ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 12

 1. ఎఫ్రాయీము జనులు యుద్ధమునకు సన్నద్దులై సాఫోను చేరి యెఫ్తాతో “మమ్ము ఆహ్వానింపకుండ నీవొక్కడివే అమ్మోనీయులతో యుద్ధమునకు పోనేల? నిన్నును, నీ ఇంటిని తగులబెట్టెదము” అనిరి.

2. యెఫ్తా వారితో “నేనును, మా ప్రజలును అమ్మోనీయులకు చిక్కి చాల బాధపడితిమి. నేను మీకు కబురు పెట్టితినిగాని మీరు నన్నాదుకొనలేదు.

3. ఎవరును సాయపడుటకు రాకుండుటచూచి ప్రాణములు గుప్పిట బెట్టుకొని నేనే శత్రువుల మీదికిపోతిని. యావే నాకు విజయము ప్రసాదించెను. నేడు నాతో మీరు జగడము పెట్టుకోనేల?” అనెను.

4. యెఫ్తా గిలాదీయులనందరిని ప్రోగుచేసికొని ఎఫ్రాయీమీయులతో పోరుసల్పగా ఎఫ్రాయీమీయులు ఓడిపోయిరి. ఎందుకనగ వారు “ఎఫ్రాయీము, మనష్షే మండలములమధ్య వసించు గిలాదీయులారా! మీరు ఎఫ్రాయీమీయుల ఎదుట నిలువలేక పారిపోయి వచ్చినవారేకదా!" అని గేలిచేయుచుండిరి గనుక తగినశాస్తిని అనుభవించిరి.

5. గిలాదీయులు ఎఫ్రాయీమీయులను యోర్దానురేవు దాటనీయలేదు. ఎఫ్రాయీమీయులనుండి పారి వచ్చిన వారెవరైన రేవును దాటబోయినచో గిలాదీయులు “నీవు ఎఫ్రాయీమీయుడవుగావా?” అని అడిగెడివారు.

6. అతడు “కాను” అన్నచో వారు “షిబ్బోలెతు”' అనుమాటను ఉచ్చరింపుమనెడివారు. అతడు ఆ మాటను ఉచ్చరింపలేక “సిబ్బోలెతు” అనెడివాడు. వెంటనే గిలాదీయులు అతనిని పట్టుకొని రేవు కడనే వధించెడివారు. ఈ రీతిగా ఎఫ్రాయీమీయులు నలువది రెండు వేలమంది మడిసిరి.

7. యెఫ్తా ఆరేండ్లు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేసెను. గిలాదీయుడైన యెఫ్తా చనిపోగా స్వీయనగరమైన గిలాదు పట్టణముననే అతనిని పాతిపెట్టిరి.

8. యెఫ్తా తరువాత బేత్లెహేమునకు చెందిన ఇబ్సాను న్యాయాధిపతి అయ్యెను.

9. అతనికి ముప్పది మంది కొడుకులు, ముప్పదిమంది కుమార్తెలుండిరి.

10. అతడు తన కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరనివారిని ముప్పది మంది కన్యలను తన కొడుకులకు పెండ్లి చేసెను. ఇబ్సాను ఏడేండ్లు యిస్రాయేలీయులకు న్యాయాధిపతియై మరణానంతరము బేత్లెహేమున ఖననము చేయబడెను.

11. అటుతరువాత సెబూలూనునకు చెందిన ఏలోను పదియేండ్లు న్యాయాధిపతిగా పనిచేసెను.

12. మరణానంతరము అతనిని సెబూలూనునందలి ఏలోనుననే పాతిపెట్టిరి.

13. అటుపిమ్మట పిరతోను నివాసియు హిల్లేలు కుమారుడగు అను న్యాయాధిపతి అయ్యెను.

14. అతనికి నలువదిమంది కుమారులును, ముప్పది మంది మనుమలును ఉండిరి. వారు డెబ్బది గాడిదల నెక్కి తిరిగెడివారు.

15. అతడు ఎనిమిదేండ్లు యిస్రాయేలీయులకు తీర్పుతీర్చి కన్నుమూసెను. ఎఫ్రాయీము మండలమున గల అమాలేకీయుల పర్వతసీమలో పిరతోను ననే అబ్దోనును పాతిపెట్టిరి.