ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 12

 1. యిస్రాయేలు రాజ్యమున యెహూ పరిపాలనాకాలము ఏడవయేట యోవాసు యూదా రాజ్యమునకు పాలకుడై నలువదియేండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు సిబ్యా. బేర్షేబా నగరమునకు చెందినది.

2. యోవాసు యాజకుడైన యెహోయాదా ఉపదేశించిన కాలమంతయు యావే దృష్టిలో సరిగానే ఉండెను.

3. అయినను ఉన్నత స్థలములు నిర్మూలింపబడక నిలిచియుండెను. ప్రజలు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచునే ఉండిరి.

4. యోవాషు యాజకులను పిలిపించి యావే ఆలయములోనికి తేబడు నివేదిత కానుకల విలువను అనగా తలపన్నును, వంతుచొప్పున ప్రతివానికి నిర్దేశింపబడిన సొమ్మును, స్వేచ్ఛాపూరిత అర్పణ సొమ్మును అట్టిపెట్టవలయునని ఆజ్ఞాపించెను.

5. ప్రతి యాజకుడును తాను పరిచర్య చేయునపుడు ఆలయమునకు వచ్చు ప్రజలు సమర్పించిన డబ్బును జాగ్రత్తగా జమకట్టి ఆ సొమ్మును దేవాలయ మరమ్మతులకు వాడవలయునని ఆజ్ఞ ఇచ్చెను.

6. కాని యోవాసు పరిపాలనాకాలము ఇరువది మూడవ ఏటి వరకు యాజకులు గుడి మరమ్మత్తులకు పూనుకోరైరి.

7. కనుక అతడు యెహోయాదాను ఇతర యాజకులను పిలిపించి “మీరు మందిరమును బాగుచేయుటకు పూనుకొనరైతిరేల? అర్పించు వారివద్దనుండి ఇక సొమ్ము ఏమాత్రమును అంగీకరింపక, దేవాలయములో శిధిలమైన స్థలములను బాగుచేయుటకై ఇంత వరకు మీరు పుచ్చుకున్న సొమ్మును అప్పగించుడు” అని ఆజ్ఞనిచ్చెను.

8. కనుక యాజకులు ఇకను జనులు అర్పించు సొమ్ము పుచ్చుకొనుటకుగాని, దేవాలయ మరమ్మత్తులు చేయుటకుగాని అంగీకరించరైరి. .

9. అంతట యెహోయాదా పెద్ద పెట్టెను గొనివచ్చి దానిమూతకు కన్నము తొలిపించి యావే ఆలయమున ప్రవేశించువారి కుడివైపున బలిపీఠము చెంత దానినుంచెను. దేవాలయ ద్వారమువద్ద నుండు యాజకులు భక్తులు కొనివచ్చిన సొమ్మునంతటిని ఆ పెట్టెలో వేసెడివారు.

10. దేవళమునున్న పెట్టె నిండగనే రాజ ప్రధానలేఖికుడును, ప్రధానయాజకుడును వచ్చి నాణెములను లెక్కించి, సంచులు కట్టెడి వారు.

11-12. రాబడినంతటిని లెక్కచూచి, ఆ సొమ్మును దేవాలయము మరమ్మతులు చేయించు వారికి ముట్టజెప్పెడివారు. వారు దానిని దేవాలయమున పనిచేయు వడ్రంగులకు తాపీ పనివారికి రాళ్ళు చెక్కువారికి చెల్లించెడివారు. కలపను, రాళ్ళను, కొనుటకు ఇతర మరమ్మతు ఖర్చులకు ఆ సొమ్మునే వినియోగించెడివారు.

13. కాని ప్రభు మందిరమునకు వలయు వెండిగిన్నెలు, పాత్రలు, బాకాలు, దీపముల పనిముట్లు చేయించుటకుగాని, మరి ఏ ఇతరములైన వెండిబంగారు పాత్రములను తయారు చేయించుటకు గాని ఆ ద్రవ్యమును వాడెడివారుకారు.

14. మరమ్మతుకు సంబంధించిన పనివారికి, వస్తుసామగ్రికి మాత్రమే ఆ సొమ్మును వాడిరి.

15. మరమ్మతులు చూచుకొను అధికారులు మిగుల చిత్తశుద్ధి కలవారు. కనుక వారినుండి లెక్కలు అడుగవలసిన అవసరము కలుగదయ్యెను.

16. జనుల దోషపరిహారబలులకు గాని, పాపపరిహారబలులకు గాని సమర్పించిన సొమ్మును ప్రభు మందిరములోనికి తేబడలేదు. ఆ డబ్బును యాజకులే తీసికొనెడివారు.

17. ఆ కాలమున సిరియారాజు హసాయేలు గాతును ముట్టడించి పట్టుకొనెను. అతడు యెరూషలేమును గూడ ఆక్రమింపగోరెను.

18. యోవాసు రాజు, తన పితరులైన యెహోషాఫాత్తు, యెహోరాము, అహస్యా అను యూదారాజులు దేవాలయమునకు సమర్పించిన కానుకలను, తాను స్వయముగా అర్పించిన కానుకలను, దేవాలయములోని, ప్రాసాదములోని భాండాగారములందున్న బంగారమును గైకొని హసాయేలునకు కానుకగా పంపెను. ఆ బహుమతులు స్వీకరించి హసాయేలు యెరూషలేమును ముట్టడింపక వెడలిపోయెను.

19. యోవాసు చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

20. యోవాసు ఉద్యోగులు అతనిమీద కుట్రపన్నిరి. యెరూషలేమునకు తూర్పున పల్లమునుపూడ్చి, మిల్లో కట్టిన తావున, సిల్లాకు పోవు త్రోవప్రక్కన వారు రాజును హత్యచేసిరి.

21. షిమాతు కుమారుడగు యోసాకారు, షోమేరు కుమారుడగు యెహోసాబాదు అను అతని సేవకులు అతనిని చంపిరి. జనులు అతనిని దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతి పెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services