ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 11

 1. సొలోమోను అన్యదేశ స్త్రీలను వలచెను. అతడు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను మాత్రమే గాక హిత్తీయ, మోవాబు, అమ్మోను, ఎదోము, సీదోను స్త్రీలనుగూడ వివాహమాడెను.

2. ప్రభువు అన్యజాతుల పిల్లలను యిస్రాయేలీయులు గాని, యిస్రాయేలీయుల పిల్లలను అన్యజాతుల వారుగాని పరిణయమాడరాదనియు, అట్టి వివాహములు జరిగినచో యిస్రాయేలీయులు అన్యజాతులు పూజించు దైవములను ఆరాధింతురనియు చెప్పెను. అయినను సొలోమోను అన్య జాతి స్త్రీలను పరిణయమాడి వారియెడల గాఢానురాగము చూపెను.

3. అతడు ఏడువందలమంది రాజ పుత్రికలను వివాహమాడెను. పైగా అతనికి మూడు వందలమంది ఉపపత్నులుకూడ గలరు. వీరందరు అతనికి ప్రభువు మీద భక్తి సన్నగిల్లి పోవునట్లు చేసిరి.

4. సొలోమోను వృద్దుడు అగునప్పటికి భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించునట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదువలె పూర్ణహృదయముతో యావేయెడల ఉండలేకపోయెను.

5. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టారోతు దేవతను, అమ్మోనీయులు కొలుచు పాడుదైవము మిల్కోమును పూజించెను.

6. అతడు ప్రభువునకు ద్రోహముచేసెను. తన తండ్రి దావీదువలె ప్రభువును పూర్ణహృదయముతో ఆరాధింపడయ్యెను.

7. మోవాబీయులు కొలుచు హేయమైన దైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పువైపుననున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను. ఆ రీతిగనే అమ్మోనీయులు కొలుచు హేయమైన మెలెకునకును నిర్మించెను.

8. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగవేయుటకు అతడు ఈ విధముగా చేసెను.

9. రెండుసార్లు ప్రత్యక్షమైన యావేను, యిస్రాయేలు ప్రభువును సొలోమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను.

10. అన్యదైవముల నారాధింప నిషేధించినను యావేమాట వినలేదు.

11. యావే అతనితో “నీవు నా నిబంధనమును మీరి నాఆజ్ఞలను జవదాటితివి గనుక నేను ఈ రాజ్యమును నీ అధీనమునుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చి వేసెదను.

12. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును.

13. కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని అధీనము నుండి తొలగింపను. నా సేవకుడగు దావీదును చూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క తెగను మాత్రము నీ కుమారునివశమున ఉంచెదను” అని చెప్పెను.

14. ప్రభువు ఎదోము రాజవంశమునకు చెందిన హదదును పురికొల్పగా అతడు సొలోమోనునకు శత్రువయ్యెను.

15-16. అంతకు పూర్వమే దావీదు ఎదోమును జయించెను. అతని సైన్యాధిపతియగు యోవాబు మృతవీరులను పూడ్చిపెట్టుటకై అచటికి వెళ్ళెను. యోవాబు అతని అనుచరులు ఎదోమున ఆరు మాసములు ఉండిరి. ఆ కాలమున వారు ఎదోము నందలి మగవారినందరిని చంపివేసిరి.

17. కాని హదదు, అతని తండ్రికి కొలువుచేయు ఎదోము సేవకులు మాత్రము తప్పించుకొని ఐగుప్తునకు పారిపోయిరి. అప్పటికి హదదు పసివాడు.

18. అతడు అతని అనుచరులు మిద్యానునుండి బయలుదేరి పారాను ఎడారి చేరిరి. అక్కడ మరికొందరు వారితో చేరగా అందరు కూడి ఐగుప్తు చేరుకొనిరి. హదదు ఫరోను కలసికొనగా ఆ రాజు అతనికి ఇల్లువాకిలి, పొలము పుట్ర ఇప్పించి భోజనవసతి కల్పించెను.

19. హదదు రాజునకు ఇష్టుడయ్యెను. ఫరో తన రాణి తహ్పెనేసు చెల్లెలినే అతనికిచ్చి పెండ్లి చేసెను.

20. హదదుకు ఆమెవలన గెనుబతు అను కుమారుడు కలిగెను. రాణి ఆ శిశువును ఫరో ప్రాసాదముననే పెంచెను. బాలకుడు రాజకుమారులతో పెరిగెను.

21. దావీదు, అతని సైన్యాధిపతియైన యోవాబు మరణించిరని వినిన హదదు, ఫరో వద్దకు వెళ్ళి “నన్ను నా దేశమునకు వెళ్ళిపోనిమ్ము” అని అడిగెను.

22. రాజతనితో ఇచట నావలన నీకేమైన కొరతకలిగినదా? ఇపుడు నీవు మీ దేశమునకు తిరిగిపోనేల?” అని అనెను. అతడు రాజుతో “ఇక్కడ నాకు ఏ లోటును లేదు. అయినను నన్ను వెళ్ళిపోనిమ్ము” అనెను. తరువాత హదదు ఎదోమునకు రాజయ్యెను. అతడు యిస్రాయేలీయులను మిగుల ఈసడించుకొనెను గనుక వారికి కీడు తెచ్చి పెట్టెను.

23. ప్రభువు ఎల్యాదా కుమారుడు రెసోనును గూడ సొలోమోనునకు శత్రువును చేసెను. ఈ రెసోను తన యజమానుడు, సోబా రాజునగు హదదెసరునుండి పారిపోయి,

24. కొందరు తిరుగుబాటుదారులకు నాయకుడయ్యెను. దావీదు హదదె సెరును జయించి అతని మిత్రులైన అరామీయులను మట్టు పెట్టిన తరువాత ఈ సంఘటనము జరిగెను. రెసోను అతని అనుచరులు దమస్కునకు పోయిరి. రెసోను సిరియా దేశమునకు రాజయ్యెను.

25. సొలోమోను జీవించి ఉన్నంతకాలము అతడు యిస్రాయేలీయులకు ప్రబల శత్రువుగా నుండెను.

26.యరోబాము ఎఫ్రాయీము మండలములోని సెరెదా పట్టణవాసియైన నెబాతు కుమారుడు, అతని తల్లి పేరు సెరువా. ఆమె విధవ. అతడు సొలోమోను సేవకుడై కూడ అతనిమీద తిరుగబడెను.

27. ఆ తిరుగుబాటు వైనమిది: సొలోమోను యెరూషలేమునకు తూర్పువైపున నున్న పల్లమును పూడ్పించి అనగా మిల్లోను నిర్మించి పట్టణ ప్రాకారమును పొడిగించుచుండెను.

28. అప్పటికి మరోబాము సమర్థుడైన యువకుడు. అతడు సంతృప్తికరముగా పనిచేయుట చూచి సొలోమోను అతనిని మనష్షే ఎఫ్రాయీము మండలములలోని భారమైన పనులు చేయగల వెట్టిచాకిరి వారికందరకు నాయకుని చేసెను.

29. ఒకనాడు యరోబాము యెరూషలేమునుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసియైన అహీయా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలసికొనెను. అప్పుడు వారిద్దరుతప్ప మరియెవ్వరును అచటలేరు. అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రమును వేసుకొనియుండెను.

30. అతడు ఆ క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండుముక్కలుగా చించివేసి యరోబాముతో

31. “వీనిలో పదిముక్కలు నీవు తీసికొనుము. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లను చున్నాడు: 'ఈ రాజ్యమును సొలోమోనునుండి తొలగించి దానిలో పదితెగలను నీ పరము చేసెదను.

32. నా సేవకుడు దావీదును చూచి, యిస్రాయేలు నేలమీది నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమునుచూచి, ఒక్కతెగను మాత్రము సొలోమోను వశమున నుంచెదను.

33. సొలోమోను నన్ను విడనాడి సీదోనీయుల దేవత అష్టారోతును, మోవాబీయుల దైవమగు కెమోషును, అమ్మోనీయుల దైవమగు మిల్కోమును పూజించెను. అతడు నన్ను ధిక్కరించి నా మార్గమును విడనాడెను. తన తండ్రి దావీదువలె నా ఆజ్ఞలను పాటింపడయ్యెను.

34. కాని రాజ్యమంతటిని సొలోమోను వశమునుండి తొలగింపను. పైగా నేనెన్నుకొనిన దావీదును చూచి, అతడు నా ఆజ్ఞలు పాటించిన దానిని చూచి సొలోమోను జీవించినంతకాలము అతనిని రాచరికమునుండి తొలగింపను.

35. కాని సొలోమోను కుమారుని వశమునుండి రాజ్యమును తొలగించి తీరుదును. నీకు దానిలో పది తెగలను ఇత్తును.

36. సొలోమోను కుమారునికి ఒక్క తెగనిత్తును. ఇట్లు చేసినచో, నా నామమును అచట ఉంచుటకు నేను ఎన్నుకొనిన యెరూషలేమున నా సేవకుడైన దావీదు వంశీయుడు ఒకడు నిత్యము పరిపాలన చేయుచుండును.

37. నిన్ను నేను యిస్రాయేలునకు రాజును చేసెదను. నీకు ఇష్టము వచ్చినంత రాజ్యమును నీవు పరిపాలింప వచ్చును.

38. నీవు పూర్ణహృదయముతో నాకు విధేయుడవై నా మార్గమును అనుసరించుచు నా సేవకుడైన దావీదువలె నా ఆజ్ఞలను పాటించెదవేని నేను నీకు తోడుగా యుందును. నిన్ను యిస్రాయేలునకు రాజును చేసెదను. దావీదు వంశీయులవలె నీ వంశీయులును శాశ్వతముగా పరిపాలనము చేయుదురు.

39. ఈ రీతిగా దావీదు వంశీయులకు బుద్ధిచెప్పెదను. కాని నేను వారిని శాశ్వతముగా శిక్షింపను' " అని పలికెను.

40. సొలోమోను యరోబామును చంపజూచెను గాని అతడు ఐగుప్తునకు పారిపోయి సొలోమోను మర ణించువరకు షీషకు రాజుచాటున తలదాచుకొనెను.

41. సొలోమోను జీవితములోని ఇతర అంశ ములు - అతడు చేసినపనులు, అతడు చూపిన విజ్ఞానము “సొలోమోను చరిత్రము"నందు లిఖింపబడియేయున్నవి.

42. అతడు యెరూషలేము నుండి నలుబది యేండ్లు యిస్రాయేలీయులందరిని పరి పాలించెను.

43. సొలోమోను తన పితరులతో నిద్రించి, తన తండ్రియైన దావీదు నగరమున సమాధి చేయబడెను. అతని తరువాత అతని కుమారుడు రెహబాము అతనికిమారుగా రాజయ్యెను."