ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 12

 1. రెహబాము షెకెమునకు వెళ్ళెను. యిస్రాయేలీయులందరు అతనికి పట్టాభిషేకము చేయుటకై అచట ప్రోగయిరి.

2. నెబాతు కుమారుడు యరోబాము సొలోమోను చెంతనుండి పారిపోయి ఐగుప్తున వసించుచుండెనుగదా! అతడు ఈ వార్తలువిని ఐగుప్తునుండి తిరిగివచ్చెను.

3-4.యిస్రాయేలీయులు రెహబాముతో “నీ తండ్రి సొలోమోను మా నెత్తిన పెద్దభారము మోపెను. నీవు ఈ బరువును తొలగింతువేని మేము నీకు దాసులమైయుందుము” అనిరి.

5. రెహబాము ప్రజలతో “మూడు దినములయిన తరువాత నన్ను కలిసికొండు” అని చెప్పగా వారందరు వెడలిపోయిరి.

6. అంతట రెహబాము తన తండ్రి సొలోమోనునకు కొలువుచేసిన వృద్ధులను పిలిపించి ఈ ప్రజలకేమి సమాధానము ఈయవలెనో చెప్పుడనెను.

7. వారు అతనితో “నీవు ఈ జనులకు సేవచేయకోరెదవేని ఇపుడు వీరికి ప్రీతికలుగునట్లు మాట్లాడుము. ఆ మీదట వీరు జీవితాంతము నీకు బానిసలైయుందురు” అని చెప్పిరి.

8. కాని రెహబాము ఆ వృద్ధుల ఆలోచనను త్రోసిపుచ్చి తనతో పెరిగి తనకు కొలువు చేయుచున్న యువకులను ఉపదేశమడిగెను.

9. “ఈ ప్రజలు తమ బరువును తొలగింపుమని అడుగుచున్నారు, నేను వీరికేమి బదులు ఈయవలయునో తెలియచెప్పుడు” అనెను.

10. వారతనిని చూచి "నీవు ఈ ప్రజలతో 'మా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు లావుగలది.

11. మా తండ్రి మీపై పెద్దబరువు మోపినచో నేనంతకంటే పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను' అని చెప్పుము” అని పలికిరి.

12. మూడు రోజులైనపిమ్మట రెహబాము కోరినట్లే యిస్రాయేలీయులందరు అతనివద్దకు వచ్చిరి.

13. రెహబాము పెద్దల ఉపదేశము త్రోసిపుచ్చి ప్రజలను నొప్పించే విధముగా మాట్లాడెను.

14. అతడు తన మిత్రులైన యువకుల మాటలువిని ప్రజలతో “మా తండ్రి మీపై పెద్దబరువును మోపినచో నేనంత కంటె పెద్దబరువునే మోపెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను” అనెను.

15. ఈ రీతిగా రెహబాము ప్రజల మనవిని త్రోసిపుచ్చుట యావే నిర్ణయించిన కార్యము. ప్రభువు షిలో నివాసియగు అహీయా ముఖమున యరోబామునకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకే ఇట్లు జరిగెను.

16. రెహబాము తమ మనవిని విననందున ప్రజలు “మనకు దావీదు సొత్తులో పాలులేదు, యిషాయి కుమారుని వారసమున పొత్తులేదు, మన నివాసములకు మనము వెడలిపోవుదము రండు. ఇక దావీదు వంశీయులు వారి తిప్పలు వారు పడుదురుగాక!” అని పలికి వెడలిపోయిరి.

17. రెహబాము యూదా రాజ్యములోని యిస్రాయేలీయులకు రాజయ్యెను.

18. అతడు వెట్టిచాకిరి చేయువారికి పర్యవేక్షకుడుగా నున్న అదోరామును తిరుగుబాటుదారుల మీదికి పంపెను గాని వారతనిని రాళ్ళతో కొట్టిచంపిరి. రెహబాము గబగబ రథమెక్కి యెరూషలేమునకు పారి పోవలసివచ్చెను.

19. అప్పటినుండి యిస్రాయేలీయులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు.

20. యిస్రాయేలీయులు యరోబాము ఐగుప్తు నుండి తిరిగివచ్చెనని విని అతనిని తమ సమావేశమునకు పిలిపించి రాజుగా అభిషేకించిరి. యూదా తెగ మాత్రమే దావీదువంశీయులకు లొంగియుండెను.

21. రెహబాము యెరూషలేమునకు మరలివచ్చి యూదా, బెన్యామీను తెగలనుండి నూటఎనుబది వేలమంది వీరులను ప్రోగుచేసికొని యిస్రాయేలీయుల మీదికి దాడివెడలెను.

22-24. కాని ప్రభువు తన ప్రవక్తయైన షేమయాతో “నీవు వెళ్ళి సొలోమోను కుమారుడు, యూదా రాజునగు రెహబాముతోను, యూదా బెన్యామీను తెగలకు చెందిన యిస్రాయేలీయులతోను, 'మీ సోదరులైన యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు పోవలదు. ఇది నేను నిర్ణయించిన కార్యము కనుక మీరందరు వెనుకకు మరలి పొండు' అని చెప్పుము” అని పలికెను. యూదీయులందరు ప్రభువు మాట పాటించి వెనుదిరిగిపోయిరి.

25. మరోబాము ఎఫ్రాయీము మండలమున నున్న షెకెము అను పట్టణమును కట్టించి, అచట కొన్నాళ్ళు నివసించెను. తరువాత అతడు పెనూవేలు పట్టణమును నిర్మించెను.

26-27. అతడు తనలో తాను “ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులర్పింతురేని వారు యూదారాజయిన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును” అనుకొనెను.

28. ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో “మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన దైవములు వీరే, చూడుడు” అనెను!.

29. అతడు ఒక బంగారుదూడను బేతేలునను, మరియొక దానిని దానునందును నెలకొల్పెను.

30. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను. వారు ఆ దైవములను ఆరాధించుటకు బేతేలునకు, దానునకు వెళ్ళెడివారు.

31. యరోబాము ఉన్నతస్థలములపై మందిరములను కూడ నిర్మించెను. లేవీ తెగకు చెందని సామాన్య కుటుంబమునుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను.

32. యరోబాము యూదామండలమునవలె యిస్రాయేలు సీమలోకూడ ఎనిమిదవనెల పదునైదవ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులు అర్పించెను. ఉన్నతస్థలములో యాజకులుగా తాను నియమించిన వారినే బేతేలున కూడ యాజకులనుగా చేసెను.

33. అతడు తనకు తానుగా నియమించుకొనిన ఎనిమిదవనెల పదునైదవ దినమున బేతేలునకు వెళ్ళి పండుగ జరిపి బలిపీఠముపై బలులను అర్పించెను. మరియు యిస్రాయేలు వారికి ఒక పండుగను నిర్ణయించి, ధూపము వేయుటకై తానే బలిపీఠమునెక్కెను.