక్కనే ఉండనిండు.

32. దేవుని ఆనతిపై బేతేలు బలిపీఠమును సమరియా మండలములోని పూజామందిరములను నిరసించుచు ఇతడు పలికిన పలుకులన్నియు నెరవేరి తీరును” అని చెప్పెను.

33. ఈ సంగతి జరిగిన తరువాత కూడ యరోబాము తన పాడుపనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజామందిరములకు సాధారణ కుటుంబములనుండియే యాజకులను నియమించుచు వచ్చెను.

34. ఈ దుష్కార్యమువలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యెను.